23/04/2024
ఈ రోజు ఏప్రియల్ 23 పల్నాడు ప్రజల ఆరాధ్య దైవం మాచర్ల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణ మహోత్సవం పౌర్ణమి కాంతుల మధ్య ఘనంగా నిర్వహించబడుతుంది
ఈ సందర్బంగా చెన్నుని కళ్యాణం ఎప్పటినుంది జరుగుతుంది?చెన్నకేశవ స్వామీ వారిలో ఐక్యం అయిన రాజ్యలక్షీ అమ్మవారి చరిత్ర వివరాలు:
ఈ రోజు చైత్ర శుద్ధ పౌర్ణమి మంగళవారం రాత్రి 9 గంటల నుండిచంద్రుని వెలుగుల మధ్య కుల,మత,జాతి వర్గ భేధాలు లేకుండా అందరూ వీక్షించేలా ఆలయ బయట ఉన్న అతి పురాతన స్వామి వారి కళ్యాణ మండపం లో ఘనంగా నిర్వహించబడుతుంది.
కొన్ని వందల సంవత్సరాల నుండి కుల,మత భేధాల తారతమ్యం లేకుండా చెన్నుని కళ్యాణానికి మరియు రధోత్సవం కు వేలాది మంది భక్తులు హాజరు అవుతారు. చాపకూడు సిద్దాంతం ద్వారా మానవులంతా ఒక్కటే కుల,మత భేధాలు లేవని చాటిన పల్నాటి యుగ పురుషుడు,మానవతా వాది బ్రహ్మనాయుడు సిద్దాంతాలను నేటికి పాటిస్తూ పల్నాడు ప్రజలందరు ఐకమత్యంగా పండుగలు జరుపుకోవటం జరుగుతుంది. చెన్నకేశవస్వామి వారి తిరునాళ్ల కొన్ని వందల సంవత్సరాలనుండి జరుగుతూనే ఉంది,కాకతీయులు,తానిషా ప్రభువుల కాలం నుండి కూడా ఈ ఉత్సవం ఘనంగా జరుగుతుంది.
చైత్ర పౌర్ణమి రోజుతోపాటు మరోసారి ప్రత్యేకంగా సంక్రాంతి రోజున కూడా చెన్నునికి కళ్యాణం జరపటానికి గల చారిత్రక చరిత్ర:
15 వశతాబ్దం లో మన పల్నాడు ప్రాంతం గోల్కోండ నవాబుల పరిపాలనలో ఉండేది,అప్పడు మాచర్ల పరగణా కు పాలకుని గా సూరపరాజు వెంకట రాయుడు ఉండేవారు.ఆయన సతీమణి నాంచారమ్మ,కుమార్తె రాజ్యలక్ష్మీ లు కూడా చెన్నుని కి పరమ భక్తులు.రాజ్యలక్ష్మీ కి ఊహ తెలిసిన నాటి నుండే చెన్నకేశవుని సేవ లో నిత్యం ఉండేది,1550 వ సంవత్సరంలో రాజ్యలక్ష్మీ కి 8 సంవత్సరాల ప్రాయంలో ఒకరోజు ఆలయానికి చెన్నుని దర్శనానికి వెళ్లి తిరిగిరాలేదు,రాజు గారు ఎంత వెదికినా జాడలేదు,అదే రోజు రాత్రి సూరపరాజు గారికి కలలో కనిపించి తాను చెన్నుని లో ఐక్యం అయ్యి ముక్తి పొందానని తన కోసం వెతకవద్దని తనకు స్వామి వారితో కళ్యాణం జరిపించమని కోరగా రాజు గారు సంక్రాంతి సమయంలో చెన్నునికి రాజ్యలక్ష్మీకి వివాహం చేసారని చెపుతారు,స్వామి ఆలయం లో స్వామి వారి పక్కన రాజ్యలక్ష్మీ అమ్మవారి విగ్రహం మనం నేటికి చూడవచ్చు,సూరపరాజు గారు వీటిని నిర్మించారు. ఆ
నాటి నుండి సంక్రాంతి రోజున మరియు చైత్ర పౌర్ణమి రోజున చెన్నుని కి రెండు సార్లు కళ్యాణం జరుపుతారు.చెన్నకేశవుని భక్తి తో ఆరాధించిన వారికి ముక్తి లభిస్తుందని,కోరిన కోర్కెలు తీరతాయని భక్తుల నమ్మకానికి రాజ్యలక్ష్మీ అమ్మవారి లాంటి చారిత్రక విశేషాలు,ఆనవాళ్లు అనేకం ఉన్నాయని మన పూర్వీకులు చెపుతారు. చెన్నకేశవ స్వామి ఆలయం లో ప్రతి రోజు స్వామి వారికి నిత్యకళ్యాణం జరుగుచున్నను,బ్రహ్మోత్సవాల సమయంలో చైత్ర పౌర్ణమి రోజున జరిగే కళ్యాణం అతి పవిత్రంగా కళ్యాణం కనులారా వీక్షించిన వారికి సకల పాపాల హరణం అయ్యి పునీతులు అవుతారని భక్తుల నమ్మకం. మాచర్ల చెన్నుని కళ్యాణం రోజునే కారంపూడి ఆలయం లో చెన్నకేశవ స్వామి కల్యాణం జరగటం ఆనవాయితీ.
