08/03/2026
ఆడపిల్లలకు కూడా మగ పిల్లలతో సమానంగా ఆస్తి పంచాలి – ప్రొఫెసర్ జోసెఫ్ మోసిగంటి
గుంటూరు జిల్లా చేబ్రోలు: ఆడపిల్లలకు కూడా మగ పిల్లలతో సమానంగా తల్లితండ్రులు ఆస్తిని పంచాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవ నాయకుడు ప్రొఫెసర్ డా. జోసెఫ్ మోసిగంటి అన్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలులో ఆయన ఒక ప్రకటన చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.
ప్రస్తుతం సమాజంలో అనేక రంగాలలో స్త్రీలపై ఉన్న వివక్షతలు చాలా వరకు తగ్గాయని ఆయన పేర్కొన్నారు. గతంలో సతీసహగమన వంటి దురాచారాలను నిర్మూలించేందుకు ప్రముఖ సంఘ సంస్కర్త మిషనరీ విలియం కేరి కృషి చేయగా, రాజా రామ్మోహన్ రాయ్ సహకారంతో ఆ దురాచారం నిషేధించబడిందని ఆయన గుర్తు చేశారు.
ఈ రోజుల్లో చాలా కుటుంబాలు మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లలను చదివిస్తున్నప్పటికీ, ఆస్తి విషయంలో మాత్రం ఇంకా సమానత్వం కనిపించడం లేదని అన్నారు. చాలా మంది తల్లితండ్రులు ఆడపిల్లలను “వేరే ఇంటికి వెళ్లిపోయింది” అనే భావంతో చూసి ఆస్తి పంచడంలో వెనుకంజ వేస్తున్నారని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఉద్యోగాలు, జీవన పరిస్థితుల కారణంగా మగ పిల్లలు కూడా తల్లితండ్రులకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని చెప్పారు. అనేక కుటుంబాలలో ఆడపిల్లలకే తల్లితండ్రుల పట్ల ప్రత్యేకమైన ప్రేమ, బాధ్యత ఉండి వారినే ఎక్కువగా చూసుకుంటున్నారని ఆయన తెలిపారు. అయినప్పటికీ కొంతమంది తల్లితండ్రులు కుమారులకే ఆస్తి ఇస్తున్నారని, ఈ పరిస్థితి కూడా మారాల్సిన అవసరం ఉందని సూచించారు.
క్రైస్తవ ధర్మంలో స్త్రీలకు సమాన ఆస్తి హక్కు ఉందని ఆయన అన్నారు. భారతదేశంలోనే తొలిసారిగా మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్త్రీలకు ఆస్తి హక్కు కల్పించగా, అనంతరం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆ చట్టాన్ని అమలు చేసిందని గుర్తు చేశారు.
ప్రస్తుతం స్త్రీలు చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు సహా అన్ని రంగాలలో మగ పిల్లలకంటే ముందంజలో నిలుస్తున్నారని అన్నారు. అయితే కొంతమంది స్త్రీలు స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకొని కుటుంబాలలో విభేదాలు సృష్టిస్తున్న ఘటనలు కూడా ఉన్నాయని తెలిపారు. మంచి వ్యక్తిత్వం గల వ్యక్తులు తయారవ్వాలన్నా, కుటుంబాలు మరియు సమాజం బాగుండాలన్నా స్త్రీ పాత్ర ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.
స్త్రీలు వ్యక్తిత్వంలోనూ, అన్ని రంగాలలోనూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ప్రొఫెసర్ జోసెఫ్ మోసిగంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.