25/05/2026
*శ్రీ మహావిష్ణు పురాణం*
98 వ భాగం
*శ్రీకృష్ణావతారం 1.
*కథ ప్రారంభం -
*కంసుడు అశరీరవాణి మాట విని దేవకి వసుదేవులను కారాగారంలో ఉంచుట:
త్రేతాయుగంలో అంతరించిన దానవులు, రాక్షసులు ద్వాపర యుగంలో దానవాంశ గల రాజులుగా జన్మించి ఆరాచకాలు, అన్యాయాలు చేయసాగారు. భూమికి, భూమి పైగల ప్రజలకు అంతులేని కష్టాలు కలిగాయి. భూమి పై జనాభా కూడ అధికమై భూభారం భూదేవికి మోయలేనంతగా పెరిగింది, ప్రజల ఆక్రందనలు, భూభారం భరించలేక భూదేవి బ్రహ్మలోకము వెళ్లింది.
ఆ సమయంలో బ్రహ్మదేవుడు దేవతలు, మహర్షులతో సభ నిర్వహిస్తున్నాడు.
విచారవదనంతో వచ్చిన భూదేవిని చూసి “వసుంధరా! ఏమైంది ఇంత దుఃఖంగాఉన్నావు" అని అడిగాడు.
భూదేవిదుఖము నిగ్రహించుకుంటూ "పితామహా! మీరందరూ శ్రీమహావిష్ణువు దయతో సుఖసంతోషాలతో ఉన్నారు. భూమి మీద పాపభారంతో నేను నలిగిపోతున్నాను. నేను శ్రీహరి భార్యనని చెప్పుకోటానికే ఉన్నాను. కష్టాలు మాత్రమే నాకు ఉన్నాయి. సంపదల అధినేత్రి మహాలక్ష్మి శ్రీహరితో వైకుంఠంలో సుఖంగా ఉంది.
త్రేతాయుగంలో అంతరించిన దానవులు, రాక్షసులు ద్వాపర యుగంలో రాక్షసాంశ రాజులుగా జన్మించి పాలిస్తూ సాధు జనులను హింసిస్తున్నారు. ధర్మానికి హాని కలిగించే వీరి సంతతి అమితం గా పెరిగి మోయలేని భారం అయింది. కాలనేమి కంసుడిగా జన్మించి భరించరాని అరాచకాలు చేస్తున్నాడు. జరాసంధ, నరకాసుర, అరిష్ట, ధేనుక, శిశుపాలాది అనేకులు దానవాంశతో జన్మించి అనేక దురాగతాలు చేస్తున్నారు. ఈ పాపభారం నుండి నన్నుకాపాడండి" అని దుఖించసాగింది.
బ్రహ్మదేవుడు భూదేవిని ఓదారుస్తూ "తల్లీ! దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసేవాడు నారాయణుడు. పదమ్మా! మనమందరం వైకుంఠం వెళ్లి దేవదేవునికి విషయం విన్నవించి రక్షించమని ప్రార్ధించుదాము” అని భూదేవిని తీసుకుని, దేవతలు మహర్షులు వెంట రాగా వైకుంఠం వెళ్లాడు.
లక్ష్మీదేవి నారాయణులు శేషతల్పం పై ఉండగా సనకస నందాదులు ఒకవైపు, నారద తుంబురులు మరో పక్క ఉండి స్తుతిస్తోత్రాలు చేస్తున్నారు. మంచి సమయానికి వచ్చాము అని ఆనందించి బ్రహ్మదేవుడు భూదేవి, దేవతలు, మహర్షులుతో కలసి శ్రీహరిని కీర్తిస్తూ "విష్ణు స్తవం" పఠించాడు.
ఆ స్తవము బ్రహ్మదేవ కృతమైన శ్రీమహావిష్ణుస్తవముగా ప్రసిద్ధి చెంది పఠించువారి కష్టాలు తీర్చేదిగా అయ్యింది.
