06/11/2013
నవంబర్ 7 నాగులచవితి
నాగులచవితి విశిష్ఠత
నాగుల చవితి - కార్తీకశుద్ద చతుర్దశి నాడు - దీపావళి వెళ్ళిన నాలుగో రోజున వస్తుంది. పుట్టిన బిడ్డలు బ్రతకక పోతేను , పిల్లలు కలుగక పోతేను, నాగ ప్రతిష్ట చేసి పూజించటం సాంప్రదాయం . అలా నాగ మహిమతో పుటిన సంతానానికి, నాగలక్ష్మి, నాగేశ్వరరావు, నాగయ్య వగైరా పేర్లు పెట్టుకుంటారు. మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని నమ్మకం. ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెనుబాము' అని అంటారు. అందులో కుండలినీ శక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారంలో వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని కక్కుతూ, మానవునిలో ' సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే, మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివశించే ' శ్రీమహావిష్ణువు" కు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని చెప్తారు. ఈ రోజున ఉదయమే ,తలస్నానము చేసి పుట్టదగ్గరికి వెళ్ళి, నాగరాజుకు పూజించి పాలు పోసి చలిమిడి, చిమ్మిలి, అరటిపళ్ళు, తాటి బుర్రగుంజు , తేగలు మున్నగున్నవి నివేదన చేస్తారు. ఆ పుట్ట మట్టిని పుట్టబంగారం అని, దానిని కొద్దిగా తీసుకొని చెవి దగ్గర పెట్టుకుంటారు . ముఖ్యముగా చెవి బాధలు వున్నవారికి ఈ పుట్టబంగారం పెడితే చెవి బాధ తగ్గుతుందంటారు. ఆ సందర్భంగా పుట్ట వద్ద " దీపావళి" నాడు మిగిలిన మతాబులు, కాకరపువ్వొత్తులు, టపాసులు మొదలైనవి చిన్నపిల్లలు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తారు.
నాగులచవితి పాటలు కూడా మన తెలుగువారిలో ఎంతో ప్రసిద్ధం:
నన్నేలు నాగన్న , నాకులమునేలు ,
నాకన్నవారల నాఇంటివారల ఆప్తమిత్రులనందరిని ఏలు .
పడగ తొక్కిన పగవాడనుకోకు ,
నడుము తొక్కిన నావాడనుకొనుము .
తోక తొక్కిన తొలుగుచూ పొమ్ము .
ఇదిగో ! నూకనిచ్చెదను మూకనిమ్ము.పిల్లల మూకను నాకిమ్ము .
అని పుట్టలో పాలు పోస్తూ , నూక వేసి వేడుకుంటారు .అలాగే,
పుట్టలోని నాగేంద్రస్వామి లేచి రావయ్యా!
గుమ్మపాలు త్రాగి వెళ్ళిపోవయ్యా!
చలిమిడి వడపప్పు తెచ్చినామయ్యా!
వెయ్యి దండాలయ్య, నీకు కోటి దండాలయ్యా!
పుట్టలోని నాగేంద్రస్వామి!! ....
అంటూ తాము పోసిన పాలు నాగేంద్రుడు తాగితే, తమ మనసులోని కోర్కెలన్నీ తీరుతాయని భక్తుల నమ్మకం.ఆలయాలలో నాగదేవతలకు ఘనంగా పూజలు చేస్తారు. ప్రతి ఏటా నాగులచవితి రోజున తిరుమలలో కోనేటిరాయుడైన శ్రీవారిని పెద్దశేష వాహనంపై ఊరేగించడం ఆనవాయితీ. అలాగే గురువారం వాహన సేవకు ఆరోజంతా వుపవాసముండి మరునాడు పారాయణ చేసి భుజిస్తారు. పాముపడగ నీడ పడితే పశువులకాపరి కూడా ప్రభువు అవుతాడంటారు !కాని పాములకు పుట్టలో పాలు పోయడం వల్ల వాటి ప్రాణాలకు హాని అని,అందుకని వాటి సహజ నివాసములలో పాలూ, గుడ్లూ వెయ్యొద్దని చెప్తున్నారు. దానికి బదులు ఇళ్ళలోనే బియ్యం పిండితో నాగ మూర్తులను చేసి, వాటికి శాస్త్రోక్తంగా అన్నీ సమర్పించవచ్చు. ప్రకృతి మానవ మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవస్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని - ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకొంటూ! పూజిస్తూ వస్తున్నారు. ఇదే మనభారతీయ సంస్కృతిలోని విశిష్టత. నిశితంగా పరిశీలిస్తే ... అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. ఈ పాములు భూమి అంతర్భాగంలో నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా రైతుకు పంటనష్టం కలగకుండా చేస్తాయట!. అలా ప్రకృతిపరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి. నాగుపాముల సహజ నివాసాలను ఉండనిచ్చి, ప్రకృతిని కాపాడుకుంటే అంతకన్నా గొప్ప పూజ ఇంకొకటి ఉంటుందా?
