13/10/2021
పిఠాపురం చరిత్ర వికీపీడియా నుండి
పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక ఒక గ్రామం మరియు అదే పేరుగల మండలమునకు కేంద్రము. పిన్ కోడ్: 533450
పిఠాపురాన్ని పూర్వం పీఠికాపురం అనేవారు. ఈ ఊరుకి అధిపతి పీఠాంబ. ఈ పీఠాంబ విగ్రహం ఒకటి - ఒక చేతిలో బంగారు పాత్ర, వేరొక చేత బాగుగా పండిన ఉసిరి కాయ, మూడవ చేత త్రిశూలం, నాల్గవ చేత లోహ దండం ధరించి - నేటి పిఠాపురానికి సమీపంలో, నాలుగు వీధులు కలిసే కూడలిలో ఉండేదట. ఇటువంటి విగ్రహమే ఒకటి ఈనాడు కొత్తపేటలో కుమారస్వామి ఆలయంలో ఉంది. ఈ విషయాన్ని ప్రముఖ కవీశ్వరుడు శ్రీనాథుడు భీమేశ్వర పురాణం లో ఈ కింది విధంగా చెబుతాడు.
"హాటక పాన పాత్రయును నారగ బండిన మాతులుంగమున్
ఖేటము లోహదండము నొంగి ధరియించి పురోపకంఠశృం
గాటక భూమి భాగమున గాపురముండెది పీఠికాంబకుం
గైటభదైత్యవైరిప్రియ కాంతకు మ్రొక్కె నతండు భక్తితోన్."
పిఠాపురానికి ఉత్తర దిక్కున ఏలేరు అనే ఏరు ఒకటి ఉంది( ప్రస్తుతం దీనిని చెరుకుల కాలువ అని అంటున్నారు). ఈ ఏలేరుని "జగతి నెక్కడివేలేటి సాటి నదులు" అంటాడు శ్రీనాథుడు అలా అనేసి ఊరుకోకుండా-
"ఏలేటి విరినీట నిరుగారునుంబండు
ప్రాసంగు వరిచేలు పసిడిచాయ."
అని చెబుతూ పిఠాపురం ప్రాంతం సస్యశ్యామలంగా ఉండేదని అప్పటి ఫల వృక్షాలనీ, పిండివంటలనీ శ్రీనాథుడు తన రచనలలో ఇలా వర్ణించేడు. ఒక్క వేరు పనస చెట్లు, పోక తోటలు ఇప్పుడు కనిపించటం లేదేమో కానీ, మిగిలినవన్నీ ఇప్పటికీ ఉన్నాయి. పిఠాపురం వరకు వచ్చిన శ్రీనాథుడు కళింగ దేశం వరకూ పర్యటించినట్లు ఆధారాలున్నాయి. సింహాచలం వరాహ నృసింహస్వామి ఆలయాన్ని దర్శించిన ఆధారాలూ ఉన్నాయి.పిఠాపురపు ఏలేరు ఉప్పాడ దగ్గర సముద్రంలో కలుస్తుంది. అన్నవరం దగ్గర ఉన్న పంపా నది కూడ సాగర సంగమం చెందే ముందు ఈ ఏలేటి నీటితో పొన్నాడ దగ్గర కలుస్తుందని చిలుకూరి పాపయ్య శాస్త్రి "శ్రీనాథ కృతి సమీక్ష" అనే పుస్తకంలో రాసేరు. ఒడ్డె రాజులతో వైరం పూనిన విజయనగరం గజపతులు ఈ నదుల సాగర సంగమ స్థానాన్ని పూరీ జగన్నాథంతో సమానమైన దివ్య క్షేత్రంగా రూపొందిద్దామని జగన్నాథ స్వామి, బలభద్ర స్వామి, సుభద్రా దేవి విగ్రహాలని ప్రతిష్ట చేసేరుట. ఈ జగన్నాథ స్వామి చేతులు ఇటీవల మొండి అగుటచే ఈ స్వామిని "మొండి జగ్గప్ప" అని ప్రాంతీయులు పిలుస్తారు.
