22/02/2026
స్వామియేశరణం.. అయ్యప్ప శరణం అంటూ నిత్యం కర్మాన్ ఘాట్ హరిహర క్షేత్రం అయ్యప్పస్వామి ఆలయం మారుమోగుతుంది అంటూ దానికి కర్త, కర్మ, క్రియ వంగా మధు సూదన్ రెడ్డి గారే..
తెలంగాణ రాష్ట్రములోనే రెండవ అతి పెద్దదైన అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణం 2009 సంవత్సరంలో హస్తినాపురం డివిజన్ సాగర్ రింగ్ రోడ్డు బైరామల్గూడ, డిఫెన్స్ కాలనీలోని హరిహరక్షేత్రంను ఆధ్యాత్మిక చింతన మెండుగా ఉండి ఆ శబరిమల అయ్యప్ప స్వామిని దీక్షని 30సార్లు స్వీకరించి.. హైదరాబాద్ నుండి శబరిమలకి పాదయాత్రగా వెళ్లిన అయ్యప్ప ప్రియభక్తుడు వంగా మధుసూదన్ రెడ్డి గారు ఆలయ నిర్మాణం ప్రారంభించగా, హంపీ పీఠాధిపతి విరూపాక్ష విద్యాభారతి స్వామి పర్యవేక్షణలో ఆలయ నిర్మాణానికి అంకుర్పాణ జరిగింది. ఆలయ ధర్మకర్త వంగా మధుసూదన్ రెడ్డి గారు భక్తుల విరాళాలతో సుమారు రూ.20కోట్లకి పైగా వెచ్చించి ఆలయాన్ని రెండేండ్లలో సుందరంగా నిర్మించారు.
ఆలయంలో ఏకశిల పదునెట్టాంబడి (బంగారు మెట్లు) ఏర్పాటు కోసం నాగర్ కర్నూల్ జిల్లాలోని చారగొండ మండలం శిరుసనగండ్ల గుట్టలోని సీతారామచంద్రస్వామి ఆలయాన్ని ఎంచుకోగా, గుట్ట నుంచి 160టన్నుల బండను తొలిచేందుకు శిల్పులు ఎనిమిది మాసాల పాటు శ్రమించి ఏకశిల పదునెట్టాంబడిని చెక్కారు. రాష్ట్రంలోనే ఏకశిల పదునెట్టాంబడిని ఇక్కడి ఆలయంలో ప్రతిష్ఠించారు.
అయ్యప్ప స్వామి వారితో పాటు వినాయకుని, శివుని, దుర్గామాత, దత్తత్రేయ సుభ్రమణ్య స్వామి, ఆంజనేయు స్వామి మరియు సత్యనారాయణ స్వామి అలాగే నవగ్రహాలు మరియు మణికపురం మంజుమాత, నాగ దేవత ఆలయాలు సైతం ఇక్కడ కొలువుదిరేలా వంగా మధున్న నిర్మాణం చేపట్టడం జరిగింది..బంగారు కిరీటం , వెండి తలుపు మరియు 500 యార్డ్స్ లో గో -శాల మరియు 20 గృహాలని పూజరుల కోసం నిర్మించడం జరిగింది..
13 ఏళ్లుగా ప్రతి సంవత్సరం 5రోజుల పాటు అంగరంగవైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించడమే కాక 5రకాల హోమాలను అలాగే 5రకాల కళ్యాణోత్సవాలను నిర్వహిస్తూ..ప్రముఖ ప్రవచనకర్తలు చాగంటి కోటేశ్వరరావు గారు మరియు గరికిపాటి నరసింహరావు గారితో ప్రవచన సభలను సైతం ఏర్పాటు చేశారు..
అయ్యప్పస్వామి మహాపడి పూజా కార్యక్రమంలో ఏకశిల పదునెట్టాంబడిలో పడిని వెలిగించేందుకు స్వాములు పోటీ పడుతారు. నియమ నిష్టలతో అయ్యప్ప మాలాధరణ ధరించిన స్వాములు నిత్యం ఆలయంలో పడిపూజలు నిర్వహిస్తారు.
వంగా మధు సూదన్ రెడ్డి గారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయంలో సౌకర్యాలు కల్పించి, భక్తులకు నిత్యం అన్నదానం ఏర్పాటు చేసారు. తన చివరి మజిలీలో సైతం మృత్యువుతో పోరాడుతూ నేను లేకపోతే నా ఆలయం ఏమైపోతుందో అని భార్య పిల్లల గురించి కంటే తాను నిర్మించిన గుడి గురించి ఆలోచించిన గొప్ప దైవభక్తి వంగా మధున్న సొంతం..
ఆ హరిహర సుతుడి ప్రియభక్తుడు మన నుండి గతించినా ఆయన రూపం మన గుండెల్లో పదిలం..