--->
నాగుల చవితి - కార్తీక మాసం - అంతరార్ధం- చదువుకోవల్సిన శ్లోకాలు -november 7th
పాముని చుడగా బెదిరి చోటన మంత్ర అక్షతల్
భూమిని చల్లగా విషము పోవును లొంగును భక్తికిన్ మరిం
పాములు దుష్ట జంతువని భావము మాత్రమే కాని తప్పదే
కామిత సంతతిచ్చరయుగా అవిదేముడే ! కోల్వుడీ ప్రజల్
దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చవితిని "నాగుల చవితి" పండుగ అని అంటారు.
ఈ పండుగలో ఉన్న ఆంతర్యము ఒక్కసారి పరిశీలీద్దాము.
ప్రకృతికి జీవికి మధ్య మనకు ఎంతో అవినావ భావ సంబంధము కనిపిస్తూ ఉంటుంది.
మనము నిశితంగ పరిశీలించగలిగితే ప్రకృతి నుండి మానవుడు తనకు కావలసింది పొందుతూ తిరిగి ఆ ప్రకృతిని సమ్రక్షించుకునే బాధ్యతను కూడా ఆటవిక స్థాయి నుండి , నేటి నాగరిక సమాజం వరకూ, ఆ ప్రకృతిని దైవ స్వరూపముగా మానవులు భావించి సమ్రక్షించుకుంటూ ఉన్నంత కాలం సమస్త మానవ కోటికి మరియు జీవ కోటికి మనుగడకు ముప్పు మాత్రం వాటిల్లదు.
ఆ ప్రకృతిని మానవుడు చెజేతులార నాశనం చేసుకుంటే, ఇటు మానవ కోటికి, అటు జీవ కోటికి తప్పక వినాశనానికి దారితీస్తున్నందున భావముతో నేడు ప్రకృతిని - పర్యావరణ రక్షణ అంటూ పలు కార్యక్రమాలను చేపడుతోంది సమాజం.
అలాగ ప్రకృతిని మానవ మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవ స్వరూపముగా భావించి ఆనాటి నుండి నేటి వరకూ చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని - ఇలాగ సమస్త ప్రాణికోటిని దైవ స్వరూపముగా చూసుకుంటు పూజిస్తు వస్తున్నారు.
అదే మన భారతీయ సంస్కృతిలోని విశిష్టత!
నిశితంగా మనం పరిశీలిస్తే..అందులో భాగంగానే "పాము"ను కుడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు.
ఈ పాములు భూమి అంతర్భాగమునందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి "నీటిని" ప్రసాదించే దేవతలుగా తలిచేవారు. ఇవి పంటలను నాశనం చేసే క్రిమకీటకాదులను తింటూ, పరోక్షంగా "రైతు"కు పంట నష్టం కలగకుండా చేస్తాయి.
అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.
పైన చెప్పిన విధంగా సర్పం పేరు చెపితేనే బెదిరిపోతూ ఉంటాము. కాని అంతకంటే భయంకరమైన మానవులు మనలోనే ఉన్నారు.
తల నుండు విషము ఫణికిని,
వెలయంగా తోకనుండు వృస్చికమ్మునకున్
తలతోకయనక యుండు ఖలునకు
నిలువెల్ల విషము గదరా సుమతీ !
అని చెప్పినట్లు ....అలా మన చుట్టూ మానవరూపంలో ఉంటే మానవులు, సర్పజాతి మనసుకుంటే..నికృష్టమైన (అంటే ..అవి మనంవాటి జోలికి వెళ్ళితేనే ప్రమాద కరమవుతాయి).
కాని వాటికంటే భయంకరమైన మానవ సర్పాలు మనచుట్టు తిరుగుతున్నా గమ నించలేకపోతున్నాము
అని గ్రహించుకోవలసి ఉంది.
అలా మనకంటికి కనబడే విషనాగుపాము కంటే మానవ శరీరమనేపుట్టలో నిదురిస్తున్న నాగుపాము మరింత ప్రమాదకరమని చెప్తారు.
ఈ మానవ శరీరము అనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు.
మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెమూకను "వెన్నుపాము" అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారమువలెనే వుంటుందని యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తూన్నట్లు ,కామ, క్రోధ, లోభ,మోహ,మద,మత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో "సత్వ గుణ" సంపట్టిని హరించివేస్తూ ఉంటుంది.
