16/01/2026
సంతోషకరమైన వివాహ జీవితమునకు ఎనిమిది
దైవ నియమములు - సహో. భక్త్ సింగ్, హెబ్రోన్ సంఘము
లేఖన భాగములు :
ఆదికాండము 1:26, 28; ఆదికాండము 2:18-25;
యోహాను 12: 1-3; యోహాను 16:24; ఎఫెసీ 5:17-33.
వివాహము, సృష్టియొక్క ఆరంభము నుండియే అతి పవిత్రమైన సంబంధముగా యుండవలెనని దేవుడు నిర్ణయించియున్నాడు. ఎవరైతే, దేవుని పరలోక ఏర్పాటు ప్రకారము జత చేయబడుదురో వారు ఎల్లప్పుడు అసాధారణమైన సంతోష, ఆనందములతో నుందురని దేవుని వాక్యములో చూచుచున్నాము. ఉదాహరణముగా యెషయా 62:5లో ఇట్లు చదవుచున్నాము - “యౌవనుడు కన్యకను వరించి పెండ్లి చేసికొనునట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లి చేసికొనెదరు. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురిని చూచి సంతోషించునట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును." మరల యెషయా 61:10లో యిట్లు చదువుచున్నాము. "శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింప జేసియున్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసియున్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది.” ఇదే విధముగా యిర్మీయా 33:11లో యిట్లు వ్రాయబడి యున్నది -"సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును - యోహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకధిపతియగు యెహోవాను స్తుతించుడి అని పలుకు వారి స్వరమును మరల వినబడును." ప్రకటన 19:7లో యిట్లు చూచుచున్నాము. "గొట్టెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది; ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనియున్నది; గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరచెదము.” ఈ విధముగా దేవుని వాక్యములో నుండి తేటపడునదేమనగా, వివాహములో జతపరచ బడువారు తీర్మానము చేసికొనక మునుపు అధికముగా ప్రభువు సన్నిధిలో కనిపెట్టి, ఆయన పరిపూర్ణమైన పరలోకపు ఏర్పాటు ప్రకారము జతచేయబడు వారికి సంపూర్ణమైన సంతోషమును కలుగచేయుటకు దేవుడే ఈ సంబంధమును నియమించియున్నాడు.
ప్రభువైన యేసుక్రీస్తు, యోహాను 15:11 ప్రకారము మన సంతోషము పరిపూర్ణము చేయు నిమిత్తము ఈ లోకమునకు వచ్చి శ్రమపడి, చనిపోయి తిరిగి లేచెను. ఈ పవిత్రమైన ఐక్యత ద్వారా దేవుడు ఉద్దేశించిన ఈ సంతోషమును చాలా కొద్దిమందియే తమ వివాహ జీవితములో అనుభవించుటను చూచుట విచారకరము. అనేకులు తమ వివాహ ఏర్పాట్లు చేసికొనునప్పుడు దేవుని వాక్యమును నిర్లక్ష్య పెట్టి, దానికి సరియైన స్థానము నివ్వరు. అందును బట్టియే అనేక గృహములలో వివాదము, పోరాటమును చూచెదము. మరియు ఒకరి ద్వారా మరియొకరికి కొద్ది ఆశీర్వాదమే యుండును. ప్రతి చోటను అసంతోషకరమైన మరియు విడిపోయిన కుటుంములను చూచుచున్నాము. కొంత మంది ధనవంతులు తమ వివాహములలో ఎంతో డబ్బు ఖర్చు పెట్టెదరు. అయినను కొంత కాలమైన తరువాత విడిపోయెదరు. అదే విధముగా ఉన్నత విద్యనభ్యసించిన వారు కూడ కొందరు తమ వివాహ జీవితము పతనమగుట కనుగొనుచున్నారు. వారు తమ వివాహ జీవితమును ఎంతో సంతోషముతోను, నిరీక్షణతోను ప్రారంభించి, త్వరలోనే ఐక్యత కలిగి, అన్యోన్యముగా జీవించుట కష్టమని కనుగొందురు.
