28/11/2017
గౌతమబుద్ధుడు దశావతారాలలోని వాడా?
కానే కాదు. చాలామంది ఈ విషయంలో పొరపాటు పడుతూ ఉంటారు. విష్ణువు అవతారాలలో బుద్ధుడు వేరే, పెళ్ళాం పిల్లలను వదిలేసి పారిపోయిన గౌతమ బుద్ధుడు వేరే. వీరిద్దరికీ విష్ణువుకు బుద్ధుడికి ఉన్నంత తేడా వుంది. భాగవతం ప్రకారం చెప్పిన 23 లీలావతారాలలో బుద్ధుడు ఒకానొక వైష్ణవావతారం.
త్రిపాసురులు ఎన్నో సంవత్సరాలు వేదాధ్యయనం చేసి అత్యంత బలవత్తరమైన వరాలు పొంది లోకాలను అల్లకల్లోలం చేస్తున్న సమయంలో దేవతల ప్రార్ధన ఆలకించి శివుడు త్రిపురాసుల సంహారానికి ఉద్యుక్తుడయ్యాడు. ఆయనకు సహాయకారిగా విష్ణువు ఒక లీలావతారం ఎత్తుతాడు. దండి ముండి అయి రాక్షసులకు దగ్గరలో అవతార స్వీకారం చేసి వారికి కపట బోధలు చెయ్యడం మొదలుపెట్టాడు. వేదాలను త్యజించి కేవలం ధ్యానం చెయ్యడం వలన మోక్షమని, ఒకే పుట్టుక అని కావున వేదాలు ఇలాంటివి వదిలి పెట్టి జీవితాన్ని ఆస్వాదించమని, అహింస గురించి కూడా ప్రభోదించాడు. అతడి అత్యంత మోహన రూపం చూసి రాక్షసులు అతనికి వివశులు అవుతారు. అశ్వత్థ వృక్షం కింద కూర్చుని ఈయన బోధిస్తుంటే అక్కడకు మహా పతివ్రతలైన ఆ త్రిపురాసురుల భార్యలు కూడా వచ్చి మోహితులు అయి ఆ ప్రభోధాలకు లొంగి కామలోలులై ధర్మాన్ని తప్పుతారు. దానితో ఆ త్రిపురుల బలం క్షీణిస్తుంది. బ్రహ్మ రధం నడుపుతుండగా విష్ణువు బాణమై ప్రయోగింపబాడగా శివుని చేతిలో ఆ త్రిపురాసురులు అంతమవుతారు. ఇదే విషియం "ఆపన్నివారక స్తోత్రము " లో ఉంది. "ద్వైత్యస్త్రీమనభంజినే" అంటే రాక్షస స్త్రీల పాతివ్రత్యాన్ని భంగం చేసినవాడు అని అర్ధం. అంజని, జాని పుత్రునిగా చెప్పబదతాడు ఈ బుద్ధుడు.
బుద్ధుని గురించి కొన్ని పురాణ శ్లోకాలు:
భాగవతం 10-40-22 : “ నమో బుద్ధాయ శుద్ధాయ దైత్య దానవ మొహినే “
భాగవతం 1-3-24: “తత: కలౌ సంప్రవర్తతే సంమోహాయ సురద్విషం బుద్దో నామ్నంజనో సుత: కికతేషు భవిష్యతి” – కలియుగారంభంలో బుద్ధుడు అంజనా సుతునిగా జన్మించి అహింస ప్రబోదిస్తాడు
నరసింహ పురాణం 36/29 : “కలౌ ప్రాప్తే యదా బుద్దో భావన్నారాయణొ ప్రభు:”
నిర్ణయసింధు: జ్యేష్ట శుక్ల ద్వితీయం బుద్ధ జయంతి; పౌష్య శుక్లస్య సప్తమ్యాం కుర్యతే బుద్ధస్య పూజనం
విష్ణు, అగ్ని, వాయు స్కాంద పురాణాలలో బుద్ధుని ప్రసక్తి ఉన్నది. అన్నీ కూడా కలియుగారంభంలో బుద్ధ జన్మ ఉంటుంది అని చెప్పాయి. అంటే కనీసం 5000 సంవత్సరాల క్రితం. కానీ నేటి గౌతమ బుద్ధుడు కేవలం 2500 సంవత్సరాల పూర్వం ఉన్నవాడు.