శ్రీహరి ప్రసన్నుడై తన కరుణా వీక్షణాలు ప్రసరించి రాకకు కారణం అడిగాడు. బ్రహ్మదేవుడు నమస్కరించి "నారాయణా! దుష్టులు అధికంగా అవ్వడంతో పాపాలు, జనాభా పెరగడంతో భూభారం భూదేవి మోయలేక పోతోంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకై భూమి పై తమరు అవతరించే సమయం ఆసన్నమైంది. అవతారమెత్తి భూదేవిని రక్షించండి" అని ప్రార్ధించాడు.
భూదేవి, బ్రహ్మాది దేవతల ప్రార్ధనలు ఆలకించిన మహావిష్ణువు తన శరీరం నుండి రెండు కేశములు తీసి భూభాగం పై వదిలాడు. "ఈ సీతావర్ణ కేశము ఆదిశేషుడి అంశంతో దేవకి సప్తమ గర్భంలో ప్రవేశిస్తుంది. యోగమాయ నా ఆదేశం ప్రకారం ఆ శిశువును దేవకి గర్భం నుంచి తీసి రోహిణి గర్భంలో ప్రవేశ పెడుతోంది. సంకర్షణుడు అనే పేరుతో ఆదిశేషుడు జన్మించి బలరామునిగా ప్రసిద్ది చెందుతాడు.
ఈ నీలవర్ణము కేశము నా అంశతో దేవకికి అష్టమ సంతానంగా జన్మించి నందగ్రామంలోని యశోదమ్మ చెంతకు చేరి శ్రీకృష్ణుడు అనే నామం పొందుతుంది. నేను సంపూర్ణ అవతారమూర్తి అయిన శ్రీకృష్ణుడిగా దుష్టులను సంహరించి భూభారం తగ్గించుతాను. శిష్టులను రక్షిస్తాను. దేవతలందరు తమ తమ అంశలతో కురు పాండవ వంశాలలో జన్మించి నా దుష్ట సంహారంలో సహకరించండి.
భవిష్యత్తులో భూమిపై జరగబోయే మహాయుద్ధంలో జన సంహారం జరిగి భూభారం తగ్గుతుంది" అని అభయం ఇచ్చాడు.
బ్రహ్మాది దేవతలు,భూదేవి,మహర్షులు మహావిష్ణువుకి ప్రణమిల్లి తమ తమ నెలవులకు వెళ్లి శ్రీహరి భూమి పై అవతరించే శుభ తరుణం కోసం ఎదురు చూడసాగారు.
మధురానగర రాజైనఉగ్రసేనుడికి పదిమంది కుమారులు జన్మించారు. జేష్ఠుడైన కంసుడు తనతొమ్మిది మంది సోదరులతో మధురకు యువరాజుగా ఉండేవాడు. ఉగ్రసేనుని సోదరుడు దేవకునికి ఏడు మంది కుమార్తెలు ఉన్నారు. వారిలో కనిష్ట పుత్రిక దేవకీదేవి అంటే కంసుడికి అమితమైన ప్రేమ.
యదువంశ రాజైన శూరుడికి పదిమంది కుమారులు, ఐదుగురు కుమార్తెలు కలిగారు. పెద్దవాడైన వసుదేవుడు రోహిణీదేవిని వివాహం చేసుకున్నాడు. సంతానం కలుగకపోవడంతో వసుదేవుడు దేవకీదేవితో సహా దేవకుని ఏడుగురు కుమార్తెలను వివాహం చేసుకున్నాడు. కంసుడు తన అభిమాన సోదరియైన దేవకిదేవి వివాహం వసుదేవునితో స్వయంగా దగ్గరుండి ఆడంబరంగా జరిపించాడు.