అలా "నాగుల చవితి రోజున ప్రత్యక్షముగా విషసర్పపుట్టను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే ..మానవునిలో ఉన్న "విషసర్పం కూడా శ్వేతత్వం పొంది,మన అందరి హృదయాలలో నివశించే "శ్రీ మహా విష్ణువు నకు" తెల్లని ఆదిశేషువుగా మారి "శేషపాంపుగా" మారాలనికోరికతో చేసేదే! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయిటలలోగలాంతర్యమని చెప్తారు.
దీనినే జ్యోతిష్యపరంగా చుస్తే...కుజ,రాహు దోషాలున్న వారు, సాంసారిక బాధలు ఉన్నవారు, ఈ కార్తీక మాసంలో వచ్చే షష్ఠీ ,చతుర్దశలలో రోజంతా ఉపవాశము ఉండి ఈ దిగువ మంత్రాన్ని స్మరించాలి.
పాహి పాహి సర్ప రూప నాగదేవ దయామయ
సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ
అనంతాది మహానాగ రూపాయ వరదాయచ
తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహి మే సదా!
అలా ఆవుపాలు పుట్టలో పోసి నాగపూజ చేసి చలిమిడి, చిమ్మిలి ,అరటిపళ్ళు మొదలైనవి నివేదన చెయ్యాలి.
ఆ సందర్భముగా పుట్టవద్ద కొన్ని కాకరపువ్వొత్తులు చిన్నారులు ఎంతో సంతోషముగా కాలుస్తారు.
ఇలాగ స్త్రీలు ఆరాధిస్తే ఎంతో శుభప్రదమైన సుఖసంతానము కలుగుతారు.
అదే కన్నే పిల్లలు ఆరాధిస్తే మంచి భర్త లభించునూ అని విశ్వాసము.
ఈ విధమైన నాగుల ఆరాధన ఈనాటిది కాదు.
యుగాల నాటిది. సౌభాగ్యానికి, సత్సంతానప్రాప్తికి సర్ప పూజ చేయుట అనేది లక్షల సరత్తులనాడే ఉన్నట్లు మన పురాణాలలో ఎనో గాధలు కానవస్తున్నాయి. దేశమంతటా పలు దేవాలయాలలో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తు ఉంటాయి.
ఈ "నాగుల చవితి" నాడు నాగేంద్రుని శివభావముతో అర్చిస్తే సర్వరోగాలు పటాపంచలై సౌభాగ్యవంతులవుతారని ఋషివచనం .
నాగేంద్రా ! మేము మా వంశములో వారము నిన్ను ఆరధిస్తున్నాము. పొరపాటున "తొక్కితే తొలగిపో, నడుం తొక్కితే నా వాడు అనుకో! పడగ త్రొక్కితే కస్సుబూసుమని మమ్మల్ను భయ పెట్టకు తండ్రి ! అంటూ పుట్టకు ప్రదక్షిణ నమస్కారాలు చెయ్యాలని పెద్దలు అంటారు.
ఈ నాగుల చవితి రోజున ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ అవుతుంది అని శస్త్రాలు పేర్కుంటున్నాయి.
"కర్కోటకస్య నాగస్య
దమయంత్యా నలస్య చ
ఋతుపర్ణస్య రాజర్షేః
కీర్తినం కలినాశనం
ఈ సర్పారాధనకు తామరపూలు, కర్పూరపూలు, మొదలైనవి ప్రీతికరమైనవి అని చెప్తారు.
సర్పారధనచేసే వారి వంశం "తామరతంపరగా" వర్ధిల్లుతుందని భవిష్య పురాణం చెప్తోంది. మన భారతీయుల ఇళ్ళల్లో ఇలవేల్పు సుబ్రహ్మణ్ణ్యేశ్వరుడే!
ఆయన అందరికి ఆరాధ్య దైవం కాబట్టి వారి పేరును చాలమంది నాగరాజు, ఫణి,సుబ్బారావు వగైరా పేర్లు పెట్టుకుంటు ఉంటారు.
నాగర్కోయిల అనే ఊరిలో నాగుపాము విగ్రహం ఉంది ! దాని సమీపంలో 6 నెలలు తెల్లని ఇసుక 6 నెలలు నల్లని ఇసుక భూమి లో నుండి ఉబిపైకివస్తుంది అని భక్తులు చెప్తు ఉంటారు.
నాగుపాము కుబుసానికి కూడా మంచి ఆయుర్వేద గుణాలు ఉన్నయని,గరళన్ని ఆయుర్వేద మందులలో తగుమోతాదులో ఉపయోగిస్తారని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. ఇలాగ ప్రకృతిలో నాగు పాములకు ,మానవ మనుగడులకు అవినవ భావ సంబంధం కలదని విదితమవుతోంది.
నాగరాజ దేవాయ నమో నమః
--->
కార్తికేతు సితే పూజ్యః చతుర్ధ్యాం కార్తికేయకః!
మహాచతుర్ధీ సా ప్రోక్తా సర్వపాపహరం శుభా!!