ఎందరో ప్రసిద్ధ చరిత్రకారులు, indologists కూడా ఈ విషయాన్ని బలపరిచారు.
అన్నమయ్య తన కీర్తనలో కూడా ఈ విషయం ప్రస్తావిస్తాడు :
పురసతుల మానములు పొల్లజేసినచేయి.
ఆకాసాన బారేపూరి
అతివలమానముల కాకుసేయువాడు"
ఆకాసాన విహరించే ఊరులు - త్రిపురాలు. వారి మగువల ధర్మాన్ని తప్పించినవాడు. అప్పటి పరిస్థితుల బట్టి లోకరక్షణ కోసం స్వామి ధరించిన లీలావతారమిది.
గౌతమబుద్దుడు 500 BCE కాలం నాటివాడు. లుంబినిలో మాయాదేవి పుత్రుడుగా జన్మించాడు సిద్ధార్ధుడు. తరువాత తపస్సు చేసి గౌతముడు అయ్యాడు. ఇతడినే శాక్యముని అని కూడా అంటారు. ఇతనిది నిరీశ్వరవాదం. “తెరవాది” పుస్తకాల ప్రకారం ఆరు రకాల బుద్ధులు ప్రస్తావింపబడి ఉన్నారు. విపాస్య, శిఖి, క్రక్కుచండ, కొనగామర, కాశ్యప, మైత్రేయ బుద్ధులు. అమరకోశంలో చెప్పబడిన బుద్ధునికి గౌతమ బుద్ధునికి సంబంధం లేదు. కానీ వారి అహింస సిద్ధాంత సామీప్యం వలన చరిత్రకారులు ఇద్దరినీ ఒకటే అనుకున్నారు. బౌద్ధం అప్రతిహతంగా విస్తరించి నిరీశ్వర వాదులు, తద్వారా కర్మ త్యాగులు ఎక్కువై దారుణాలు జరగగా, వాటినినిలువరించి వేద ధర్మాన్ని పూన:ప్రతిష్టించినది పరమ శివ అవతారమైన ఆదిశంకరులు. పాషండ మతమైన బౌద్ధాన్ని తన వాదనా పటిమతో భారత దేశాననుండి తరిమి తరిమి కొట్టారు ఆయన.
గౌతమబుద్దునిగా మారిన సిద్ధార్ధుడు వేరే, వైష్ణవ అవతారమైన బుద్ధుడు వేరే. లీలావతారమైన బుద్ధుని సాధారణంగా దశావతారాలలో ప్రస్తుతించరు. జయదేవుని దశావతార స్తోత్రంలో చెప్పినా, సాధారణంగా పౌరాణికులు, సనాతన ధర్మావలంబకులు బలరాముని దశావతారాలలో ప్రస్తుతిస్తారు కానీ బుద్ధుని కాదు.
బౌద్ధమతంలో చెప్పిన ఎన్నో విషయాలు మన సనాతన ధర్మం నుండి గ్రహించినవే. కొన్ని తేడాలతో వారు వారి మతాన్ని నిర్మించుకున్నారు. తరువాత మన సనాతనధర్మ మూలాల మీద దాడి చేసారు. ఎప్పుడో వీరి దాష్టీకాన్ని ఆదిశంకరులు అడ్డుకట్ట వేశారు. వారు మనకు అందించిన వాన్గ్మయంతో మనం నేడు దీటుగా ఎదురుకోవాలి.
!! ఓం నమో వేంకటేశాయ !!
!! సర్వం శ్రీవెంకటేశ్వరార్పణమస్తు !!