06/09/2017
దేశ వ్యాప్తంగా ఖ్యాతి గాంచి లక్షలాది మంది భక్తులను కలిగిన ఖైరతాబాద్ గణపతికి ఇంతటి ఖ్యాతి రావడం వెనక స్థల మహత్యంతో పాటు శిల్పి రాజేంద్రన్, ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్ కుటుంబం శ్రమ దాగి ఉంది. ఎన్నో అవరోధాలను, అవమానాలను ధీటుగా ఎదుర్కొంటూ ప్రతిసారీ ఓ విశిష్ఠతతో ఇక్కడ గణపతిని తయారు చేస్తుంటారు. కోరిన కోరికలు తీర్చే దేవుడిగా గణపతి ప్రసిద్ధికెక్కడం వల్లే దేశంలో మరేగణపతి వద్ద లేని భక్తజన సందోహం ఖైరతాబాద్లో కనిపిస్తుంది. ఉత్సవాల 11 రోజుల పాటు ఖైరతాబాద్ ఓ మహాపుణ్యక్షేత్రాన్ని తలపిస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచే కాక విదేశాల నుంచి కూడా గణపతిని చూసేందుకు అధిక సంఖ్యలో ఇక్కడకు వచ్చి ఆధ్యాత్మికతతో గణపతిని ప్రార్థిస్తుండడం, ప్రతిరోజూ హోమాలతో శాస్త్రోక్త పూజలు నిర్వహించడంతో గణపతి ప్రాంగణానికి ఆఽధ్యాత్మికశక్తి వస్తోంది. 11 రోజులు సాక్షాత్తు వినాయకుడు ఖైరతాబాద్లో కొలువై ఉంటాడనే భక్తుల ప్రగాఢ నమ్మకానికి తగ్గట్లుగానే విగ్రహాన్ని తీర్చిదిద్దుతారు శిల్పి రాజేంద్రన్. ఈ గణపతి వద్ద ఎన్నో ఎన్నెన్నో విశిష్ఠతలు, మహి మలు ఉన్నట్లు భక్తులు చెబుతుంటారు. ఈ ఖైరతాబాద్ విశేషాల్లో ఇవి కొన్ని.
ఖైరతాబాద్లో ఒక అడుగుతో గణపతిని 1954లో అప్పటి కౌన్సిలర్ సింగరి శంకరయ్య ఉత్సవాలను ప్రారంభించారు. బాల గంగాధర్ తిలక్ ఇచ్చిన స్ఫూర్తితో ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
గణపతిని తయారు చేసే గ్రంథాలయ ప్రాంగణం అజంతా శిల్పాల్లోని 19వ గుహ ఆకారంలో అప్పట్లో సింగరి శంకరయ్య నిర్మింపజేశారు.
ఈ ఉత్సవాల ప్రారంభంలో శంకరయ్య హెలికాప్టర్ను అద్దెకు తీసుకొని తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతూ గణేష్ ఉత్సవాలను వాడవాడలా జరుపుకోవాలని కరపత్రాల ద్వారా అందరికి అవగాహన కల్పించేవారు.
ఈ విగ్రహ తయారీ జరిగే గ్రంథాలయ ప్రాంగణంలో అప్పట్లో ఒక వినాయకుడి చిన్నగుడి ఉండేదని చెబుతుంటారు.
20 సంవత్సరాల క్రితం గణపతి పైకెక్కే క్రమంలో షబ్బీర్ అనే ఓ వ్యక్తి హైటెన్షన్ విద్యుత్ వైరు తగలడంతో తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చేరగా మూడు రోజులకే అతడు పూర్తిగా కోలుకున్నాడు.