దీపావళి అనంతరం వచ్చే కార్తీకశుద్ధ చవితిని నాగులచవితి అంటారు. ఈ రోజు నాగదేవతను పూజిస్తారు. కార్తీకశుద్ధ చవితినాడు సూర్యోదయానికి ముందు ఆకాశంలో తూర్పు దిక్కున శేషుని నక్షత్ర రూపం కనిపిస్తుంది. ఇది సర్పాకరంలో ఉంటుంది. కనుక ఈచవితిని నాగుల చవితి అని పిలుస్తారు.
తెల్లవారుజామునే స్నానం చేసి, నువ్వులు, బెల్లంతో చిమ్మిలి, బియ్యం నాన బెట్టి పిండి చేసి బెల్లం, కొబ్బరి వేసి చలిమిడి చేస్తారు. నాగేంద్రుని పుట్టదగ్గరకి వెళ్లి పసుపు, కుంకుమ, పువ్వులతో పూజ చేస్తారు. చిమ్మిలి, చలిమిడి, అరటిపళ్ళు,తాటిగుంజు నైవేద్యం పెడతారు. ఆవుపాలు పుట్టలో పోస్తారు. చిమ్మిలి, చలిమిడి పుట్టలో వేస్తారు.
"పడగ తొక్కితే పారిపోయి, నడుం తొక్కితే నావాళ్ళనుకుని, తోక తొక్కితే తొలగిపోయి, కళ్ళు, కాలు ఇచ్చి చల్లగా చూడు తండ్రీ!" అంటూ నాగేంద్రుని ప్రార్ధిస్తారు.
సాయంత్రం వరకు ఉపవాసం ఉండి వాటినే ఫలహారంగా తింటారు. ఇలా చేయడం వల్ల పుణ్యం లభించటమే కాకుండా చలికాలంలో నువ్వులు, బెల్లం తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పిల్లలతో చన్నీటి స్నానాలు చేయించటం వాళ్ళ చేవిలోపోటు రాదనీ, కళ్ళకి మంచిదని భావిస్తారు
-->
హరిహరులకు ఇష్టం కార్తీకం
కార్తీకమాసం అత్యంత విశేషవంతమైనది. శివకేశవులిద్దరికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీకమాసం. సంవత్సరంలో వచ్చే అన్ని మాసాలకన్నా విశిష్టమైన ఈ కార్తీకమాసం అధికఫలదాయకమైంది. కృత్తికల్లో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు కనుక ఇది శివకేశవులిద్దరికీ ప్రీతికరం. ఈ కార్తీక మాస విశిష్టతను గూర్చి, వేద వ్యాసమహర్షి తన శిష్యుడైన సూతునికి, సూతముని శౌనకాది ఋషులకు తెల్పాడు.
పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగానికి, అవసరమైన ద్రవ్యానికై వశిష్ఠమహర్షి, జనకమహారాజును అర్థించగా, జనకమహారాజు అందుకు అంగీకరించి, సంవత్సరంలోని సర్వమాసాల కంటే కార్తీకమాసం అత్యంత మహిమాన్వితమైనదని చెబుతుంటారు కదా! అయితే ఆ సర్వపాపహరమైన ధర్మసూక్ష్మాన్ని తెలియజేయమంటాడు. అప్పుడు వశిష్ఠుడు విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకుని కార్తీకమాసంలో సూర్యుడు తులా సంక్రమణలో ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీజలాల యందు చేరుతుంది. ఇట్టి జలాశయాలలో విష్ణువు వ్యాపించి ఉంటాడు కనుక కార్తీకస్నానం చేసినవారి పుణ్యం చెప్పనలవికాదు. హపీకూప, నదీస్నాన, జపాదులను ఆచరించేవారు అక్షయమైన ఆశ్వమేధ ఫలాన్ని పొందుతారని వివరిస్తాడు.