వాక్యమును బట్టి చూడగా ఏ వివాహమైనను జీవిత పాలిభాగస్తులుగా జతపరచబడు వారికిని, వారికి మాత్రమే కాక వారి యొద్దకు వచ్చువారికి కూడా అధికమైన ఆశీర్వాదకరముగా యుండవలసిన మూలాధారమైన ఎనిమిది దైవ నియమములను పాటించవలెను. శరీరము ఆరోగ్యవంతముగా యుండుటకు తాజాయైన గాలి, మంచి నీరు, మంచి భోజనము మరియు శరీర వ్యాయామము అవసరము. సమృద్ధియైన పంట పండుటకు మంచి నేల, ఎరువు, నీళ్ళు, కలుపు మొక్కలు తీసివేయుట మరియు తెగులు నుండి కాపాడుట అవసరము. అదే విధముగా సంతోషకరమైన వివాహ జీవితమునకు ఎనిమిది దైవ నియమములు ఉన్నవి.
1. దేవుని పరిపూర్ణ చిత్తము
మొదటి నియమము ఏమనగా, వివాహము చేసికొనువారు జతచేయబడుటకు ముందుగా దేవుని యొక్క పరిపూర్ణ చిత్తమును నిశ్చయము చేసికొనవలెను. వారు బాహ్యమైన రూపురేఖల వలన, శరీర సంబంధమైన ఆస్తిపాస్తుల వలన లేక లోక సంబంధమైన యోగ్యతల వలనను నడిపింప బడకూడదు. వివాహ జీవిత విషయము అనేకులకు సరియైన గ్రహింపు ఏ మాత్రమును లేదు. కొందరు సంతోషముగా నుండుట కొరకు అందము, ఐశ్వర్యము, విద్య మొదలగు వాటిపై ఆధార పడుదురు. అందుచేత చివరకు ఆశాభంగము చెందుదురు. వివాహము చేసికొనువారు ప్రభువు సన్నిధిలో, ప్రార్ధనలో చాలినంత సమయము కనిపెట్టి ఆయన పరిపూర్ణ చిత్తమును స్పష్టముగా గ్రహించి, దాని విషయమై పూర్తిగా ఋజువు చేసికొనుటకు ఆయనకు చాలినంత సమయము నిచ్చుట చాల అవసరము. దేవుని వాక్యము చెప్పునదేమనగా - "ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి" (ఎఫెసీ. 5:17), "మీరు ఈ లోక మర్యాదను అనుసరించక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి" (రోమా 12:2). దేవుని చిత్తము తెలిసికొని, దానిని చేయుట వలన మనము ఆయన అనుగ్రహము (దయ)ను పొందగలము. మత్తయి 12:50లో ప్రభువు యిట్లు చెప్పెను. “పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియుననెను." తిరిగి జన్మించిన వారిలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవము నదివలె ప్రవహించును. తిరిగి జన్మించని వారికి నిత్య జీవము లేదు. మరియు వారు ఎన్నడును దేవుని చిత్తమును తెలిసికొనలేరు. అందుచేతనే మేము ఏ వివాహమైనను జరిగించక పూర్వము జత చేయబడువారిని తిరిగి జన్మించితిరా? మీ పాపములు క్షమించబడినవా? నిత్య జీవ వరమును పొందియున్నారా? అని ప్రశ్నించెదము. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెయు తాము జతచేయబడుటను గూర్చి ప్రభువు యొక్క పరిపూర్ణ చిత్తము తెలిసికొనుటకై వారు వ్యక్తిగతముగా అధికముగా ప్రార్ధన చేయవలెను. మరునాడు ఏమి జరుగునో ఎవరికి తెలియదు. మన ఆరోగ్యము చెడిపోవచ్చును లేక మన పరిస్థితులు మారిపోవచ్చును. మనమెంత కాలము జీవించెదమో మనకు తెలియదు. దేవుడు మాత్రమే అంతమును ఆరంభము నుండియే ఎరుగును. కనుక మన జీవితముల విషయమై దేవుని పరిపూర్ణ చిత్తమును ఎరుగవలెను. కీర్తన 143:10లో కీర్తనల గ్రంథకర్త యిట్లు చెప్పుచున్నాడు "నీవే నా దేవుడవు నీ చిత్తాను సారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక." వివాహములో జతచేయ బడువారు - "ఈ వ్యక్తి ప్రభువు చేత ఆయన చిత్తానుసారముగా నా కొరకు ఏర్పరచబడిన వ్యక్తి" అని సత్యముగాను, యథార్థముగాను చెప్పగలిగి యుండవలెను. వారు బంగారము, వెండి, ఉద్యోగము లేక వస్త్రములను గూర్చి ఆలోచించక పూర్వము దేవుని చిత్తమును కనుగొనవలెను.