అత్తగారింట దింపడానికి వసుదేవుడు దేవకీదేవిని రథంలో కూర్చోబెట్టి మేళతాళాల మధ్య తానే రథసారథియై రథం నడుపుతూ తీసుకువెళ్లసాగాడు. మార్గ మధ్యంలో అశరీరవాణి కంసుడిని ఉద్దేశించి "కంసా! నీదురాగతాలు అంతమయ్యే రోజు దగ్గరకు వచ్చింది. నిన్ను చంపబోయేవాడు నీ ప్రియసోదరి అష్టమపుత్రుడిగా జన్మించబోతున్నాడు! జాగ్రత్త! రాబోయే మృత్యువు తప్పాలంటే సరైన నడవడిక కలిగి ఉండుము" అని హెచ్చరించింది.
కంసుడిలోని రాక్షసత్వం అశరీరవాణి చెప్పిన హెచ్చరిక వినకుండా దేవకిని ఇప్పుడే చంపేస్తే పుత్రుడనేవాడే జన్మించడు కదా! చంపేవాడే ఉండడు కనుక దేవకిని వెంటనే చంపేయి! అని ప్రేరేపించింది.
కంసుడు రథం ఆపి దేవకిని జుట్టు పట్టుకుని కిందకు లాగి కత్తితో తల నరికి చంపబోయాడు. వసుదేవుడు కంసుడి చేయి పట్టుకుని ఆపుతూ
"బావా! అశరీరవాణి చెప్పిందని ప్రేమగా చూసుకుంటూ పెంచిన ప్రియ సోదరిని చంపడం న్యాయమా? స్త్రీ హత్య మహాపాతకం. అశరీరవాణి మాటలు నిజమని నీవు నమ్మితే, నేను చెప్పేది వినుము. నిన్ను చంపేవాడు దేవకి గర్భాన పుడతాడు. కావున నీ శత్రువు దేవకి కాదు. దేవకికి పుట్టబోయే బిడ్డ! పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. దేవకి పుట్టబోయే ప్రతి శిశువుని పుట్టిన మరుక్షణమే నీకు తెచ్చి అప్ప గిస్తాను. నవ వధువైన దేవకిని చంపకుండా వదిలివేయుము" అని ప్రార్ధించాడు.
కంసుడు ఆలోచించాడు. "దేవకిని చంపితే తనను చంపేవాడు తనకు తెలియకుండా మరొక చోట జన్మించ వచ్చును. అదే దేవకిని బంధించి తన దగ్గరే వుంచుకుంటే, చంపబోయేవాడిని తనే పుట్టిన వెంటనే సంహరించి శత్రుశేషం లేకుండా చేసుకోవచ్చు.
కంసుడు దేవకిని వదలి పెట్టి "వసుదేవా! నీ మాట మీద దేవకిని చంపకుండా వదిలి పెడుతున్నాను. మీరిరువురు నా వద్దనే కారాగారంలో బందీలుగా ఉంటారు. అన్నమాట ప్రకారం దేవకి సంతానాన్ని పుట్టిన వెంటనే నాకు అప్పగించాలి" అని వారిని బంధించి మధుర తీసుకెళ్లి చెఱశాలలో ఉంచాడు. అడ్డుపడిన తండ్రి ఉగ్రసేనుని కూడా కంసుడు బంధించి చెఱశాలలో పడవేసి తానే మధురకు రాజుగా ప్రకటించుకున్నాడు. వసుదేవుడు,దేవకిలను కారాగారంలో బంధించారని తెలిసిన వసుదేవుని భార్యలు రోహిణి మొదలైనవారు రహస్యంగా గోకులం చేరి వసుదేవుని మిత్రుడైన నందుని ఇంట ఆశ్రయం పొందారు.
“శ్రీకృష్ణ చరితం జన్మించిన దగ్గరి నుంచి నిర్యాణం వరకు వివరంగా వినాలని ఉంది.
శ్రీకృష్ణావతార లీలలను విని ధన్యులం అవుతాము" అని కోరగానే శ్రీకృష్ణ చరిత్ర సూత మహర్షి సరేనని చెప్పసాగాడు.
🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