స్త్రీలుగాని, పురుషులుగాని కార్తీకమాసంలో తప్పనిసరిగా ప్రాతఃస్నానం ఆచరించాలనీ, కార్తీకమాసపు సాయంకాలం శివాలయాలలోగానీ, వైష్ణ్యాలయంలోగానీ యధాశక్తి దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలం లభించడమే గాక, శివాలయ గోపురద్వార, శిఖరాలయందుగానీ, శివలింగసన్నిధినిగానీ దీపారాధన చేయడం వలన అన్ని పాపాలు అంతరించి పోతాయని కార్తీకంలో శివాలయంలో ఆవునేతితోగాని, నువ్వులనూనెతో గాని, ఆఖరికి ఆముదంతోగానీ దీప సమర్పణ చేస్తారో, వారు అత్యంత పుణ్యవంతులౌవుతారని, నెల పొడుగునా చేసినవాళ్లు జ్ఞానులై, తద్వారా మోక్షాన్ని పొందుతారని చెప్పబడింది. విష్ణు సన్నిధిని ఎవరైతే భగవద్గీత పది, పదకొండు అధ్యాయాలను పారాయణ చేస్తారో, వారి పాపాలన్నీ తొలగిపోయి వైకుంఠానికి క్షేత్రపాలకులవుతారని, తులసీదళాలతో, తెలుపు లేక నలుపు గన్నేరుపూలతోగాని శ్రీమహావిష్ణు పూజను చేస్తారో, వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణు సమభోగాలననుభవిస్తారని, కార్తీకమాసంలో హరిహరులెవరి సన్నిధినైనా సరే, పద్దెనిమిది పురాణాలలో ఏదైనా సరే ప్రవచించితే సర్వకర్మబంధ విముక్తులవుతారని వశిష్ఠ వచనం. వేదశాస్త్ర పురాణాలన్నీ మనకు అనేక ధర్మసూక్ష్మాలను అందిస్తున్నాయి. ఈ ధర్మసూత్రాల వలన మనకు కొన్ని సమయాలలో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైనవిగానూ, స్వల్ప పుణ్యాలు గొప్పవిగానూ పరిణమిస్తుంటాయి.
పూర్వ జన్మార్జితాలైన పాపాలన్నీ కూడా కార్తీకవ్రతం వలన హరించుకుపోతాయి. కార్తీకంలో వచ్చే ప్రతి సోమవారం నాడు పగలు ఉపవసించి, రాత్రి నక్షత్రదర్శనానంతరం భోజనం చేస్తూ - ఆ రోజంతా భగద్ద్యానంలో గడిపేవాళ్లు తప్పక శివ సాయుజ్యాన్ని పొందుతారని సూత ఉవాచ. ఈ మాసంలో ఏకభుక్తం, నక్తభోజనం చేస్తారు. అయితే నక్తం ఉండలేనివారు ఒక కార్తీకపౌర్ణమినాడైనా నక్తములున్నా పుణ్యమే. కార్తీకమాసమంతా తెల్లవారు ఝాముననే స్నానం చేయాలి. అప్పుడే అది కార్తీకస్నానం.
కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్రమణంలో ఉండగా ఆచరించే స్నాన, దాన, జప, పూజాదులు విశేష ఫలితాలను ఇస్తాయి. ఈ కార్తీకమాస వ్రతాన్ని తులాసంక్రమణదాదిగా గాని, శుద్ధపాఢ్యమి నుండి ప్రారంభించాలి. ఈ మాసంలో వస్త్రదానం, హిరణ్యదానం, సువర్ణదానం, కన్యాదానం, భూదానం చేస్తే విశేష ఫలితాలు పొందడమే కాకుండా, తేజస్సు , యశస్సు, కార్యసిద్ధి, జ్ఞానలబ్ధి సౌభాగ్యాలు కలుగుతాయి.
ఈ మాసంలో ఉదయం, సాయంత్రంవేళల్లో ఆవు నేతితో గాని, నువ్వులనూనెతో గానీ దీపారాధన చేసి, అభిషేక ప్రియుడైన ఈశ్వరునికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, అర్చనలు చేయడం వలన మహా పుణ్యం లభిస్తుంది.
ఈ కార్తీకమాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులయితే విడువబడుతున్నాయో అన్ని సంవత్సరాల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తారు. యజ్ఞయాగాదులకన్నా కార్తీకవ్రతం వల్ల గొప్ప పుణ్యం లభిస్తుంది. తీర్థయాత్రల వల్ల కలుగునటువంటి ఫలం, ఈ కార్తీకమాసంలో శ్రీ మహావిష్ణుని ఎక్కడైతే పూజిస్తారో, అక్కడ భూత, పిశాచ, గ్రహ గణాలు దూరంగా ఉంటాయి. శివుడికి ప్రీతికరమైన జిల్లేడుపూలతో పూజించితే దీర్ఘాయులై, మోక్షాన్ని పొందుతారు. శుద్ధ ద్వాదశినాడు శివునికి మారేడు దళాలతో, జిల్లేడుపూలతో, విష్ణువుకు తులసీ దళాలతో, జాజిపూలతో పూజ అత్యంత శ్రేష్టదాయకం.
జలంధరుని భార్యయైన బృందా చితాస్థలిలో దేవతలచే చల్లబడిన బీజాల వల్ల త్రిగుణ శోభితాలైన ఉసిరి, మాలతి, తలసి వృక్షాలు అవిర్భవించాయి. సరస్వతి - ఉసిరి రూపము, లక్ష్మీ - మాలతి రూపము, గౌరి - తులసిరూపంగా వెలసినారు.