2. దైవిక ప్రేమ
రెండవదిగా, వివాహము చేసికొనువారు శరీర ఆకర్షణల మీదను, భూ సంబంధమైన ఆస్తిపాస్తుల మీదను, మరియు లోక సంబంధమైన యోగ్యతల మీదను ఆధారపడనటువంటి పవిత్రమైన, ఆత్మీయమైన దైవిక ప్రేమను ఒకరి నిమిత్తమై యొకరికి వారి హృదయములలో కుమ్మరించు మని ప్రభువును అడుగవలెను. అటువంటి ప్రేమ అంతరంగ అనుభవమై యుండవలెను. అది దేవుని వరమే. ఎఫెసీ. 5:25-27లలో ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు - "పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి... దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను." ఇదే హెచ్చరిక 28 మరియు 33 వచనములలో మరల చెప్పబడినది. ప్రభువు మనలనెట్లు ప్రేమించెను? మనకు ఆధిక్యత లేదు, యోగ్యత లేదు. ఆయనను దుఃఖపరచి, గాయపరచినను ఆయన మనలో ప్రతి ఒక్కరిని ప్రేమించి, మన నిమిత్తమై తన దేహమును విరుగగొట్టబడుటకు అప్పగించెను. ఆయన మన సృష్టికర్త గనుక మనలను అంతగా ప్రేమించెను. మనము ఆయన కొరకు ఏమియు చేయనప్పటికిని, ఆయన మన కొరకు చనిపోయెను. భార్యభర్తల మధ్య అటువంటి దైవిక ప్రేమ కలిగియుండుట అవసరము. వారు "యేసుక్రీస్తు ప్రభువా, మేము నీ సన్నిధిలో నీ చేత జతచేయబడి యున్నాము. మాలో ఒకరి నిమిత్తమై యొకరికి పరలోకము నుండి నీ ప్రేమను మా హృదయములలో కుమ్మరించుము" అని విశ్వాసముతో ప్రార్ధించవలెను. సామానులు, మోటరుకారు, ఆభరణములు, పట్టభద్రులు (డిగ్రీలు) మరియు యితర ఆస్తులు సంతోషకరమైన గృహమును కలుగజేయవు. దేవుని ప్రేమయే వారి గృహమును సంతోషముగా నుంచును. వారి వివాహ జీవితము యొక్క ఆరంభము నుండియే అటువంటి ప్రేమ కొరకు ప్రభువును అడుగవలెను. "అడుగుడి మీ కియ్యబడును" అని ప్రభువు చెప్పెను (మత్తయి 7:7). మొట్టమొదట ప్రభువు జీవము వారిలోనికి ప్రవహించ వలెను. అప్పుడు పరసంబంధమైన పవిత్ర ప్రేమ వారినిద్దరిని నిజమైన పాలి భాగస్తులుగాను, స్నేహితులుగాను, జత పనివారిని గాను జతపరచును. అటువంటి ప్రేమ పరీక్షలలో, శ్రమలలో, బాధలలో అధికమగును మరియు వారినిద్దరిని సన్నిహిత సంబంధములోనికి ఆకర్షించును.
3. యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిరసత్వము
మూడవదిగా, భార్యాభర్తలిద్దరు వారి వివాహ జీవితము యొక్క ఆరంభము నుండియే ప్రతి విషయములో యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిరసత్వము క్రిందికి తెచ్చుకొనవలెను. ఆయనే సంఘమునకు శిరస్సై యున్నాడు. వివాహ జీవితము యొక్క ప్రతివిషయములోను, ఆయనే శిరస్సుగా నుండుటకు ఒప్పుకొనవలెను.
