18/08/2020
శ్రీ నందికుంట విఘ్నేశ్వర స్వామి ఆలయం విశేషాలు
నాదెండ్ల గ్రామం పేరు వినగానే ఎక్కువమందికి గుర్తుకు వచ్చేది వినాయకుని గుడి. ఈ స్వామిని నందికుంట విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు. మహిమగల స్వామిగా అందరిచేత కొలువబడే దేవుడు. కొందరు విజయనగర రాజులచే ప్రతిష్టించబడిన స్వామి అని,కాదు రెడ్డి రాజులచే ప్రతిష్టించబడిన స్వామి అని మరికొందరు చెప్పుకునేవారు. కానీ ఈ రెండు నిజం కాదు స్వామి వారు ఇంకా పురాతన కాలంలోనే ప్రతిష్టించబడినారు.
స్థానికంగా ప్రచారంలో ఉన్న ఒక కథ ప్రకారం,ఒక వైశ్యుడు తన కోరిక నెరవేరితే వినాయకుని ప్రతిష్టించి పూజ జరిపిస్తామని మొక్కుకున్నారు. ఆయన కోరిక నెరవేరింది. స్వామివారికి ఇచ్చిన మాట ప్రకారం ఆయన స్వామివారిని ప్రతిష్టించి,ఘనంగా అన్నసంతర్పణ చేశారు కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్లి లెక్కలు వేసుకున్నారు అమ్మో ఎంత ఖర్చు అయిందో అనుకున్నారు. రాత్రి గడిచింది. మరునాడు ఉదయం ఆలయానికి వెళ్లి చూసేసరికి పీఠం మీద ఉండవలసిన స్వామి వారు ప్రతిష్ఠించిన ప్రదేశానికి ఎదురుగా ఉన్న కుంటలో ఉన్నారు. అది చూసి న భక్తునకు ఏమీ అర్థం కాలేదు అక్కడ మనుషులు తిరిగిన గుర్తులు కానీ, పీఠం వద్ద కదిలించినట్లుగా గుర్తులు గానీ ఏమి కనపడలేదు.కానీ స్వామి వారు పీఠం మీద లేరు. కొంతసేపటికి ఆయన ఆలోచించుకుంటే విషయం అర్థమైంది.ఎంతో భక్తితో కార్యక్రమం జరిపి,అయిన ఖర్చు లెక్క వేసుకున్న విషయం గుర్తుకు వచ్చి తన పొరపాటు గ్రహించాడు. స్వామి వారు తాను చేసిన తప్పుకు పీఠం దిగి కుంటలోకి వచ్చారని గ్రహించి, స్వామివారిని క్షమాపణ వేడుకున్నారు. స్వామి వారిని అక్కడ నుండి కదిలించలేదు. అక్కడే ఉంచి స్వామి వారిని పూజించారు.( ఈ కథ నాకు చెప్పినది గొల్లపాలెం మునసబు నారాయణ బాబు గారు.)
ఇక చరిత్ర విషయానికి వస్తే శాలివాహన శకం 1093వ సంవత్సరం కొండ పడమటి బుద్ధరాజు మరియు మండ రాజులు స్వామివారికి కానుక ఇచ్చినట్లు గుడి ఎదురుగా ఉన్న రాతి మీద శాసనం ఉంది శాసనంలో చాలా బాగం డామేజ్ అయింది.( కొండ పడమటి రాజులు రాణులు మూలస్థానేశ్వర స్వామివారికి, గోవర్ధన స్వామివారికి కి అనేక దానాలు చేసినట్లు శాసనాలు ఉన్నాయి.)