కార్తీకమాసం ద్వాదశి రోజున 'తులసి' వృక్షసన్నిధిలో దీపప్రజ్వలనం చేసి, "నమస్తులసి సర్వజ్ఞే పురుషోత్తమ వల్లభే పాహిమాం సర్వపాపేభ్యస్సద్వ సంపత్ప్రదాయినీ" అంటూ ధ్యానం చేస్తూ శక్తి శ్రద్ధలతో తులసిదేవిని పూజించాలి. "ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరీ విద్యాం, పుత్ర పౌత్రాం, ఆయురారోగ్యం, సర్వసంపదాం మమదేహి మహాప్రాజ్ఞే యశోదేహి బలంచమే - ప్రజ్ఞాం మేధాంచ సౌభాగ్యం విష్ణు భక్తించ శాశ్వతీమ్ నీరోగం కురుమాం నిత్యం నిష్పాపం కురుసర్వదా" అనే స్త్రోత్రం చేస్తూ ఉసిరి (ధాత్రీ) చెట్టు క్రింద శ్రీమహావిష్ణువును పూజించి, ఉసిరి దీపారాధన చేసి, ఉసిరికాయలు నివేదన చేసి, పదకొండు ప్రదక్షిణులు చేస్తే, అఖండమైన అష్టైశ్వర్యప్రాప్తి, అనంత పుణ్యఫలం లభిస్తుంది.
ఉసిరిచెట్టు క్రింద శ్రీమహావిష్ణువును ఉసిరికాయలతో దీపారాధన చేసేవారిని చూడడానికి యమునికి కూడ శక్తి చాలదట. ఉసిరి చెట్లు ఉన్నతోటలో వనభోజనాలు చేస్తే వారి మహాపాతకాలు సైతం తొలగిపోతాయి. ఉసిరి ఔషధీ గుణము కలది కనుక, వనభోజనాళ వలన ఆరోగ్యం చేకూరుతుంది. ఉసిరిపూజ వలన లక్ష్మీదేవి ఆ భక్తుల ఇండ్లలో స్థిరనివాసం ఏర్పరుచుకుంటుందని, కార్తీకమాసంలో స్నానాలు, దీపారాధన, జాగరణ, తులసి, ఉసిరి పూజల వలన, ధన, ఫల, భూదానాల వలన పుణ్యఫలం లభిస్తుందని, కార్తీక మహాత్మ్యాన్ని వినినా - పారాయణ చేసినా, సకల పాపాలు నశించిపోతాయని శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీకమహాత్మ్యం ద్వారా తెలుస్తుంది. ఈ కార్తీకమాసంలో భక్తిశ్రద్దలతో హరిహరులను ఆరాధిస్త్రే సమస్తశుభాలు కలుగుతాయి.
->
అథ తృతీయోధ్యాయ ప్రారంభః
శ్లో!! కార్తీకేమాసి రాజేంద్ర స్నానదాన జపాదికం!
లేశంవాకురుతేమర్త్యః తదక్షయ్య ఫలం స్మృతమ్!!
ఓ జనకమహారాజా! వినుము. కార్తీకమాసమందు స్నానము దానము జపము మొదలయిన పుణ్యములలో ఏదయినను స్వల్పమైనా చేసినయెడల ఆస్వల్పమే అనంతఫలప్రదమగును. స్త్రీలుగాని, పురుషులుగాని, అస్థిరమైన శరీరమును నమ్ముకుని శరీరకష్టమునకు భయపడి కార్తీకవ్రతమును జేయని యెడల నూరుమారులు కుక్కగా పుట్టుదురు. కార్తీక పున్నమిరోజున స్నానదానములు ఉపవాసమును జేయని మనుష్యుడు కోటిమారులు చండాలుడై జన్మించును. అట్లు చండాలుడై పుట్టి చివకు బ్రహ్మ రాక్షసుడైయుండును. ఈవిషయమందొక పూర్వకథ గలదు. చెప్పెదను వినుము.