ఒకసారి ఉత్సవ కమిటీ ఛైర్మన్ సింగరి సుదర్శన్ వచ్చేసారి గణపతిని చేయబోనని సంకల్పించగా దీపావళి టపాసులు అమ్మే దుకాణంలో అగ్నిప్రమాదమై అతడి రెండు కళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. కళ్లు ఇక రావని వైద్యులు చెప్పినా.. కుటుంబ సభ్యులతో పాటు ఆయన గణపతిని తప్పకుండా చేస్తామని మొక్కడంతో చిన్నపాటి శస్త్ర చికిత్సతో అతడికి కళ్లు తిరిగి రావడం గణపతి దయేనని సుదర్శన్ చెబుతుంటారు.
15 సంవత్సరాల క్రితం మహారాష్ట్ర నుంచి కొందరు భక్తులు కారులో హైదరాబాద్కు గణపతి దర్శనం కోసం వస్తుండగా, రైల్వే ట్రాక్పై కారు అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఆ సమయంలో హడావిడి చెందిన కుటుంబ సభ్యులు గణపతిని తలచుకోగానే కారు ముందుకు వెళ్లిందని ఆ కుటుంబం ఎంతో సంతోషంతో మొక్కులు తీర్చుకున్నట్లు చైర్మన్, శిల్పి రాజేంద్రన్ చెబుతుంటారు.
శిల్పి రాజేంద్రన్ సురేంద్రపురి నిర్మాణంలో తలమునకలై ఉండి ఈసారి ఖైరతాబాద్ గణపతిని చేయలేనని నిర్వాహకులతో చెప్పాలని అనుకున్నాడు. ఆ సమయంలో ఆయన భువనగిరి బ్రిడ్జిపై నుంచి ఆయన ద్విచక్ర వాహనంతో పాటు కిందపడ్డాడు. స్కూటర్ తునాతునకలైనా రాజేంద్రన్కు మాత్రం చిన్న గాయం లేకుండా బయటపడ్డాడు. అప్పుడే గణపతిని మొక్కుకుని బతికున్నంత వరకు ఖైరతాబాద్ గణపతిని తానే తయారు చేస్తానని ప్రతిన బూనాడు.
శిల్పి రాజేంద్రన్ గణపతి విగ్రహాన్ని తయారుచేసే సమయంలో పూర్తి నిష్టతో బ్రహ్మచర్యం పాటిస్తూ ఇతర అలవాట్లకు దూరంగా ఉంటారు.
గణపతిని తయారు చేసేందుకు 3 నెలల పాటు 150 మంది కళాకారులు, 50 మంది కార్మికులు శ్రమిస్తారు.
గణపతి నిమజ్జనం కోసం విద్యుత్శాఖ ఊరేగింపు ప్రాంతంలో 15 సంవత్సరాల క్రితమే భూగర్భ కేబుళ్లను ఏర్పాటు చేసింది.
సచివాలయం పాత గేటు వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించినా ఖైరతాబాద్ గణపతి కోసం ఆ ఆలోచనను విరమించుకున్నారు.
భారీ గణపతి వద్ద అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి అంజయ్య, అప్పట్లో అగ్ర కథానాయకుడిగా వెలిగిపోతున్న ఎన్.టి.రామారావులు నిమజ్జనంలో స్వయంగా పాల్గొని సాగర్లోకి దిగి గణపతిని నిమజ్జనం చేశారు.
తొలి ఏళ్లలో గణపతిని పడవల్లో పెట్టుకొని హుస్సేన్సాగర్ మధ్యలో నిమజ్జనం చేసేవారు.
ఒకసారి పడవలో గణనాథుడిని తరలిస్తుండగా సాగర్ మధ్యలో పడవ బోల్తాపడింది. వినాయకుడు పడవపై పడడంతో ఆ పడవ ఇప్పటికీ సాగర్ మధ్యలోనే ఉన్నది.
భారీ గణపతి వద్ద తొలిసారిగా సాగర సంగమం సినిమా షూటింగ్ జరిగింది. హీరో కమలహాసన్ గణపతి ఎదుట నృత్యం చేశారు.
ఈ గణపతికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో, హైరేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్స్తో పాటు అనేక అవార్డులు దక్కాయి.