యోహాను సువార్త 12:1-3లలో మనము చూచునట్లు బేతనియలోని కుటుంబమునకు యేసుక్రీస్తు ప్రభువు శిరస్సుగానున్నాడు. ఆరంభములో మరియ, మార్తలు యేసుక్రీస్తు ప్రభువును గౌరవనీయుడైన అతిధిగా మాత్రమే చేర్చుకొనిరి. వారు, పునరుత్థాన శక్తిని లేక మరణముపై శక్తిని అనుభవించు నిమిత్తము, వారి గృహములోనికి మరణము మరియు దుఃఖము వచ్చుటకు ప్రభువే అనుమతించెను. యేసుక్రీస్తు ప్రభువు ఒక ప్రవక్త, మహాశక్తి గలిగిన గొప్ప వ్యక్తియై యుండుట మాత్రమే గాక స్వయముగా దేవుడైయున్నాడు. దేవుడు ఒక్కడే మరణముపై (శక్తి) అధికారము గలవాడు. ఏ ఒక్కడును ఎప్పుడును మరణముపై జయము పొందలేదు. యేసుక్రీస్తు ప్రభువు 'లాజరూ, బయటికి రమ్ము' అని చెప్పగా, చనిపోయి నాలుగు దినములు సమాధిలో ఉన్న వ్యక్తి వెంటనే బయటికి వచ్చెను. యేసుక్రీస్తు ప్రభువు యోహాను 11:25లో చెప్పిన విధముగా ఆయనే పునరుత్థానమును, జీవమునైయున్నాడు. ఆ అద్భుతము జరుగక పూర్వము ఆయన వారి నిమిత్తము మానవుడుగా జన్మించిన తమ సృష్టికర్తయని గ్రహించలేదు. స్వయముగా ఆయనే దేవుడని వారు ఎరిగినప్పుడు వారి జీవితములను, గృహములను సంపూర్తిగా ఆయన ఆధీనము చేసికొనిరి. మరొక విధముగా చెప్పవలెననిన వారి మనవిని బట్టి వారి గృహమునకు ఆయన సజీవమైన శిరస్సుగా నాయెను.
సంతోషకరమైన గృహముగా యుండవలెననిన యేసుక్రీస్తు ప్రభువు చేత జతచేయబడువారు ఆయన శిరసత్వమునకు ఒప్పుకొనవలెను. వారు విశ్వాసముతో - “యేసుక్రీస్తు ప్రభువా నీవు మా సృష్టికర్తవు, సర్వాధికారము గలవాడవు, నీవు మా కొరకు మానవుడవై, మాకు బదులుగా చనిపోయి, మాలో నివసించుటకై తిరిగి లేచితివి. మా హృదయములలో, మా జీవితములలో, మా అనుదిన ఏర్పాటులలో మీ అధికారమునకు సంపూర్తిగా ఒప్పుకొనుచున్నాము. మీ అనుమతి లేకుండా ఏ పనియు చేయము” అని చెప్పవలెను. ఈ విధముగా వారి వివాహ జీవితమును ప్రారంభించవలెను. భర్త ఈ విధముగా చెప్పవలెను. “యేసుక్రీస్తు ప్రభువా, ఇది మీ గృహము. మేము మీ పిల్లలము. ఈ గృహములో నా ఇష్టము లేక నా భార్య యిష్టము కాదు గాని మీ చిత్తము మాత్రమే జరుగవలెనని కోరుచున్నాను.” అదే విధముగా భార్య కూడ యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిరసత్వమును ఒప్పుకొని ఈ విధముగా చెప్పవలెను. “అవును ప్రభువా, ఇది మా గృహము కాదు, మీ గృహము. మీరే ఈ గృహమును మాకిచ్చి యున్నారు. ఈ గృహములో నా యిష్టము లేక నా భర్త యిష్టము కాదు గాని మీ చిత్తము మాత్రమే జరుగవలెను.” లేని యెడల భర్త, భార్యతో “నీవు నా భార్యవు నాకు లోబడవలెను. నీవు లోబడకపోతే లోబడునట్లు చేయుదును. నేనేమి చేయుదునో చూడు" అని చెప్పును. అప్పుడు భార్య-"నీ కంటె నాకు ఎక్కువ తెలియును. నేను నీకు లోబడను” అని చెప్పును.