ఆ ఇతిహాసము తత్వనిష్ఠునిదైయున్నది. గనుక దానిని వినుము. ఆంధ్రదేశమందు తత్వనిష్ఠుడను ఒక బ్రాహ్మణుడు గలడు. అతడు సమస్త శాస్త్రములను చదివినవాడు, అబద్ధమాడనివాడు, ఇంద్రిఅయములను జయించివాడు, సమస్త ప్రాణులందు దయగలవాడు, తీర్థయాత్రలందాసక్తి గలవాడు. రాజా! ఆబ్రాహ్మణుడు ఒకప్పుడు తీర్థయాత్రకుబోవుచు గోదావరీ తీరమందు ఆకాశమునంటియున్నట్లుండు ఒక మర్రిచెట్టు మీద ముగ్గురు బ్రహ్మరాక్షసులనుజూచెను. ఆ బ్రహ్మరాక్షసులకు తలవెంట్రుకలు పైకి నిక్కియున్నవి. నోరు వికటముగానున్నది. శరీరము నల్లగానున్నది. ఉదరము కృశించియున్నది. నేత్రములు, గడ్డము, ముఖము ఎర్రగానున్నవి. దంతములు పొడుగుగానున్నవి. చేతిలో కత్తులపైన పుర్రెలు కలిగి సర్వజంతువులను భయపెట్టుచుండిరి. ఆరాక్షసుల భయముచేత ఆవటవృక్షమునకు ఆరుక్రోశముల దూరము లోపల మనుష్యులు పక్షులు మృగములు సంచరించుటయే లేదు. ఆవట సమీపమందు పర్వతసమాన శరీరులగు ఆ బ్రహ్మరాక్షసులు నిత్యమును పశువులు, పక్షులు, మృగములు మొదలయిన జంతుజాలములయొక్క ప్రాణములకు భీతిని గొల్పు భయంకర శబ్దములను జేయుచుండెడివారు. అనేక కార్తీక వ్రతములాచరించిన ఆ తత్త్వనిష్ఠుడు దైవవశముచేత మార్గమున పోవుచు మర్రిచెట్టుమీదనున్న ముగ్గురు బ్రహ్మరాక్షసులను జూచెను.
తత్త్వనిష్ఠుడు భయపడి శ్రీహరి పాదారవిందములను స్మరించుచు దేవేశా౧ నన్ను రక్షించుము. లోకేశా!నారాయణా!అవ్యయా!నామొర ఆలకించుము. సమస్త భయముల నశింపజేయు దేవా! నాభయమును పోగొట్టుము. నాకు నీవే దిక్కు. నీవు తప్ప నన్ను రక్షింపసమర్థులెవ్వరును లేరు. ఈప్రకారము హరిని గూర్చి మొరబెట్టుచు వారి భయమున పరుగెత్తుచున్న బ్రాహ్మణుని జూచి బ్రహ్మ రాక్షసులు వానిని భక్షించు తలంపుతో అతనివెంబడి పరుగెత్తసాగిరి. ఇట్లు కొంతదూరము పోగానే వెనుకకు తిరిగిన ఆబ్రాహ్మణుని దర్శనము వలన బ్రహ్మ రాక్షసులకు జాతి స్మృతిగలిగినది.
ఓరాజా! తరువాత వారు ఆ బ్రహ్మణునిముందు భూమియందు దండప్రణామములాచరించి అంజలిపట్టి నమస్కరించి అనేక వాక్యములతో ఇట్లనిస్తుతించిరి. బ్రాహ్మణోత్తమా! మీదర్శనమువలన మేము పాపరహితులమైతిమి. మీరాక మాకు ఉపకారము కొరకయినది. అది న్యాయమే, మహాత్ములు జీవించుట యాత్ర చేయుట లోకమును ఉద్ధరించుటకొరకే ఉపకారము కొరకే అగునుగదా. బ్రాహ్మణుడీమాటలను విని భయమును వదలి మంచి మనస్సుతో ఇట్లనియెను. మీరెవ్వరు. ఏకర్మచేత మీకిట్టి వికృతరూపములు గలిగినవి. లోకనిందితమైన ఏకర్మను మీరు పూర్వమందు చేసినారు. భయమును వదలి సర్వమును నాకు జెప్పుడు. తరువాత రాక్షులు తాము చేసిన నింద్య కర్మలను వేరువేరుగా తలంచుకొని ఆబ్రాహ్మణునితో ఇట్లని విన్నవించిరి. మొదటి బ్రహ్మరాక్షసుడు ఇట్లు పల్కెను. అయ్యా నేను పూర్వజన్మమందు ద్రావిడదేశములో మందరమను గ్రామమునకు గ్రామాధికారిని. బ్రాహ్మణులలో నీచుడను. కఠినముగా మాటలాడువాడను. ఇతరులను వంచించు మాటలను మాట్లాడుటలో నేర్పరిని. నాకుటుంబలాభము కొరకు బ్రాహ్మణుల ధనమును చాలా అపహరించితిని. బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఒకనాడయినను అన్నమును బెట్టియెరుగను. బ్రాహ్మణులసొమ్ము స్నేహముచేత హరించుటచేత ఏడుతరములు కుటుంబము నశించును. దొంగతనముగా బ్రాహ్మణుల ధనమపహరించిన యెడల సూర్యచంద్ర నక్షత్రములుండువరకు కుటుంబము నశించును. తరువాత మృతినొంది యమ బాధలను అనేకములనొందితిని. ఆదోషము చేతనే భూమియందు బ్రహ్మరాక్షసుడనై జన్మించితిని. కనుక బ్రాహ్మణోత్తమా! ఈ దోషము నశించు ఉపాయమును విచారించి క్చెప్పుము.
