Brahmana Maha Sabha - Ponnur - 189/79

Brahmana Maha Sabha - Ponnur - 189/79 Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Brahmana Maha Sabha - Ponnur - 189/79, Shankara matam, brahmin Street, ponnur-, Guntur.

09/10/2018

పొన్నూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఆహ్వానము
రేపటినుండి అనగా ది. 10 10 2018 బుధవారం నుండి దేవి శరన్నవరాత్రుల సందర్భంగా బ్రాహ్మణ బజార్ చివరన గల గాయత్రి మందిరము శంకరమఠ ఆవరణము నందు ప్రతిరోజు ఉదయం ఆరున్నర గంటల నుండి చండీ పారాయణము సాయంత్రము 4.30 నుండి చండీ సప్తశతి హోమము జరుగును కావున ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరుచున్నాము శరన్నవరాత్రులలో చండీ పారాయణం చేసిన లేదా వినినా వారికి సర్వ బాధల నుండి విముక్తి కలగ చేస్తానని ధనధాన్యములను మరియు సుతుల వలన వంశ అభివృద్ధి చేస్తానని అమ్మవారు స్వయంగా చెప్పారు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావలసినది
ఇట్లు
బ్రాహ్మణమహాసభ పొన్నూరు

శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామ మాలా

ఈ శ్లోకం చాలా శక్తిమంతమయిన శ్లోకం.

దుర్గాదేవికి సంభందించిన 32 నామాలు ఇందులో ఉన్నాయి . ఈ శ్లోకం దుర్గాసప్తసతి లో కనిపిస్తుంది .

*దుర్గా దుర్గార్తి శమనీ దుర్గాపద్వినివారిణీ
దుర్గమచ్ఛేదినీ దుర్గసాధినీ దుర్గనాశినీ
ఓం దుర్గతోద్ధారిణీ దుర్గనిహంత్రీ దుర్గమాపహా
ఓం దుర్గమజ్ఞానదా దుర్గ దైత్య లోక దవానలా
ఓం దుర్గ మాదుర్గమాలోకా దుర్గమాత్మ స్వరూపిణీ
ఓం దుర్గమార్గప్రదా దుర్గమవిద్యా దుర్గమాశ్రితా
ఓం దుర్గమ జ్ఞాన సంస్థానా దుర్గమ ధ్యాన భాసినీ
ఓం దుర్గ మోహాదుర్గ మాదుర్గమార్ధ స్వరూపిణీ
ఓం దుర్గ మాసుర సంహంర్త్రీ దుర్గమాయుధధారిణీ
ఓం దుర్గమాంగీ దుర్గమాతా దుర్గమాదుర్గమేశ్వరీ
ఓం దుర్గభీమా దుర్గభామా దుర్లభా దుర్గ దారిణీ
నామావళి మిమాం యస్తు దుర్గాయా మమ మానవః
పఠేత్సర్వ భయాన్ముక్తో భవిష్యతి న సంశయః*

శ్రీ విళంబినామ సంవత్సర      తెలుగు నూతన           సంవత్సర          శుభాకాంక్షలు ...    🌹🌹🌹🌹🌹🌹
18/03/2018

శ్రీ విళంబినామ సంవత్సర
తెలుగు నూతన
సంవత్సర
శుభాకాంక్షలు ...
🌹🌹🌹🌹🌹🌹

17/03/2018
17/03/2018

బ్రాహ్మణ బంధువులకు, మిత్రులకు, భక్తులకు ఆహ్వానము
శ్రీ విళంబి నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు
ది.18-03-2018 ఆదివారం ఉగాది రోజున మన శంకరమఠం పొన్నూరు నందు ఉదయం విశేష పూజలు సాయంత్రం 6 గంటలకు బ్రహ్మశ్రీ గణపవరపు రామశాస్త్రి గారిచే పంచాంగ పఠనము జరుగును కావున అందరు పంచాంగ శ్రవణము నందు పాల్గొనవలసినది గా కోరుతూ...పులిపాక ప్రసాదు కార్యదర్శి బ్రాహ్మణ మహాసభ పొన్నూరు

26/02/2018

మొదటి శ్లోకము:

శివశ్శక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం
నచే దేవం దేవో నఖలు కుశలః స్పందితుమపి
అతస్త్వామారాధ్యం హరిహర విరించాది భిరపి
ప్రణంతుం స్తోతుంవా కథమకృత పుణ్యః ప్రభవతి.