ఈ విధముగా జగడము ప్రారంభమగును. ప్రారంభములో తలుపులు, కిటికీలు మూసికొని జగడమాడుదురు. కొంతకాలమైన తరువాత బహిరంగముగాను, వీధులలో కూడ జగడమాడుదురు. సంతోషకరమైన గృహముగా నుండవలెననిన వారు ఎక్కడికైన వెళ్ళక పూర్వము మరియు ఏదైనా చేయక పూర్వము యేసుక్రీస్తు ప్రభువుయొక్క శిరసత్వమునకు ఒప్పుకొనవలెను. వారి వివాహ జీవితమంతటిలో ఇది వారి అనుదిన అభ్యాసముగా యుండవలెను. మనము తలంచి, ఊహించిన దాని కంటే అధికముగా ఆయన మనలను ప్రేమించుచున్నాడు గనుక ఆయన చిత్తమే మనకు ఉత్తమము.
4. పునరుత్థానశక్తి
నాల్గవదిగా, వారి వివాహ జీవితములో ఎదుర్కొనబోవు శ్రమలు, పరీక్షలలో పునరుత్థాన శక్తిని అన్వయించుకొనవలెను. లాజరు చనిపోయి సమాధిలో నాలుగు దినములుంచబడి కంపు కొట్టుచుండెను. ప్రభువు ఆజ్ఞాపించగా సమాధిలో నుండి బయటకు వచ్చెను. అతడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థానశక్తికి గుర్తుగా యున్నాడు. ప్రతి విధమైన పరీక్ష, శోధన కష్టములకు ఈ శక్తి సరిపోయినది. నీవు ధనవంతుడవైనను, పేదవాడవైనను, గొప్పవాడవైనను, తక్కువవాడవైనను, చదువుకొనినవాడ వైనను, చదువురాని వాడవైనను, ఎవరివైనను సరే ప్రజలందరు సామాన్యముగా ఎదుర్కొను సమస్యలను, బలహీనతలను, శోధనలను, కష్టములను, మానవమాత్రుడవుగా నీవును ఎదుర్కొనవలసి యుండును.
పునరుత్థాన శక్తిని కోరుకొనుటయే వీటన్నిటిలో జయము పొందుటకు రహస్యమైయున్నది. వారు “యేసుక్రీస్తు ప్రభువా, మేము ఈ కష్టమును ఎదుర్కొనుచున్నాము. దీనిని ఎదుర్కొను సామర్థ్యము మాకు లేదు. దీనిని జయించుటకు మీ పునరుత్థాన శక్తిని మాకు దయచేయుము” అని విశ్వాసముతో చెప్పవలెను. ఆ శక్తి ద్వారా వారు అన్ని పరిస్థితులలో జయము పొందగలరు. వారు తమ శక్తిపై నాధారపడక పునరుత్థాన శక్తిపై ఆధారపడవలెను. ఫిలిప్పీ. 4:13లో అపొస్తలుడైన పౌలు ఇట్లు చెప్పుచున్నాడు. - "నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను.” ఆయన పునరుత్థాన శక్తిని గూర్చి- "ఆయనను, - ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును" అని ఫిలిప్పీ. 3:10లో చెప్పుచున్నాడు. భార్యాభర్తలు వారి కష్టములన్నిటిని పునరుత్థాన శక్తి ద్వారా జయించగలరు.
