05/04/2026
కీసరగుట్టలో సూర్యకిరణాల అర్చన… రామలింగేశ్వరునికి దివ్య స్పర్శ
.. స్వామివారిని తాకిన సూర్యకిరణాలు… భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహం
.. “ఓం నమో భగవతే రామలింగాయ” నినాదాలతో మార్మోగిన ఆలయం
కీసర గుట్ట:
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో ఆదివారం అరుదైన ఆధ్యాత్మిక దృశ్యం ఆవిష్కృతమైంది సాయంత్రం సూర్య భగవానుడు తన కిరణాలతో స్వామివారిని అర్చించిన దృశ్యం భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది.
ఆలయ గర్భగుడిలోకి నేరుగా ప్రవేశించిన సూర్యకిరణాలు శ్రీ రామలింగేశ్వరస్వామి విగ్రహాన్ని స్పర్శించడంతో ఆలయ ప్రాంగణం భక్తి నినాదాలతో మార్మోగింది. “ఓం నమో భగవతే రామలింగాయ” అంటూ భక్తులు జపాలు చేస్తూ దివ్య క్షణాన్ని ఆస్వాదించారు.
ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ తాటకం వెంకటేష్ శర్మ మాట్లాడుతూ,.. సూర్యకిరణాలు స్వామివారిని తాకడం అత్యంత పవిత్రమైన దివ్య సంఘటనగా పేర్కొన్నారు. ప్రతి ఏడాది ఇలాంటి అరుదైన దర్శనం లభించడం భక్తులకు అదృష్టమని, ఈ సందర్భంగా ఆలయానికి భారీగా భక్తులు తరలి రావడం ఆనందదాయకమన్నారు.
ఈ అరుదైన దృశ్యాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం అంతటా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని భక్తి భావం వెల్లివిరిసింది.
ఈ దివ్య దర్శనం పొందడం తమ అదృష్టమని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తూ, స్వామివారి ఆశీస్సులు పొందారు.