02/12/2024
*"పోలి స్వర్గం"!!* (ప్రత్యేక కథ)
*పోలి స్వర్గం పేరెలా వచ్చింది!!* కార్తీక నెలంతా ప్రత్యేకమే!!, అయితే ఉత్థాన ఏకాదశి నుంచి కార్తీక పౌర్ణమి వరకూ చాలా ప్రత్యేకం!!, ఆ తర్వాత మళ్లీ కార్తీకమాసం ఆఖరి రోజైన పోలి స్వర్గం విశేషమైనది.*
*ఈ రోజు వేకువజామునే దీపాలు వదలడంతో కార్తీకమాసం పూర్తవుతుంది. నెల రోజుల పాటు కార్తీకమాస నియమాలు అనుసరించినవారు పోలి స్వర్గం రోజు దీపాలు వెలిగిస్తారు. ఇంతకీ ఆ రోజుని పోలి స్వర్గం అని ఎందుకంటారు? ఎవరా పోలి? దీనికి సంబంధించి కార్తీక పురాణంలో ఓ కథ ఉంది*
*పూర్వం ఓ గ్రామంలో ఉమ్మడి కుటుంబంలో ఐదుగురు కోడళ్లుండేవారు. వారిలో చిన్నకోడలే పోలి. ఆమెకు దైవ భక్తి ఎక్కువ. కానీ ఆ దైవభక్తే శాపంగా మారి అత్తగారి ఆగ్రహానికి కారణమైంది. చిన్నకోడలి భక్తి చూసి ఓర్వలేని అత్త..తనకన్నా భక్తురాలు ఉండకూడదని భావించింది. అందుకే పోలిని ఏ పూజలు, నోములు, వ్రతాలు చేయనిచ్చేది కాదు..తనను అనుసరించే మిగిలిన కోడళ్లతో అన్నీ చేయించేది. కార్తీకమాసం రానే వచ్చింది. నెల రోజులూ ఇంటి పనులన్నీ చిన్నకోడలికి అప్పగించి మిగిలిన కోడళ్లను తీసుకుని నదీతీరానికి వెళ్లి స్నానమాచరించి దీపాలు వెలిగించి వచ్చేది అత్తగారు. అస్సలు నిరాశ చెందని పోలి...ఇంటి దగ్గరే పెరట్లో ఉన్న పత్తి నుంచి ఒత్తి చేసుకుని వెన్నను రాసి దీపం వెలిగించేది. నదికి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చేసరికి ఆ దీపం కనిపించకుండా బుట్ట బోర్లించేది. ఇలా కార్తీకమాసం మొత్తం నెల రోజులూ దీపం వెలిగించింది. కార్తీకఅమావాస్య తర్వాత పాడ్యమి రోజు కూడా ఎప్పటిలా ఇంట్లో పనులు పూర్తిచేసుకుని దీపం పెట్టింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా భక్తి తప్పని పోలిని చూసి దేవదూతలు దిగివచ్చారు.ఆమెను ప్రాణాలతోనే స్వర్గానికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. నదికి వెళ్లి వచ్చిన అత్తగారు, తోడికోడళ్లు పుష్పక విమానాన్ని చూసి ఆశ్చర్యపోయారు. తమ భక్తికి మెచ్చి అది వచ్చిందనుకున్నారు..కానీ దేవదూతలు పోలిని తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. తాము కూడా వెళ్లాలన్న పట్టుదలతో పోలి కాళ్లు పట్టుకుని వేలాడారు..అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. స్వర్గానికి వచ్చేంత కల్మషం లేని భక్తి పోలికి మాత్రమే ఉందని చెప్పారు దేవదూతలు.*
*కార్తీకమాసం అమావాస్య మర్నాడు వచ్చే పాడ్యమి రోజు దీపం వెలిగించి ఈ కథ చెప్పుకుంటే ...ఆమెలా స్వర్గానికి చేరుకుంటారని భక్తుల విశ్వాసం. ఈ నెల రోజులూ ఎలాంటి నియమాలు పాటించకపోయినా పోలి పాడ్యమి రోజు కనీసం 30 వత్తులు వెలిగిస్తారు..ఇలా చేస్తే నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందని భావిస్తారు. ఈ రోజు బ్రాహ్మణులకు స్వయంపాకం, దీపదానం చేస్తారు.*
*కథ కంచికి మనం ఇంటికి*
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
*లోకా సమస్తా సుఖినోభవన్తు!*