(శివుడు శక్తితో కూడి ఉన్నప్పుడే శక్తి గలవాడవుతున్నాడు. లేకుంటే ఆ స్వామి స్పందించడానికి కూడా సమర్థుడు కాడు కదా! హరిహర బ్రహ్మాదుల సైతం ఆరధించబడే అటువంటి నిన్ను స్తుతించడానికో, నమస్కరించడానికో ఎంతో పూర్వ పుణ్యం లేనివానికి ఎలా సాధ్యమవుతుంది.)

సౌందర్యలహరి ప్రథమ శ్లోకారంభంలోనే ఆచార్యుల వారు “అమ్మతో కూడి ఉండని అయ్య కొంచెమైనా స్పందించడానికి కూడా సమర్థుడు కాదు” అంటున్నారు. ఈ మాటలోని అంతారార్థము, ఈ మాటద్వారా మనకు చేసిన బోధ ఏమయి ఉండాలి? నాకు మాత్రం ఆచార్యుల వారు మనందరి తరఫునా అంబికతో “తల్లీ! నీ దయలేనిదే శివుని నిశ్చల తత్త్వాన్ని మేము పొందగలమా” అని చెబుతున్నట్లు తోస్తున్నది. ఆ తల్లి నిశ్చలమైన వస్తువును చలింపచేసే మహాశక్తి! ఆమె లీల శివునిలో (పరబ్రహ్మలో) తన పరిస్థితిని తాను గుర్తించే స్పందన కలగజేయడంతో ఆరంభంవుతుంది.

ఈ శ్లోకం పరమశివునిలో అట్టి మొదటి స్పందన అంబికవల్ల ఏర్పడిందని చెబుతోంది. స్పందన వెనుక స్పందన, కదలిక – ఇప్పటి మన జీవితములలోని స్పందనలకు దారి తీసినవి. అనంతమైన జీవజాలంతో అంతమయ్యే ఈ స్పందనలు అవరోహణ క్రమంలో ఉన్నాయి. ఈ క్రమము వివిధ శాస్త్రములలో ఇరవై నాలుగు లేక ముప్ఫై తత్త్వములుగా చెప్పబడి ఉన్నది. ఈ అవరోహణా క్రమానికి పరిణామమని పేరు. ఇది డార్విన్ చెప్పిన పరిణామము వంటిది కాదు. అతడు ఏకకణజీవి క్రమక్రమంగా పరిణామం చెంది మనుష్యునిగా పరిణమిస్తోంది. అంతర్ముఖమైన బ్రహ్మపదార్థాము బహిర్ముఖమవడం – లెక్కలేనన్ని ఉపాదులుగా మారడం – ఇట్టి క్రమాన్ని పరిణామమంటారు.

ఒక వ్యక్తి తన స్వస్థితిని అనగా బ్రహ్మైక్యాన్ని పొందడాన్ని మోక్షము లేక ముక్తి అంటున్నారు. బ్రహ్మనుండి వ్యక్తులగా పరిణామం అవరోహణము. వ్యక్తి బ్రహ్మలీనుడవడం ఆరోహణము. సంగీతంలో సరిగమపదని ఆరోహణ క్రమము. సనిదపమగరి అవరోహణ క్రమము. మొదటి మెట్టయిన ‘స’ బ్రహ్మపదార్థమైతే తుదిమెట్టు ‘రి’ జీవాత్మ. జీవుడు ముక్తుడవాలంటే ‘గమపదని’ లను దాటుకుంటూ ‘స’ను చేరాలి. ఈ అవరోహణ, ఆరోహణలనడం కంటే తనను తాను బహిర్గతం చేసుకోవడం, అంతర్ముఖుడవడం అంటె సరిగా ఉంటుందేమో? బ్రహ్మ పదార్థం బహిర్గతమయి తనను ఈ ప్రపంచంగా, జీవజాలంగా కనబరచుకోవడం పరిణామము. జీవులు బహిర్విషయములనుండి దృష్టి మరలించి తనలో తాను లీనమవడం అంతర్ముఖత్వం.