అందులో రెండవవాడిట్లు చెప్పెను. అయ్యా నేను ఆంధ్రదేశమందుండువాడను. నేను నిత్యము తల్లిదండ్రులతో కలహించుచుండి వారిని దూషించుచుండువాడను. ఇదిగాక నేనును, నా భార్యాపిల్లలును, షడ్రసోపేతమైన అన్నమును భుజించుచు నాతల్లిదండ్రులకు మాత్రము చద్ది అన్నమును పెట్టుచుండువాడను, బంధువులకుగాని, బ్రాహ్మణులకుగాని, ఒకనాడయినను అన్నమును పెట్టినవాడనుకాను. మరియు ధనమును విస్తారముగా ఆర్జించియుంటిని. పిమ్మట నేను చనిపోయి యమలోకమందు యెనిమిదియుగముల వకు యమబాధలనుబొంది బ్రహ్మరాక్షసుడనై భూమియందు జన్మించితిని. ఓబ్రాహ్మణోత్తమా! నాకీపాపము తొలగు ఉపాయము జెప్పి నన్ను ఉద్ధరింపుము. తరువాత మూడవవాడు నమస్కరించి తనస్థితిని ఇట్లు చెప్పెను. అయ్యా! నేను ఆంధ్రదేశ నివాసిని. బ్రాహ్మణుడను. విష్ణ్వాలయమందు స్వామికి అర్చకుడను. స్నాన సంధ్యావందనములను విడిచి స్వామి పూజను వదలి పరనిందలను జేయుచు విశేషముగా మాటలాడుచు కఠినుడనై దయాశూన్యుడనై తిరుగుచు దేవాలయమందు భక్తులు వెలిగించు దీపములలోని నెయ్యి నూనెను అపహరించి వేశ్యాగృహమందు దీపములను పెట్టి ఆనేతిని వేశ్యకు యిచ్చి దేవతా నివేదితాన్నమును అపహరించి క్దానితో సంభోగించుచుండువాడను. ఆ దోషముచేత నరకములందు అనేక యాతనలను అనుభవించి తరువాత భూమికి వచ్చి నానా జన్మలందు జన్మించి చివరికి బ్రహ్మ రాక్షసుడనై బుట్టి ఈ మర్రిమీద ఉంటిని కనుక సమస్త భూతదయాపరా బ్రాహ్మణోత్తమా! నన్ను రక్షించుపు. నాకీ బ్రహ్మరాక్షస జన్మమును నశింపజేయుము.
తత్త్వనిష్ఠుడిట్లు బ్రహ్మరాక్షసుల మాటలను విని ఆశ్చర్యమునొంది మీకు కొంచెమైనను భయములేదు. మీదుఃఖము పోగొట్టెను. నేను కార్తీక స్నానార్థము పోవుచున్నాను. నాతో మీరుకూడా రండి అని వారిని తీసుకొనిపోయి కావేరి నదిలో బ్రహ్మరాక్షసుల నిమిత్తము రాక్షసులచే గూడ స్నానము చేయించి వారికి బ్రహ్మరాక్షసత్వమును నశింపజేసెను. "అముకానాం బ్రహ్మరాక్షసత్త్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతస్స్నానమహం కరిష్యే" ఇట్లు సంకల్పము చేసి ఆబ్రాహ్మణుడు విధిగా స్నానము చేసి ఆ రాక్షసుల కొరకు ఆ ఫలమిచ్చెను. ఆ క్షణముననే ఆముగ్గురు దోషవిముక్తులై దివ్య రూపములను ధరించి వైకుంఠలోకమునకు బోయిరి. ఓ జనకమహారాజా! వినుము. మోహము చేతగాని, అజ్ఞానముచేత గాని కార్తీకమాసంబున శుక్ర నక్షత్రముదయించినప్పుడు (తెల్లవారుఝామున) సూర్యోదయకాలమందు కావేరీనది యందు స్నానము చేసి పిమ్మట శ్రీ విష్ణుపూజను జేసిన వానికి పదివేల యజ్ఞములు చేసిన ఫలము కలుగును. ఇందుకు సందేహము లేదు. కార్తీకమాసమందు ఏదో ఒక ఉపాయము చేత కావేరీ స్నామును తప్పక చేయవలయును. కార్తీకమాసమందు దామోదరప్రీతిగా ప్రాతస్స్నానముజేయని వాడు పదిజన్మలందు చండాలుడై జన్మించి తరువాత ఊరపందిగా జన్మించును. కాబట్టి స్త్రీగాని, పురుషుడుగాని కార్తీకమాసమందు ప్రాతస్స్నానము తప్పక చేయవలెను. ఈ విషయమై ఆలోచన చేయపనిలేదు.
ఇతి స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే తృతీయోధ్యాయస్సమాప్తః
--->