ఆలయంలోని విగ్రహాలను పరిశీలించినట్లయితే, ఆలయ మండపంలో నలుగురు దేవతామూర్తులు ప్రతిష్ఠించబడి ఉన్నారు శివుడు, వినాయకుడు, అమ్మవారు, సూర్యుడు( ఎడమ నుండి కుడికి )సాధారణంగా ఈ నలుగురు దేవతామూర్తుల తో పాటు విష్ణుమూర్తి కూడా ఉండాలి .ఈ విధమైన ఆరాధన పంచాయతన ఆరాధన అంటారు. ఆది శంకరాచార్యుల వారిచే ప్రతిపాదించబడిన ఈ పంచాయతన ఆరాధన ప్రకారం ఈ ఆలయం ప్రతిష్టించబడి ఉంటుంది .శాలివాహన శకం 1093 లోనే ఇక్కడ శాసనం వేయబడి ఉన్నదంటే, అప్పటికీ ప్రసిద్ధి పొందిన ఆలయం అయి ఉండాలి. శంకరాచార్యుల వారు గాని వారి శిష్య కోటీలో ఎవరైనా గాని ఈ ఆలయాన్ని స్థాపించి ఉండవచ్చు మరి ఇక్కడ విష్ణుమూర్తి ఎందుకు లేరు అనే సందేహం రావాలి.
ముస్లింల దండయాత్ర లో నాదెండ్ల గ్రామంలో గోవర్ధన స్వామి ఆలయం, మూలస్థానేశ్వర స్వామి ఆలయం, గాదేయగట్టుపై ఉన్న శ్రీ సీతారామ స్వామి ఆలయం ,చలం కొండలపైన ఉన్న వీరభద్ర స్వామి ఆలయం( కాటంరాజు గుడి) ధ్వంసమైన గుర్తులు ఇప్పటికీ సజీవంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ దండయాత్ర లోనే ఇక్కడ ఉన్న విష్ణుమూర్తిని ధ్వంసం చేయడం జరిగి ఉంటుంది. 1970 దశకం లో కూడా ఇక్కడ గుడి బయట శివుని పానవట్టం ఉండేదని పెద్దలు చెప్తారు కేవలం స్వామి వారి మీద అమితమైన భక్తితో, ప్రేమతో స్వామి వారిని, మిగిలిన మూర్తులను ప్రతిష్ఠించుకున్నారు.ఆ విధంగానే స్వామి వారిని కొలుచుకుంటున్నారు. వాస్తవానికి పంచాయతన ఆరాధనలో విగ్రహాల అమరిక వేరే విధంగా ఉంటుంది (ఈ విషయం తెలిపినది శ్రీ పండా వెంకటప్పయ్య గారు.)
పురాతన కాలం నుండి స్వామివారిని చుట్టుపక్కల గ్రామాల వారే కాక దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. వినాయక చవితి నాడు ఇప్పుడంటే విగ్రహాలు పెడుతున్నారు కానీ, పురాతన కాలంలో వినాయక చవితికి గుడి వద్దకు ప్రభలు కట్టుకొని రావడం ఆనవాయితీ. చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా ప్రభలు కట్టుకుని వస్తారు. సాధారణంగా నరసరావుపేట తాలూకాలోని అన్ని గ్రామాల నుండి కోటప్పకొండకు చిన్నా,పెద్ద ప్రభలు తరలి వెళతాయి. కానీ నాదెండ్ల గ్రామస్తులు ప్రభ కట్టడం అంటే ఒక్క నందికుంట విఘ్నేశ్వర స్వామి వారి వద్దకే.
పంటలు వేయడానికి ముందు చుట్టుపక్కల గ్రామాల రైతులు సామూహికంగా వచ్చి స్వామివారికి ఉండ్రాళ్లుపోసి, పొంగళ్ళు సమర్పిస్తారు. ఇక్కడికి వచ్చి ఉండ్రాళ్ళు, పొంగళ్ళు చెల్లించి వెళ్లేటప్పుడు వచ్చినవారు తప్పనిసరిగా వర్షంలో తడిసి వెళతారనే విషయం అందరికీ అనుభవమే. స్వామి వారి గురించి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత చెప్పినా తక్కువే.