ఒకసారి బహిర్గతమైన వ్యాప్తి పొందిన జీవుడు బ్రహ్మాంతర్లీనుడవడానికి ఎంతో శ్రమించవలసి ఉన్నది. పోనీ, మనం శ్రమ పడితే సరిపోతుందా? అదీ కుదరదు. బ్రహ్మపదార్థము నుండి మనుష్యులుగా మారడమన్నది మనంతట మనం చేసుకొన్నది కాదు కదా! ఇది ఆ అంబిక లీల అని కదా ఆచార్యుల వారంటున్నారు!! ఆ తల్లి లీల వలన ఈ జగన్నాటకంలో మనకో పాత్ర వచ్చింది. అనుభవిస్తున్నాము. ఈ పాత్రనుండి ముక్తులమవడమనేది మళ్ళీ ఆ తల్లి అనుగ్రహం వల్లనే సాధ్యమవుతుంది. ఏ శక్తి అయితే మనలకు బహిర్గతం చేసిందో ఆ శక్తి దయ వలననే మనం అంతర్లీనులమవగలము. గాలికోసం పంఖా వేశాము. పంఖా తనంతట తాను ఆగిపోతుందా? రెక్కలు పట్టుకొని ఆపినా మళ్ళీ వదిలివేయగానే తిరగడం ఆరంభిస్తుంది కదా! ఏ మీట నొక్కితే తిరగడం ఆరంభించిందో అదే మీట నొక్కి కదా ఆపుచేయాలి!!

పరబ్రహ్మమైన పరమశివుడు ఈ ప్రపంచంగా పరిణామం చెందడానికి అంబిక కారణం. ఈ విషయం చెప్పడంలోనే ఆచార్యులవారు ఈ విషయపు రెండవ పార్శ్వం కూడా సూచించుతున్నారు. పరమాత్మ అయిన శివుడు జీవత్మగా అనిపించడానికి ఏ అంబిక కారణమో మళ్ళీ ఈ జీవ భావం వదిలి శివైక్యం చెందడానికి ఆ అంబికయే కారకురాలవుతుంది. అట్టి శివైక్యం కోసం మనం నిరంతరం అంబికా కటాక్షం కోసం ప్రార్థించాలి. ఆచార్యులవారు ఈ శ్లోకంలో బోధించినదదే!

అంబిక మనకై ఏర్పరచిన ఈ పాత్రనుండి బ్రహ్మానుభవస్థితిని పొందడానికి మనం ప్రయత్నించాలి అని చెప్పుకొన్నాం కదా! కర్మ, భక్తి, జ్ఞాన, యోగ మార్గములు ఇటువంటి ప్రయత్నములు. వీనిలో భక్తిమార్గము అత్యంత సులభ సాధ్యమైనది. ఆనందదాయకమైనది. ఈ మార్గాన్నే ఆచార్యులవారు సౌందర్యలహరిలో రూపొందించారు.

పొందశక్యముకాని స్థితిని పొందేదెలా? ఒక దయామయమైన, పరమప్రేమరూపమైన మూర్తిని భావించి చింతించాలి. అప్పుడు ఆ మూర్తి మనకు సమీపవర్తియై ఉంటుంది. భగవంతునిపై ఇట్టి భావన, భక్తి అని పిలవబడుతుంది. అనేకమైన మధురమైన ప్రేమ భావనలున్నాయి. వాటిలో తల్లికి తన పుత్రునియెడగల ప్రేమ వాత్సల్యములు స్వాభావికము, స్వార్ధరహితము అయినవి. ఆచార్యులవారు జగన్మాత పరమ వాత్సల్యరూపాన్ని తమ కవితా సౌందర్యాలతో హృద్యంగా నిరూపించారు. వాత్సల్యాన్ని వర్షించే తల్లితో పాటు ఆమెనూ, మననూ ఆదరించే తండ్రి పరమశివుడు.

ఆచార్యులవారు “శివశ్శక్త్యా యుక్తో” అన్న వాక్యంలో జగత్తుకు పితరులైన ఆ ఆదిదంపతుల మిథునాన్ని మనకు సాక్షాత్కరింప చేస్తున్నారు. అదే సమయంలో అంబిక పరమమైన స్థితిని, తండ్రికి బలాన్ని చేకూర్చే తల్లిగా, మహాపతివ్రతగా అభివర్ణిస్తున్నారు.

