24/04/2026
శ్రీ జయంతి సత్య వేంకట ఉమాపతి శర్మ గారి అకాల మరియు ఆకస్మిక నిర్యాణం నిజంగా దిగ్భ్రాంతికరం.
శ్రీ దత్తాత్రేయ వేద విద్యా గురుకులానికి సంస్థాపక కోశాధికారిగా ఆయన అందించిన సేవలు, వేద విద్య పట్ల ఆయనకు గల నిరుపమానమైన అనురాగం వర్ణనాతీతం.
ఒక సాధకుడు తన జీవితాన్ని ధర్మబద్ధంగా, సనాతన ధర్మ విలువల కోసం అంకితం చేసినప్పుడు, ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చేసిన ధర్మకార్యాలు నిరంతరం జీవించే ఉంటాయి.
తాను భారతీయ స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగిగా పనిచేసినప్పటికీ తన యేకైక కుమారుడిని వేద విద్యలో ప్రవేశపెట్టడం ద్వారా ఆయన ఒక గొప్ప వారసత్వాన్ని జాతికి అందించారు.
ఈ కష్టసమయంలో వారి కుటుంబ సభ్యులకు గురుకుల సభ్యుల తరపున, ఈ క్రింది నివాళి సమర్పిస్తున్నాము .
శ్రీ జయంతి సత్య ఉమాపతి శర్మ గారు
"ధర్మో రక్షతి రక్షితః" అన్న సూక్తికి నిలువెత్తు రూపం . వేదమాత సేవలో తరించిన పుణ్యమూర్తి .
శ్లో||
వేదశ్రీనిలయ శ్చ ధర్మనిరతః సత్యైకవర్తీ చ సః
దత్తాత్రేయపదాబ్జసేవకమణిః శర్మాఖ్య సద్భావధీః
సాయుజ్యం శివలోకధామమగమత్ పుణ్యైః కృతైః పావనైః
ధైర్యం దేహి కుటుంబకే చ నితరాం హే వేదమాత స్సదా ||
వేదశోభకు నిలయమైనవాడు, నిరంతరం ధర్మనిరతుడు, ప్రశాంత సత్య చిత్తుడు, శ్రీ దత్తాత్రేయ స్వామి పాదపద్మ సేవకుడు అయిన సత్య ఉమాపతి శర్మ గారు తాను చేసిన పవిత్ర పుణ్యకార్యాల వల్ల ఆ పరమశివునిలో సాయుజ్యాన్ని -పునరావృత్తి రహిత స్థితిని- పొందారు.
ఓ వేదమాత! ఆయన వియోగాన్ని తట్టుకునే ధైర్యాన్ని, స్థైర్యాన్ని వారి కుటుంబ సభ్యులకు ప్రసాదింతువు గాక.
శర్మ గారు కేవలం ఒక వ్యక్తిగా కాకుండా, వేదగురుకులానికి ఒక మూలస్తంభంగా నిలిచారు. "జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణమ్" అన్నట్లు, వేద సేవలో నిమగ్నమైన వారికి ఉత్తమ గతులు లభిస్తాయన్నది శాస్త్ర ప్రమాణం. ఆయన శివసాయుజ్యాన్ని పొందారన్నది నిశ్చయం.
జీవితాంతం ధర్మాన్ని నమ్మి, తన సంతానాన్ని కూడా వేద మార్గంలో నడిపించిన ఆ మహానుభావుని ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనం వారికి ఇచ్చే నిజమైన నివాళి.
ఆ వేదమాత, దత్తాత్రేయ స్వామి వారి కుటుంబానికి కొండంత అండగా ఉండాలని ప్రార్థిస్తున్నాము .
ఓం శాంతిః శాంతిః శాంతిః
వారి కుటుంబ సభ్యులకు సార్ద్రమైన మనస్సులతో ఈ సందేశం అందిస్తున్నాము .
ఇట్లు
శ్రీ దత్తాత్రేయ వేద విద్యా గురుకుల :అధ్యక్షకార్య దర్శులు , ఇతర సభ్యులు .
అధ్యాపకులు , వేదవిద్యార్థి బృందం
రాజమహేంద్రవరమ్
19.04.2026.