24/09/2025
🚩*శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి అలంకారం*🚩
నవరాత్రులలో మొదటి రోజున భక్తులందరూ అమ్మ వారిని మనసారా శ్రద్దాభక్తుల తో అర్చించుకుని అద్భుతమైన అనుభూతిని పొంది జన్మధన్యం చేసుకుంటారు.
దేవీనవరాత్రులలో ఈ రోజు అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు అని పెద్దలు చెపుతారు. దేదీప్యంగా విరాజిల్లే అమ్మ వారి అలంకారం 'శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి అలంకారం’.
త్రిపురత్రయంలో ప్రధమ శక్తి స్వరూపిణి ఈ దేవత. ఈ రోజున నిర్మలమైన ముద్దులొలికే ముచ్చటైన బాలామణి రూపాన పూజలందు కుంటుంది.
సర్వేశ్వరుడైన త్రిపురేశ్వరుని అర్ధాంగి అయిన జగన్మాతే ఈ బాలాత్రిపుర సుందరీదేవి!
త్రిపురాంతకం అనబడే ఒక శైవక్షేత్రం లో అమ్మను ఈ రూపంలో దర్శించుకోవచ్చు. త్రిపురాసురుడనే ఒక భీకర రక్కసుని అంతమొందించి భక్తుల కొంగు బంగారం చేయడానికి త్రిపురేశ్వరుడు మరియు త్రిపురసుందరీ దేవి ఈ క్షేత్రంలో కొలువై ఉన్నారు.
బాలా త్రిపుర సుందరి దేవి అంటే
త్రిపురుని భార్య అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరి దేవి అని అర్ధం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాల త్రిపుర సుందరిదేవి ఆధీనంలో ఉంటాయి.
అభయ హస్త ముద్రతో, అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి.నిత్య సంతోషం కలుగుతుంది.
త్రిపుర సుందరి దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత.షోడశ విద్యకు ఈ దేవత అధిష్ఠాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలర్చన చేస్తారు.అసలు బాల త్రిపుర అనే పేరే పరమ పవిత్రమైన పేరు.
ఈ తల్లి త్రిపుర సుందరి దేవి అయ్య వారు ఎమో త్రిపురాంతకుడు ఆది దంపతులు వారి తత్వము కూడా అటువంటిది.
త్రిపుర సుందరి అంటే మనలోని మూడు అవస్తలు జాగృత్, స్వప్న , సుషుప్తి.
ఈమూడు అవస్థలు లేదా పురములకు బాల అధిష్ఠాన దేవత.
ఈమూడు పురములను శరీరముగా చేసుకొని, ఈ జగత్తు అంతటిని అనుభవింపచేస్తూ బాలగా అమ్మవారు సంతోషిస్తుంది.
మనము ఎన్ని జన్మలు ఎత్తిన ఈ ముడు అవస్థలలోనే తిరుగుతూ ఉంటాము. కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి.అటువంటి తల్లి ఈ రూపములో మనలోనే ఉంది.ఆవిడ ఆత్మ స్వరూపురాలు ఆవిడను పూజిస్తే జ్ఞానము కలిగి తానే శివ స్వరూపముతో చైతన్యము ప్రసాదించి మోక్షమునకు అనగా పరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తుంది.
బాలా త్రిపురసుందరి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో, లలితా సహస్రంలో కూడా మనకు కనిపిస్తుంది. భండాసురుడు అనే రాక్షసునకు ముప్ఫై మంది పిల్లలు. వీళ్ళందరు అవిద్యా వృత్తులకు సంకేతం.
హంసలచే లాగ బడుతున్న కన్యక అనబడే రథం పై వచ్చి ముప్ఫైమంది భండాసుర పుత్రులనూ సంహరించింది. ఆ అసురులు సామాన్యులు కారు. ఇంతకు పూర్వం యుద్ధాలలో ఇంద్రాది దేవతలను గడగడలాడించినవారు. అంత భయంకరమైన వారు, వారందరినీ ఒక్కతే కేవలం ఒక్క అర్థచంద్ర బాణంతో సంహరించిందిట.
బాలగా కనపడుతున్నా శక్తికి ఏమీ తక్కువ కాదు. బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతున్నది.హంసల రథం అమ్మది హంసలు అంటే శ్వాసకు సంకేతం.ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన శ్వాసని, ప్రాణశక్తిని అక్కడ హంసగా పోలుస్తారు.ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాలారాధనగా పిలవబడుతున్నది.
శ్రీ బాలాత్రిపుర సుందరీ గాయత్రీ ధ్యాన శ్లోకం:-
బాలా త్రిపురసుందరి త్రిపురేశ్యైచ విద్మహే!
కామేశ్వర్యై చ ధీమహీ
తన్నోబాలా ప్రచోదయాత్!!
పూజా ఫలితం:- అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శత్రువులను లేకుండా చేస్తుంది. ధనాధాయాన్ని పెంచుతుంది. ఆయుషును వృధ్ధి చేస్తుంది. ఆరోగ్య బలాన్ని ఇస్తుంది.
ఈ అవతారంలో అమ్మ అభయ హస్త ముద్ర కలిగి అక్షర మాలను ధరించి వుంటుంది. దేదీప్యమానమైన ఈ దివ్యమంగళ రూపాన్ని మనః ఫలకం పై నిలుపుకుని, ఆరాధిస్తే భక్తుల మనస్సుని, బుద్ధిని తేజోవంతం చేస్తుంది. శ్రీ చక్రం లోని ప్రధమ దేవత ఈ రూపం! సమస్త కళలకు అధినేత ఈ దేవత. ఏ కళ లో రాణించాలన్నా ఈమె చల్లని చూపులు మన మీద పడాలి. ఈ బాలాత్రిపురసుందరీ దేవి ఆరాధన లో భాగంగానే నవరాత్రులలో బాల పూజ విశిష్ట స్థానం పొందింది.
*'ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ బాల త్రిపురసున్దర్యై నమః'* అని వీలైనన్ని సార్లు జపించుకుంటే చాలా శుభప్రదం!