11/01/2025
జనవరి 11 సృష్టిలో దేవుని సార్వభౌమత్వం
"ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమును బట్టి అవి యుండెను; దానినిబట్టియే సృజించబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు, తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి" (ప్రకటన 4:11).
దేవుని గుణలక్షణాలన్నీ ఆయన యొక్క సార్వభౌమత్వాన్ని బట్టే పని చేస్తుంటాయని ఇంతకు ముందు ధ్యానాల్లో చర్చించాము. ఇప్పుడు ఆయన మార్గాలన్నిటిలోనూ, చర్యలన్నిటిలోనూ ఈ సార్వభౌమత్వం ఎలా కనబడుతుందో చూద్దాం.
ఆది 1:1కి ముందు మహా విశాలమైన నిత్యత్వముండేది. అప్పటికి విశ్వమింకా నిర్మించబడలేదు. సృష్టి కేవలం ఆ గొప్ప సృష్టికర్త యొక్క ఆలోచనలోనే ఉంది. తన సార్వభౌమ మహిమలో దేవుడు మాత్రమే ఒంటరిగా వసించాడు. ఆకాశాలు, భూమి సృష్టించబడడానికి ముందున్న ఆ అనంతమైన యుగం గురించి నేను మాట్లాడుతున్నాను. అప్పుడు దేవునికి స్తుతులు పాడేందుకు దేవదూతలు లేరు. ఆయన గమనాన్ని ఆకర్షించడానికి సృష్టిలోని ప్రాణులు ఏవీ లేవు. అదుపు చేయాల్సిన తిరుగుబాటుదారులు ఎవ్వరూ లేరు. తన విశాల విశ్వంలో, గంభీరమైన నిశ్శబ్దంలో ఆ మహా దేవుడొక్కడే నివసించాడు. ఒకవేళ దాన్ని కాలమని సంబోధించగలిగితే, ఆ కాలంలో కూడా దేవుడు సార్వభౌముడే!
తన చిత్తానుసారమైన సంకల్పాన్ని బట్టి సృష్టించడానికీ, సృష్టించకుండా ఉండటానికి కూడా ఆయనకు అధికారముంది. ఏ విధంగానైనా సృష్టించే స్వేచ్ఛ ఉంది. ఒకే ప్రపంచాన్ని, లేదా లక్షలాది ప్రపంచాలను సృష్టించే స్వతంత్రముంది. ఆయన చిత్తాన్ని ఎదిరించడానికి అప్పుడు ఎవరున్నారు? లక్షలాది వివిధ ప్రాణుల్ని ఉనికిలోకి తీసుకొచ్చి, సంపూర్ణ సమానత్వాన్ని వాటికిచ్చి, ఒకే విధమైన సామర్థ్యాలను అనుగ్రహించి, వాటన్నిటినీ ఒకే రకమైన పరిస్థితుల్లో, వాతావరణంలో ఆయన ఉంచగలడు. లేదంటే ఒకదానికొకటి భిన్నంగా ఉండే ప్రాణుల్ని, అంటే సృష్టించబడడంలో తప్ప మరి ఏ విషయములోనూ పోలిక లేని జీవులను సృష్టించే స్వేచ్ఛ ఆయనకు ఉంది. ఆయనకున్న హక్కును సవాలు చేయగలిగినవాడెవడు? ఆయనకు నచ్చితే, పరిమితులకు అతీతమైన, విస్తారమైన ప్రపంచాన్ని ఆయన ఉనికిలోకి తెచ్చుండేవాడు. ఆయనకిష్టమైతే కేవలం అత్యంత శక్తివంతమైన సూక్ష్మదర్శిని (మైక్రోస్కోపు) మాత్రమే మానవ నేత్రాలకు చూపించగలిగేంత చిన్నదైన ప్రాణిని ఆయన సృష్టించగలిగి ఉండేవాడు. తన సింహాసనం చుట్టూ మండే మహా సెరాపుల్ని సృష్టించడానికీ, పుట్టిన ఘడియలోనే చనిపోయే అతి సూక్ష్మమైన పురుగును సృష్టించడానికీ సార్వభౌమునిగా ఆయనకు హక్కు ఉంది. ఉన్నతులైన సెరాఫులు, నేలమీద ప్రాకే జంతువులు, విశ్వమంతా పరిభ్రమించే గ్రహాలు, తేలియాడే అణువులు, అఖిల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, ఇవన్నీ ఒకదానికొకటి చాలా భిన్నమైనవి.
ఇతర గ్రహాలన్నింటి కంటే సూర్యుడు ఎంతో మహిమకరంగా ఉంటాడు. కొన్ని నక్షత్రాలు బ్రహ్మాండంగాను, మరికొన్ని చిన్నవిగాను ఉంటాయి. ప్రపంచంలో ఉన్న దేశాలు వాతావరణపరంగా భౌగోళికంగా వనరుల పరంగా భిన్నంగా ఉంటాయి. జంతువుల్లో పక్షుల్లో ఫలాల్లో పూలలో వైవిధ్యాలు ఎన్నో ఉన్నాయి. ప్రధాన దూతలు, సెరాపులు, కెరూబులు, మహాదూతలు, దేవదూతలు వివిధ స్థాయిల్లో ఉన్నట్లు మనకు కనబడతారు. ఒకే కుటుంబంలో పుట్టిన బిడ్డలు కూడా ఎంతో భిన్నంగా కనిపిస్తారు, జీవిస్తారు. కారణమేంటి? బలవంతుడైన దేవుడు వీటిని తన విశ్వంలో సృష్టించాలని నిర్ణయించుకున్నాడు. ఒకవేళ అలా కాకుండా సమస్తాన్నీ ఒకేరీతిగా సృష్టించాలనుకుంటే, ఆయన సార్వభౌమ సంకల్పాన్ని ప్రశ్నించగలిగిన వాడెవడున్నాడు? అందువల్ల భక్తుడైన యోహాను రాసిన విధంగా, "ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమును బట్టి అవి యుండెను; దానినిబట్టియే సృజించబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని" ఆయనను స్తుతిద్దాం.
ఏ.డబ్ల్యూ.పింక్