(సశేషం)

#కంచిపరమాచార్యవైభవం

రెండవ భాగంమొదటి నలభై శ్లోకాలు మంత్ర శాస్త్రమునకు సంబంధించినవి. మంత్రానుష్ఠానము కఠినమైన నియమాలతో కూడి ఉన్నది. కొద్ది మంది...
12/02/2018

రెండవ భాగం

మొదటి నలభై శ్లోకాలు మంత్ర శాస్త్రమునకు సంబంధించినవి. మంత్రానుష్ఠానము కఠినమైన నియమాలతో కూడి ఉన్నది. కొద్ది మంది మాత్రమే వాటిని సజావుగా అర్థం చేసుకొని ఆచరించగలరు. ఇప్పుడీ మొదటి భాగంలో శ్లోకాలు మంత్రప్రయోగము లేక కుండలినీ యోగంతో కూడి ఉన్నది. ఇట్టి యోగ సాధనలో ఏమాత్రం తప్పు దొర్లినా సాధకునికి చెడు ఫలితాలను కలగజేస్తుంది. అంబికకు ఈ రకమైన విధానంలో ఆరాధించడంలో ప్రమత్తత పనికిరాదు. అయితే అమ్మ లీల బహువిధమైనది. ఇట్టి కఠినమైన నియమాలతో ఆమెను చేరడానికి ఒక మార్గముండగా, సాధకులు తేలికగా తరించే మార్గాలు కూడా ప్రసాదించింది. ఏ మార్గమయినా ఆ మార్గమునకు ఏర్పాటు చేయబడ్డ నియమాలను సక్రమంగా పాటిస్తేనే పూర్తి ఫలితాలను ఇస్తుంది.

తేలిక మార్గములకూ నియమాలున్నాయి. అయితే అవి సామాన్యులకు సైతం ఆచరించడానికి అనువైనవి. దేవాలయ సందర్శనము, అక్కడి ఆరాధన, స్తోత్ర పారాయణాదులు, శాస్త్రీయ భక్తి సంగీతము, భజనలు, భగవద్విభూతులను తెలియజేసే పురాణాదులను వినడం వంటివి అంబికను ఆరాధించే తేలికైన మార్గాలలో కొన్ని. ఒకవేళ ఒక భక్తుడు ఈ మార్గాలు తనకు సరిపోవని జపము, యోగము, శ్రీచక్రార్చనము వంటి మార్గాలను నియమరాహిత్యంగా క్రమశిక్షణ లేకుండా అనుష్ఠించవచ్చని అనుకుంటే, అంబిక అట్టి ప్రవృత్తిని తుంటరి తనంగా భావిస్తుంది. అంబికారాధనములో కష్టసాధ్యమైన ఆరాధనా విధానములలో సాధన వాటిని ఆచారించడానికి సమర్థులైన కొంతమందికి వదిలివేస్తే మంచిది. ఆచార్యులవారి దయ అత్యున్నతమూ,సార్వజనీననమూ అయినది. వారు చెప్పిన ఏభై తొమ్మిది శ్లోకములలో అంబిక మంత్రమూర్తి కాదు. సర్వులూ తమ మనస్సులలో భావించి, దర్శించి మహదానందం పొందగలిగే మహా సౌందర్యరాశి. అమ్మ అద్భుతమైన సౌందర్యాన్ని ఆచార్యులవారు తమ కవిత్వంలో వర్ణించారనే దానికంటే అంబిక ఆచార్యులవారి కవితలో అవతరించిందని చెప్పుకోవడం సరి అయినదేమో!!

కైలాసం నుండి వచ్చిన నలభై ఒకటి శ్లోకాలు ఒక భాగం – ఆచార్యులవారి వాగమృత ఝరిగా ప్రవహించిన ఏభై తొమ్మిది శ్లోకాలు ఒక భాగం – అనుకొంటే మొదటి భాగానికి ఆనందలహరి అనీ, రెండవ భాగానికి సౌందర్యలహరి అనీ పేరు. ఈ రెండూ కలిసి ఒక శతకంగా“సౌందర్యలహరి” అనే పేరుతోనే పిలవబడుతున్నాయి.