5. నిజమైన సహవాసము
ఐదవదిగా, భార్యాభర్తలు తమ ఇద్దరి మధ్య నిజమైన సహవాసము కలిగి యుండవలెను. ప్రభువు లాజరును మృతులలో నుండి లేపిన తర్వాత వారిద్దరు కలిసి భోజనము చేసి "... అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను; లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు" (యోహాను 12:1, 2). బల్లమీద ఉన్న భోజనము ఆత్మీయ ఆహారమును గూర్చి మాట్లాడుచున్నది. ఆరోగ్యముగా నుండు నిమిత్తము శారీరక ఆహారము అవసరమైనట్లు మన ఆత్మలకు ఆత్మీయ ఆహారము అవసరము. ఈ ఆహారమును, ప్రభువైన యేసుక్రీస్తుతో సహవాసము కలిగి యుండుట ద్వారా పొందగలము. అందు నిమిత్తము వారు ఉదయకాల భోజనము చేయక పూర్వము మోకరించి దేవుని వాక్యము చదువుటతో దినమును ఆరంభించి యిట్లు ప్రార్ధన చేయవలెను "ప్రభువా, మేము వర సంబంధమైన ఆత్మీయ ఆహారము కొరకు ఆశించుచున్నాము. మేము నీ స్వరము వినగోరుచున్నాము. దయతో మా ఇరువురితో మాట్లాడుము." వారు అటువంటి కోరికతో తమ పరిశుద్ధ గ్రంథము (బైబిలు) ఆదికాండము నుండి ప్రకటన వరకు వరుసగా, క్రమముగా చదువవలెను. అప్పుడు దేవుని వాక్యము వారికి అనుదిన ఆత్మీయ ఆహారమగును. మనము మన స్నేహితులతో కలిసి భోజనము చేయునప్పుడు, సహవాసములో అది ఎక్కువ రుచికరముగా యుండును గాన తృప్తిగా అనుభవించెదము. దేవుని వాక్యమును ఉదయము, సాయం కాలము క్రమముగా చదువుట వలన, ప్రభువు నడిపింపును కోరుట వలన వారు ఆత్మీయ ఆహారమును పొందెదరు.
ఈ దినములలో కొన్ని క్రైస్తవ గృహములలో మాత్రమే క్రమముగా కుటుంబ ప్రార్థనలు జరుగుచున్నవి. కుటుంబ ప్రార్ధనలు లేని కారణమున అనేక గృహములలో జగడములున్నవి. ఆరంభములో వారమునకు ఒకసారి రహస్యముగా జగడమాడుదురు. కాని తరువాత అనుదినము, బహిరంగముగా జగడమాడుదురు. వారి గృహములలో కుటుంబ ప్రార్ధనలు లేని కారణమును బట్టి వారి పిల్లలు కూడ మొండి వారుగాను, లోబడనొల్లని వారుగాను అగుదురు. కనుక భార్యాభర్తలు కుటుంబ ప్రార్ధనను నిర్లక్ష్యము చేయకూడదు. సాధ్యమైనప్పుడెల్ల ఒకరితోనొకరు తమ ఆత్మీయ అనుభవములను పంచుకొనుచు, ఏ విధమైన మానవ బలహీనతయైనను, లోపమైనను ఉన్నయెడల ప్రేమతో, ఓర్పుతో ఒకరి కొకరు సహాయము చేసికొనవలెను.
6. సంతోషకరమైన సేవ
ఆరవదిగా, సాధ్యమైనంత మట్టుకు, భార్యాభర్తలు అక్కరలో యున్న వారి యెడల ప్రేమ చూపుట, గొప్ప ఆధిక్యత అని యెంచి యితరులకు సంతోషముగా సేవ చేయుటకును ప్రయత్నము చేయవలెను. వారు ఏమి చేసినను కొలొస్స. 3:23 లో చెప్పబడిన ప్రకారము ప్రభువు నిమిత్తమని చేయవలెను.
యేసుక్రీస్తు ప్రభువు, లాజరు కలిసి భోజనము చేసినప్పుడు మార్త సంతోషముతో ఉపచారము చేసెను. అంతకు ముందు ఆమె సణుగు గొణుగులతో, ఫిర్యాదులతో, కోపముతో, అసూయతో నిండి యుండుటను లూకా 10:40లో చూచుచున్నాము. కాని తరువాత మార్చబడెను. కొంతమంది భర్తలు వారి భార్యల విషయమై యిట్లు మాట్లాడుదురు "నా భార్య చాలా కష్టపడి, పని చేస్తుంది. శుభ్రముగా, తెలివిగా, ఎంతో చురుకుగా పనిచేస్తుంది. అయితే ఆమెకు చాలా చెడ్డ కోపము. ఆమెకు కోపము వచ్చినప్పుడు యింటిలో ఉన్న వారందరు భయపడి వణక వలెను." సంతోషకరమైన వివాహ జీవితమునకు, భార్యాభర్తలిద్దరు యితరులకు సంతోషముతో, ఉత్సాహముతో ఇష్టపూర్వకముగా సేవ చేయవలెను. వారి హృదయములలో అసూయ, ద్వేషము, కోపము, సణుగు గొణుగు లేకుండ యుండవలెను. క్రైస్తవ గృహము, పేదలకు, అక్కర గలవారికి, అనారోగ్యముగా యున్నవారికి సేవాగృహముగా యుండవలెను. ఆ గృహము అందరికి సమానముగా సేవచేయు ప్రేమాగృహముగా యుండవలెను.