ఈ రోజు జరిగే శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి వారి కళ్యాణాన్ని తిలకించి పల్నాటి ప్రజలు స్వామి వారి కృప కు పాత్రులు కావాలని ప్రార్దిస్తున్నాను. జై చెన్నకేశవ... ఏటా జరిగే బ్రహ్మోత్సవాలు కనుల విందు చేస్తాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా జరిగే స్వామి వారి కల్యాణం అద్బుతం గా చేస్తారు,ఈ కళ్యాణం భద్రాచల రామయ్య కళ్యాణం తో పోల్చేంత గొప్పగా కనుల పండుగ గా వేలాది భక్తుల మధ్య అంగరంగ వైభవంగా చేస్తారు,ఈ కళ్యాణం చూసిన ప్రతి భక్తుడు మైమరిచి పోయి స్వామి వారి పై మరింత భక్తి భావం పెంచుకుంటారు. బ్రహ్మోత్సవాలు లో భాగంగా ప్రతి రోజు జరిగే ఉత్సవ విగ్రహాల ఊరేగింపు,గ్రామోత్సవం రవి,పొన్న,గరుడ,శేషా,ఐరావత వాహానాల పై స్వామి రూపం ప్రజలను కనువిందు చేస్తుంది. కోలాటాలు,సాంస్కృతిక కార్యక్రమాలు అద్బుతంగా ఉంటాయి. బ్రహ్మొత్సవాలు 16 రోజుల పాటు అద్బుతంగా జరుగుతాయి.స్వామి వారి వార్షిక కళ్యాణ ఉత్సవ సమయంలో శ్రీదేవి,భూదేవి అమ్మవార్ల కోసం అప్పట్లో కట్టించిన లక్ష్మీదేవి మిద్దెలను మనం నేటికి చూడవచ్చు, ఎదురు కోలాట ఉత్సవం ఇక్కడ జరిగే తీరు అత్యద్బుతం గా ఉంటుంది. ఈ దేవాలయంలొ స్వామి వారికి నిత్యకళ్యాణం జరుగుతుంది.ఆసమయంలో స్వామి వారిని దర్శించిన వారు భక్తి భావంతో పులకించి పోతారు. చైత్రశుద్ద పౌర్ణమి రోజు ప్రతి సంవత్సరం స్వామి వారికి ఘనంగా ప్రజలందరి మధ్య కళ్యాణం జరుపుతారు,ఈ ఉత్సవానికి వేలాది మంది భక్తులు హాజరు అవుతారు.అలాగే సంక్రాంతి రోజున కూడా స్వామి వారికి కళ్యాణం జరుపుతారు.చెన్నుని లో ఐక్యమయిన రాజ్యలక్ష్మీ అమ్మవారి తో స్వామి వారికి సంక్రాంతి సమయంలో వివాహం జరిపించటం ఆనవాయితీ..
శ్రీ వేముల.