పిఠాపురంలో కుంతీమాధవ స్వామి ఆలయం, కుక్కుటేశ్వరుడి కోవెలలు ఉన్నాయి. వృత్తాసురుడిని చంపిన తర్వాత బ్రహ్మహత్యా పాతకం నుండి తప్పించుకుందికి ఇంద్రుడు ఐదు వైష్ణవాలయాలు స్థాపించేడు. అవి [1].
కాశీ లో బిందు మాధవ స్వామి.
ప్రయాగ లో వేణు మాధవ స్వామి.
పిఠాపురంలో కుంతి మాధవ స్వామి.
తిరుచునాపల్లి లో సుందర మాధవ స్వామి.
రామేశ్వరం లో సేతు మాధవ స్వామి.
పౌరాణిక ప్రశస్తి
గయాసురుడు కావడానికి రాక్షసుడే అయినా మహా భక్తుడు. ఆయన రాక్షసులకు రాజు. వేలాది సంవత్సరాలు మహావిష్ణువును ప్రసన్నం చేసుకునేందుకు చాలా గొప్ప తపస్సు చేశారు. తను చేసిన అద్భుతమైన తపస్సుకు ప్రసన్నుడై మహావిష్ణువు వరం కోరుకొమ్మనగా నా శరీరం అన్ని పరమ పావనమైన తీర్థాలకన్నా పవిత్రమై ఉండేలాగా వరం కావాలని కోరుకున్నారు. విష్ణువు ఆ కోరికను మన్నించగా గయాసురుని శరీరం పరమ పవిత్రమైపోయింది. బ్రహ్మహత్య, సురాపాన, స్వర్ణస్తేయ, గురుతల్ప మొదలైన పంచమహాపాపాలు సహితంగా అన్ని రకాల పాపాలు ఆయన శరీరాన్ని తాకగానే నశించిపోయేవి. ఆయనను తాకివెళ్ళిన ప్రతివారూ నేరుగా మోక్షాన్ని పొందేవారు, అంతేకాక కీటకాలు, సూక్ష్మజీవులు కూడా గాలికి కొట్టుకువస్తూ ఆయన శరీరాన్ని తాకిపోతూండగానే మోక్షాన్ని పొందేవి.
ఇది కాక ఆయన చేసిన గొప్ప యాగాలు, పుణ్యకార్యాల వల్ల నేరుగా ఇంద్రపదవి లభించింది, అప్పటివరకూ స్వర్గాధిపతిగా ఉన్న ఇంద్రుడు పదవీభ్రష్టుడయ్యారు. పదవిని కోల్పోయిన ఇంద్రుడు కూడా ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకున్నారు. బ్రహ్మ ఓ గొప్ప యాగాన్ని తలపెట్టానని, దానికి తగ్గ పరమ పవిత్రమైన స్థలాన్ని చూపించమని గయాసురుణ్ణి కోరారు. గయాసురుడు చాలా భారీకాయుడు. 576 మైళ్ళ పొడవు, 268 మైళ్ళ నడుము చుట్టుకొలత కలిగిన అతికాయుడు కాబట్టి పవిత్రమూ, విశాలమూ అయిన తన తలపై యజ్ఞం చేసుకొమ్మని అనుమతించారు.