స్వామి వారిని సేవించు కున్న భక్తులు.
దేవభక్తుని కోటయ్య గారు,వారి సతీమణి తమ జీవిత పర్యంతం స్వామి వారిని సేవించుకున్నారు మరియు వారి ఆస్తిని స్వామివారికి సమర్పించుకున్నారు. నాదెండ్ల బుచ్చయ్య (మంగలి బుచ్చన్న) అనే భక్తుడు స్వామివారి ఆలయం ఎదురుగా ఉన్న తాటితోపును స్వామివారికి సమర్పించుకున్నారు. తర్వాత కాలంలో అనేక మంది భక్తులు భూరి విరాళాలు స్వామివారికి సమర్పించి ఆలయ అభివృద్ధికి పాటుపడుతున్నారు. స్వామి వారిని సేవించుకుంటున్నారు.
స్వామివారి ఆలయంలో జరుగుతున్న పూజలు.
1. వినాయక చవితి నాడు వేలసంఖ్యలో భక్తులు వస్తారు
2. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి రెండవ ఆదివారం నాడు స్వామివారి వార్షికోత్సవం ఘనంగా జరుపబడుతున్నది
3 ప్రతి మాసం శుక్ల చవితి ఉదయ ప్రదోషకాలంలో స్వామివారికి అభిషేకం
4 .సంకటహర చతుర్థి ప్రతి మాసం పౌర్ణమి తర్వాత వచ్చే చవితినాడు సాయంత్రం ప్రదోషకాలంలో స్వామివారికి అభిషేకం
5. కార్తీకమాసంలో దేవతామూర్తులకు అభిషేకం
6. రథసప్తమినాడు సూర్యభగవానునికి అర్చన
7 .దసరా నవరాత్రులలో అమ్మవారికి కుంకుమ పూజలు.
ప్రతి ఆదివారం బుధవారం ఎక్కువ సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకుని ఉండ్రాళ్ళు, పొంగళ్ళు నైవేద్యం సమర్పించుకుంటారు. మీరు ఎప్పుడు పూజ చేయించుకోవాలంటే అప్పుడు స్వామి వద్దకు రావచ్చు నిండు మనసుతో స్వామిని మొక్కితే చాలు. రుసుములు చెల్లించవలసిన అవసరం లేదు.
ముగింపు.
స్వామివారిని భక్తులు ఎంత సొంతం చేసుకున్నారు అంటే దగ్గర నుండి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.బహుశా స్వామిని తమ తండ్రి గానో, తల్లి గానో భావిస్తారు ఏమో అనిపిస్తుంది.స్వామి వారిని దర్శించుకోవడానికి, పూజించుకోవడానికి కఠినమైన నియమాలు లేవు. ఇక్కడ ఉన్నదంతా రైతు వర్గం వారు. పొలం వెళుతూ గుడి బయట అరక ఆపి,లోపలికి వెళ్లి గంట కొట్టి దండం పెట్టుకుని వస్తారు. పొలం నుండి తిరిగి వచ్చేటప్పుడు అంతే చేస్తారు మా స్వామి మనసులో భక్తిని బిడ్డల ఆర్తిని చూస్తాడు గాని వీడు స్నానం చేశాడా, మంత్రాలు చదువుతున్నాడా, జపం చేస్తున్నాడా అని చూడడు. వీడు కనీసం కాళ్ళు అయినా కడగలేదే అని అనుకోడు. ఇంతగా భక్తులకు దగ్గరైన మహిమగల స్వామిని దర్శించుకోండి. తరించండి.
మీలో ఎవరి వద్ద అయినా స్వామివారికి సంబంధించిన చారిత్రిక, సాంస్కృతిక విశేషాలు ఆధారాలతో ఉంటే మాతో పంచుకోగలరు.
మన్నె కుమార స్వామి మరియు సంగిశెట్టి శ్రీనివాస రావు.