7. ప్రభువును ఆరాధించుట
ఏడవదిగా, భార్యాభర్తలు మరియవలె ప్రభువు యొక్క కృపాకనికరము లను బట్టి ఆయనకు కృతజ్ఞులై యుండవలెను. “అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చజటామాంసి అత్తరు ఒక సేరున్నర యెత్తు తీసికొని, యేసు పాదములకు పూసి, తన తలవెండ్రుకలతో ఆయన పాదములు తుడిచెను; ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను" (యోహాను 12:3). రెండు కారణములను బట్టి మరియ యేసు ప్రభువు పాదములకు ప్రశస్తమైన అత్తరు పూసెను. చనిపోయి నాలుగు దినములు సమాధిలో నుండి తిరిగి లేపబడిన తన సహోదరుని బట్టి తన హృదయము కృతజ్ఞతతో నిండియుండెను. రెండవదిగా, యేసుక్రీస్తు ప్రభువు సామాన్య మానవుడు కాడనియు, మానవుల రక్షణార్థము మానవుడుగా అయిన దేవుడే అని తెలిసికొనెను. కావున హృదయ పూర్వకమైన భక్తి, వైరాగ్యములతో అత్తరును ఆయన పాదములకు పూసెను. సంతోషకరమైన గృహముగా నుండుటకు భార్యాభర్తలిద్దరు ప్రభువు యెడల భక్తి కలిగి, ఆయనను ఘనపరచి, ఆరాధించవలెను. ప్రభువు యొక్క కృప, కనికరము, ప్రేమ, నమ్మకత్వమును బట్టి ప్రతిదిన ఆరంభమందును ఆరాధన పాటలతో ఆరంభించవలెను. అదే విధముగా వినయముతో కూడిన నిజమైన భక్తితో దినమును ముగించవలెను. వారి విశ్వాసము బలపరచబడి ప్రభువును అధికముగా ప్రేమించగలుగుదురు. వారు ఆరాధనా కూడికలలో సంపూర్తిగా పాలు పొందవలెను. ఇటువంటి గృహము పరలోకపు రుచిని ముందుగనే ఈ లోకములో అనుభవించునట్లు చేయును.
8. మూడంతల ఐక్యత
ఎనిమిదవదిగా, భార్యాభర్తల యొక్క ఐక్యత ఆత్మ, జీవము, శరీరముల మూడంతల ఐక్యతయై యుండవలెను. 1 థెస్సలొనీకయులు 5:23 ప్రకారముగా మన వ్యక్తిత్వము మూడింటి కలయికయై యున్నది. “సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును, శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక." ప్రసంగి 4:12లో యిట్లు చదువుచున్నాము. “మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదుగదా?" గ్రామములలో పెద్ద పెద్ద బరువులను లాగుటకు బలమైన త్రాడు కావలసినప్పుడు ప్రజలు మూడు త్రాళ్ళను తీసికొని వాటిని కలిపి ఒక్కటిగా అల్లుదురు. అప్పుడు అది బలముగా యుండును. మూడంతల ఐక్యతను అర్థము చేసికొనవలె ననిన, దేవుడు మనలను ఆత్మ, జీవ, శరీరముల మూడింటి కలయికగా ఎందుకు చేసెనో మనము తెలిసికొనవలెను. ఆదికాండము 2:7లో యిట్లు చూచుచున్నాము - "దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవ వాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను."