బ్రహ్మ యాగం వేడికి గయుని తల కదలడం ప్రారంభించింది. దాన్ని కదలకుండా చేసేందుకు బ్రహ్మ చాలా పెద్దపెద్ద శిలలను గయాసురిని తలపై పెట్టసాగారు. ఆ శిలలేవీ కూడా గయాసురుని తల కదలకుండా ఆపలేకపోగా అవన్నీ చుట్టూ పడి రామపర్వతం, ప్రేతపర్వతం వంటివి ఏర్పడ్డాయి. దానితో బ్రహ్మ చివరకు మరీచి శాపం వల్ల శిలగా మారిన మహాపతివ్రత దేవవ్రత శిలను తీసుకువచ్చి తలపై పెట్టారు. శిలారూపంలోనున్న మహాపతివ్రతను తోసివేయలేక కదలికలు కట్టడి చేసుకున్నా మొత్తానికి మానుకోలేకపోయాడు. అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని ప్రార్థించగా ఆయన గదాధారుడై వచ్చి తన కుడికాలు గయాసురుని తలపై పెట్టి తొక్కిపట్టారు.[3]
గయాసురుడు ఆ సమయంలో విష్ణుమూర్తిని ప్రార్థించి నా శరీరం పరమ పవిత్రమైన తీర్థక్షేత్రంగా వరం పొందింది. నా తలపై బ్రహ్మదేవుడే యాగం చేశాడు. పతివ్రతయైన దేవవ్రత శిలారూపంలో నిలిచింది. సాక్షాత్తూ మహావిష్ణువువైన నీవే కుడిపాదాన్ని పెట్టావు. ఇన్ని పొందిన నా శిరోమధ్యపాద భాగాలు పితృదేవతలను సైతం తరింపజేసే ప్రభావశాలి, పరమ పవిత్రమూ అయిన దివ్యక్షేత్రములయ్యేట్టుగా, అవి తన పేరున వ్యవహరింపబడేట్టుగా వరం కావాలని కోరి పొందారు.
ఈ కథలోనే కొన్ని వేర్వేరు చిరు భేదాలు ఉన్నాయి. మరో కథనం ప్రకారం గయుడు ఇంద్రుడు కావడం కాక గయుని మహా ప్రభావం వల్ల ఆయనను చూసినవారు, తాకినవారు నేరుగా బ్రహ్మమును పొందుతూండగా వేదకర్మలు నశిస్తూన్న స్థితి ఏర్పడింది. దానితో లోకంలో వేదకర్మలు నశించగా, ఇంద్రాదుల కోరికపైన(కొన్ని కథనాల్లో స్వయంగానూ) బ్రహ్మదేవుడు ఒక యజ్ఞాన్ని సంకల్పించి, గయుని తలపై చేస్తారు. రాత్రి మొత్తం ఉండే ఈ యాగం తెల్లవారినాకా పూర్తవుతుంది. ఐతే శివుడు కుక్కుటరూపంలో(కోడిపుంజుగా) వచ్చి కూయడంతో నిజంగా తెల్లవారిందేమోనని భ్రమించిన గయాసురుడి హఠాత్ కదలికల వల్ల యాగం అర్ధాంతరంగా ఆగిపోతుంది. నిర్ణయించిన దాని ప్రకారం శిక్షగా ఆయన తలను పాతాళానికి తొక్కుతారు అనేది ఆ ప్రత్యామ్నాయ కథనం చెప్పే విషయం.
పాదగయ క్షేత్ర వివరణ
కుక్కుటేశ్వరుడి గుడికి ఎదురుగా ఒక తటాకం ఉంది. దానిని "పాదగయ" అంటారు. ఈ పాదగయకి ఆ పేరు ఎలా వచ్చిందో వివరిస్తూ రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. గంగా తీరమున ఉన్న గయ "గయా శీర్షం" అనీ, పిఠాపురంలో ఉన్నది "పాదగయ" అనీ ఒక సిద్ధాంతం. అందుకనే పాదగయలో స్నానం చేస్తే గంగలో చేసినంత ఫలితం అని ఒక నమ్మకం ఉంది. గయుడు అనే రాక్షసుడి పాదాలు అక్కడ ఉన్నాయి కనుక ఇది పాదగయ అయిందని మరొక వదంతి. గయునికి సంభందించిన ఒక కథనం ప్రకారం గయుని చావు తరువాత చచ్చిన శవం యొక్క బుర్ర సింహాచలం దగ్గర, పాదాలు పిఠాపురం దగ్గర పడ్డాయిట. అందుకని సింహాచలం నుండి పిఠాపురం వరకు ఉన్న ప్రదేశం పాపభూమి అనేవారు. పాపభూమి కాబట్టే ఈ మధ్య ప్రదేశంలో పుణ్య క్షేత్రాలు లేవుట. అన్నవరం తదనంతర కాలంలో ప్రశస్తి చెందినది. అందువలననే శ్రీనాథుని రచనలలో ఎక్కడా అన్నవరం చరిత్ర కనబడదు.
