01/02/2026
*ముగిసిన మేడారం జాతర*
*ఏర్పాట్లపై భక్తుల్లో తీవ్ర అసంతృప్తి*
*ప్రభుత్వ వైఫల్యంతో ఆగం ఆగమైన భక్తులు*
*అనుభవం లేని అధికారులతో ట్రాఫిక్ కుప్పకూలింపు*
*సీతక్క ఫ్లెక్సీల హడావుడి.. మౌలిక వసతులపై నిర్లక్ష్యం*
మేడారం / వరంగల్.
ప్రపంచ ప్రఖ్యాత మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరలో ఈసారి ప్రభుత్వ ఏర్పాట్లు పూర్తిగా విఫలమయ్యాయని భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “చిన్నచిన్న ఇబ్బందులే” అని మంత్రి సీతక్క వ్యాఖ్యానించడం వాస్తవ పరిస్థితులకు పూర్తిగా భిన్నమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
*14గంటల బస్సు ప్రయాణం*
సాధారణంగా వరంగల్ నుంచి మేడారం చేరేందుకు రెండు గంటల ప్రయాణమే సరిపోతే, ఈసారి 13 నుంచి 14 గంటల వరకు బస్సుల్లోనే చిక్కుకుపోయామని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు వరంగల్లో బస్సు ఎక్కిన భక్తులు, మరుసటి రోజు ఉదయం 9 గంటల తర్వాతే మేడారం చేరిన పరిస్థితి నెలకొందని తెలిపారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని వాపోయారు.
*అడవుల్లోనే వాహనాలు?*
అనేక కార్లు రాత్రంతా అడవుల్లోనే నిలిచిపోయాయని, కనీస వెలుతురు, నీరు, టాయిలెట్ సౌకర్యాలు లేక భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారని తెలిపారు. సింగిల్ రోడ్లు ఉన్న గత జాతరల్లో కూడా ఇలాంటి పరిస్థితులు రాలేదని, డబుల్ రోడ్లు, ఆధునిక సాంకేతికత ఉన్నప్పటికీ ఈసారి పరిస్థితి మరింత దారుణంగా మారిందని విమర్శించారు.
*అనుభవం లేని యంగ్ ఆఫీసర్లు?*
రోడ్డు మార్గాల్లో క్షేత్రస్థాయిలో ఒక్క అనుభవజ్ఞుడైన అధికారి కూడా సమర్థవంతంగా పని చేయలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమ్మవార్లను తీసుకొచ్చే సమయంలో మాత్రం పదుల సంఖ్యలో యంగ్ పోలీస్ అధికారులు కనిపించారని, గద్దెల చుట్టూనే హడావుడి పరిమితమైందని భక్తులు విమర్శిస్తున్నారు. గతంలో రోడ్లను సెక్టార్లుగా విభజించి, ప్రతి సెక్టార్కు ఒక అధికారి నియమించేవారని గుర్తు చేస్తున్నారు.
*వరంగల్ పోలీస్ అధికారుల సేవలు వినియోగించుకోలేదు?*
అనుభవం ఉన్న వరంగల్ పోలీస్ అధికారుల సేవలను ఎందుకు వినియోగించుకోలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గన్ ఫైరింగ్లు, డాన్స్లు కాదు, టెక్నాలజీని ఉపయోగించి భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాల్సిందని అభిప్రాయపడుతున్నారు.
*సీతక్క ఫ్లెక్సీలకు ప్రాధాన్యం.. వసతులకు నిర్లక్ష్యం?*
ఎక్కడ చూసినా ఫ్లెక్సీలే కనిపించాయని, వాటికి ఇచ్చిన ప్రాధాన్యత భక్తులకు ఉపయోగపడే టాయిలెట్లు, మంచినీటి సౌకర్యాలపై లేకపోయిందని భక్తులు బహిరంగంగా విమర్శించారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ప్రతి చోట కనీసంగా నీరు, టాయిలెట్లు ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
*వీవీఐపీ దర్శనాలపై విమర్శలు?*
ఒక సీరియల్ నటిని "ఓ పోలీస్ అధికారి" పోలీస్ వాహనంలో తీసుకొచ్చి వీవీఐపీ ప్రోటోకాల్ దర్శనం కల్పించినట్లు సమాచారం.
అనంతరం సదరు నటి పోలీస్ టోపీ, లాఠీతో ఫోటోలు దిగడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సాధారణ భక్తులు గంటల తరబడి ఇబ్బందులు పడుతుంటే, ఇలాంటి వ్యవహారాలు అన్యాయమని భక్తులు మండిపడుతున్నారు.
*కానిస్టేబుళ్లకు కష్టాలు.. అధికారులకు ఎంజాయ్?*
జాతర నిర్వహణలో కష్టపడ్డది మాత్రం క్షేత్రస్థాయి కానిస్టేబుళ్లేనని, పై స్థాయి యంగ్ అధికారులు మాత్రం బాధ్యతలకన్నా హడావుడికే పరిమితమయ్యారని విమర్శలు వినిపిస్తున్నాయి.
*ఇది చిన్న ఇబ్బందులు కాదు*
రాష్ట్ర జనాభాలో సుమారు పావు వంతు భక్తులు వచ్చే ఈ మహాజాతరను సమర్థంగా నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని భక్తులు ఏకగ్రీవంగా అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్ర జనాభాలో సుమారు పావు వంతు అంటే కోటిన్నర మంది భక్తులు వచ్చే ఈ మహాజాతరకు మించిన ప్రాధాన్యత కలిగిన కార్యక్రమం ప్రభుత్వానికి ఇంకేముందని ప్రశ్నిస్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి విగ్రహాలు, అలంకరణలు చేయడం కంటే, అమ్మవార్లపై అపార భక్తితో వచ్చిన భక్తులను కనీసం సాటి మనిషిలా చూసుకునే ఏర్పాట్లు చేయాల్సిందని అభిప్రాయపడుతున్నారు.
ఉద్యోగం లేక అల్లాడుతున్న యువతకు తాత్కాలిక ఉపాధి వారం రోజుల పాటు కల్పిస్తూ, భక్తులకు సమాచారం, మార్గనిర్దేశం, అవసరమైన సహాయం అందించేలా వాలంటీర్లను నియమించి ఉంటే, వృద్ధులు–పిల్లలను గద్దెల వరకు చేర్చే ఏర్పాట్లు చేయవచ్చని, దీనికి గరిష్టంగా 2 కోట్ల వరకు సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఇది చిన్నచిన్న ఇబ్బందులు కాదని, మొత్తం ప్రభుత్వ వైఫల్యమేనని మేడారానికి వచ్చిన భక్తులంతా రాజకీయాలకు అతీతంగా స్పష్టంగా చెబుతున్నారు.