ఇప్పుడు శరీరమనగానేమో, జీవమనగానేమో, ఆత్మయనగానేమో చూచెదము. ఎముకలు, కండరములు, రక్తము శరీరమగుచున్నది. జీవము యొక్క మూడంతల కలయిక యేదనగా, ఆలోచించుటకు, నేర్చుకొనుటకు, తెలిసికొనుటకు అవసరమైన తెలివితేటలు; తలిదండ్రులు, సహోదరులు, సహోదరీలు, భర్త లేక భార్య, స్నేహితులు, బంధువులు మొదలగు వారి నెవరినైనా ప్రేమించవలెనను భావోద్రేకము, ఏదైనా ఒక విషయమై నిర్ణయము చేసికొను చిత్తశక్తి. అవును లేక కాదు అని చెప్పగలుగునట్లు దేవుడు ప్రతి మానవునికి స్వేచ్ఛను అనుగ్రహించెను. ఆయన ఎవరిని బలవంతము చేయడు. ఆత్మ కూడ మూడింటి కలయికయై యున్నది. మొదటిది మనస్సాక్షి లేక అంతరంగ స్వరము. మనము తలంపు, మాట, క్రియలలో పాపము చేయక ముందే హెచ్చరిక చేయును. ఏ పాపమునైన చేయుటకు ముందు మన మనస్సాక్షిని చంపుకొనవలెను. ఉదాహరణము నకు, నేనొక అబద్ధము చెప్పగోరుచున్నప్పుడు, నా మనస్సాక్షి నన్నిట్లు హెచ్చరించును - "జాగ్రత్త. అబద్ధము చెప్పవద్దు." అయితే నేను నా మనస్సాక్షితో యిట్లు చెప్పుదును. - "నీవు ఊరకుండుము.” దీని అర్ధమే మనగా మనస్సాక్షిని చంపిన తరువాతనే పాపము చేయుదుము. రెండవది, అదృశ్యుడైన దేవుని తెలిసికొనవలెనను ఆంతరంగిక వాంఛ. ప్రతి మానవుడు, దేవుడెవరు? తన సృష్టికర్త ఎవరు? ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయనను కనుగొనుట ఎట్లు? అని తెలిసికొన గోరుచున్నాడు. మూడవది, అంతర్జ్ఞానము. కారణము ఎరుగకుండగనే ఎక్కడికైనా వెళ్ళుటకు లేక ఏదైనా కొనుటకు లేక ఏదైనా చేయుటకు అకస్మాత్తుగా ఒక తలంపు కలుగును.
దేవుడు మానవుని తన స్వరూపమందు, తన పోలిక చొప్పున చేసెనని ఆదికాండము 1:26లో చూచుచున్నాము. పరిశుద్ధుడైన, ప్రేమగల దేవుడు మానవుడు తనతో విడిపోని సహవాసము కలిగి యుండునట్లుగా చేసెను. పాపము ప్రవేశించినప్పుడు పరిశుద్ధుడైన దేవునితో యున్న నిజమైన సహవాసము నుండి వేరు చేయబడెను. ఎందు చేతననగా - "... పరిశుద్ధత లేకుండ ఎవడును ప్రభువును చూడడు" అని హెబ్రీ. 12:14 లో చెప్పబడి “నేను యున్నది. 1 పేతురు 1:16లో యిట్లు చదువుచున్నాము పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడి”.
సామాన్యమైనటువంటి ఈ దైవ నియమములను పాటించుట వలన లోకమందు ఏ భాగమునకు చెందిన, ఏ భార్యాభర్తలైనను సంతోషకరమై వివాహ జీవితము జీవించగలరు. ప్రభువుచేత వివాహములో జతచేయబడ వారందరి హృదయములలో ఈ దైవ నియమములను ప్రభువు వ్రాయ వలెనని మా ప్రార్థన. ఈ నియమములను పాటించుట వలన వారి గృహము సంతోషకరముగాను, ఆశీర్వాదకరముగాను ఉండును. వాడే గృహము సమాధాన గృహముగాను, ఆనంద గృహముగాను, ప్రేమా గృహముగాను, సేవా గృహముగాను, దైవ సన్నిధిగల గృహముగాను_ విశ్వాస గృహముగాను, సహవాస గృహముగాను, దేవుని నామము ఘనపరచబడు గృహముగాను ఉండును. ఇటువంటి గృహము ద్వారా అనేకులు ఆశీర్వదించబడెదరు. ఇటువంటి నిజ క్రైస్తవ గృహము పరలోకపు రుచిని ముందుగానే ఈ భూలోకములో అనుభవింపచేయును.