కుక్కుటేశ్వర దేవాలయం
ఈ దేవాలయం కోనేరుకు ముందు తూర్పుముఖంగా ఉంటుంది. దేవాలయం ఎదురుగా కల ఏకశిల నంది అతి పెద్దగా శ్రీశైల నందిని పోలి ఉంటుంది. కుక్కుటేశ్వర లింగం తెల్లగా గర్భాలయంలో కొద్దిగా దిగువగా ఉంటుంది. ఈ ఆలయానికి రెండు వైపులా పురూహూతికా అమ్మవారి ఆలయం, శ్రీపాదుల ఆలయాలు ఉన్నాయి.
పురుహూతికా దేవి ఆలయం
కుక్కుటేశ్వరస్వామి ఆలయ సముదాయంలో పురుహూతికా దేవి ఆలయం ఉంది. ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠములలో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం ఈ కుక్కుటేశ్వరుడి దేవళంలో ఉండేది. పుస్తకాలలో, పురాణాలలో కల ఈ పీఠం కాని, ఆ శక్తి విగ్రహం కాని ప్రస్తుతం కానరావు. ఈ పీఠం మూలంగానే పిఠాపురానికి పీఠికాపురం అనే పేరు వచ్చిందని అంటారు. ఈ హుంకారిణీ శక్తి విగ్రహం రైలు స్టేషను కి ఎదురుగా ఉన్న మట్టి దిబ్బలో భూస్తాపితమై ఉన్నదని లోక ఐతిహ్యం ఉంది. పురావస్తు పరిశోధక శాఖ వారు తవ్వకాలు జరిపించి చూస్తే కనిపించవచ్చని ప్రజలు అనుకొంటారు.
శ్రీపాద వల్లభ అనఘ దత్తక్షేత్రం
పిఠాపురం దత్త క్షేత్రములలో ఒక ప్రాముఖ్య క్షేత్రం,శ్రీ గురు దత్తాత్రేయుని ప్రథమ అవతారం అయిన "శ్రీ పాద శ్రీ వల్లభ" స్వామి ఈ క్షేత్రంలో జన్మించారు, ఆయన జన్మించిన గృహం ఇప్పడు "శ్రీ పాద శ్రీ వల్లభ మహా సంస్థానం" గా ఏర్పాటు చేయబడింది , శ్రీ కుక్కుటేశ్వర దేవాలయంలో శ్రీ దత్తాత్రేయుల వారు స్వయంభూ విగ్రహరూపంలో దర్శనం ఇస్తారు ,భారతదేశంలో దత్తాత్రేయుని స్వయంభూ విగ్రహం కేవలం పిఠాపురం లో మాత్రమే కలదు ,మిగతా దత్త క్షేత్రములలో స్వామివారి పాదుకలు కలవు.
ఈ కుక్కుటేశ్వరుడి ఆలయ ప్రాంగణం లోనే కాలభైరవుడి విగ్రహం "వ్రీడావిహీనజఘనమై" చూసేవారికి సిగ్గును కలిగించేదిగా ఉంది.
కుంతి మాధవస్వామి ఆలయం (పంచ మాధవ క్షేత్రాలలో ఒకటి)
పాదగయ క్షేత్రం (కుక్కుటేశ్వర స్వామి)
కుక్కుటేశ్వర స్వామి
పురుహూతికా దేవి
పిఠాపురంలో ఇతర ఆలయాలు
వేణు గోపాలస్వామి ఆలయం,
నూకాలమ్మ గుడి (గ్రామదేవత)
కుక్క పాముగుడి (సీతయ్యగారి తోట)
రాముని కోవెల (మంగాయమ్మరావు పేట)
వెంకటేశ్వరస్వామి గుడి (కుక్కుటేశ్వరస్వామి ఆలయం వద్ద)
కోతి గుడి (మార్కెట్ వద్ద)
సాయిబాబా గుడి (చిన్న పోస్టాఫీస్ వద్ద)
పురుహూతికా అమ్మవారు (పాత బస్ స్టాండ్ వద్ద)
కోట సత్తెమ్మ తల్లి గుడి (సీతయ్యగారి తోట)
శ్రీ విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం (పాత బస్టాండ్ వద్ద)