పైన నేను చెప్పిన కథ మార్కండేయ సంహిత లోనిది. ఆనందగిరి శంకర విజయము ఈ కథనే గద్యరూపంలో చెబుతోంది. అయితే కొందరు ఈ నూరు శ్లోకములూ ఆచార్యులవారి చేతనే వ్రాయబడినాయంటారు. అలా అనడంలోనూ దోషం లేదు. వేదమంత్రములు మంత్రద్రష్టల పేర్లతో పిలవబడటం లేదా? కైలాస శంకరులచే చెప్పబడిన ఈ మంత్రశాస్త్రం కాలడి శంకరుల వల్లనే మనకు సంప్రాప్తమైంది. కాబట్టి వారినే కర్తగా చెప్పుకోవడంలో తప్పేమున్నది. అస్సలీ కాలడి శంకరులు కైలాస శంకరుల అపరావతారం అని అనేకసార్లు చెప్పుకొన్నాం కదా! ఆ విధంగా చూచుకొన్న ఆచార్యులవారిని సౌందర్యలహరికి మొత్తంగా రచయితగా చెప్పుకోవచ్చు.

మొదటి నలభై ఒకటి శ్లోకాలు త్రిపురసుందరీ అర్చనా విధానంలో గూఢమైన కుండలినీ యోగము మొదలుగాగల మంత్రశాస్త్రపు సూక్ష్మార్థాలతో నిండి ఉన్నాయి. దీనినే శ్రీవిద్య అంటారు. శ్రీవిద్యా ఉపసకులకు ఎంతో అవసరమైన సూక్ష్మార్థాలు ఈ భాగంలో పొందుపరచబడినాయి. ఇక ఆచార్యుల వారిచే చెప్పబడిన ఏభై తొమ్మిది శ్లోకాలు అమ్మ మాటలకందని మహాసౌందర్యాన్ని అందించే విధంగా ఉన్నయి. ప్రతి శ్లోకము ఎంతో మధురంగా, ఉదాత్తమైన భావాలను వెలువరించేదిగా ఉంటుంది. పదములకు ఇంతటి అర్థస్ఫూర్తి కలిగించే శక్తి ఉన్నదా అన్న అబ్బురపాటును కలగచేస్తాయి. ఆచార్యులవారి ఆలోచనలలో స్పష్టత, వారి భావప్రకటనా దక్షత ప్రతి ఒక్క శ్లోకము ఎత్తి చూపుతుంది. ఎంత లోతైన భావాలు? ఒక్కొక్క శ్లోకం వేలసార్లు చదివినా తీరని భావపుష్టి, ఆనందస్ఫూర్తి కలగచేయడానికి సమర్థములైనవి.

ఒక పురాతనమైన జీవకళ ఉట్టిపడే శిల్పం మరమ్మతు చేయాల్సివస్తే ఎంత ప్రయత్నించినా తిరిగి ఆ అందాన్ని, ఆ జీవకళను తీసుకొని రాలేము. ఆచార్యులవారి కవిత్వంలో ఒక పదం మార్చి వేరొక పదంతో అంతటి రసస్ఫూర్తిని పొందడం అసాధ్యం.

అందుకే నేనన్నాను, నందికేశ్వరులకు మనం కృతజ్ఞులముగా ఉండాలి. లేకుంటే ఆచార్యులవారి అత్యద్భుతమై కవితా సౌందర్యంలో ఓలలాడుతూ మహా సౌందర్యరాశి, అందములకెల్ల అందమైన అమ్మ అందాన్ని దర్శించే అదృష్టం మనకొచ్చేదా??

(సశేషం)

#కంచిపరమాచార్యవైభవం

శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం!నమామి భగవత్పాదం శంకరం లోక శంకరమ్!!మన ఆచార్యులవారు (ఆది శంకర భగవత్పాదులు) సామాన్యులకు...
11/02/2018

శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం!
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరమ్!!

మన ఆచార్యులవారు (ఆది శంకర భగవత్పాదులు) సామాన్యులకు మల్లేనే దేవాలయ సందర్శనములు, పూజాదికములు విధివిధానంగా చేసేవారు. వారి దైవీశక్తి వలన దేవతామూర్తుల సాన్నిధ్యం మరింత శక్తివంతమయ్యేది. దాని కొఱకై వారు కొన్ని దేవాలయాల్లో స్వయంగా యంత్రస్థాపనము కూడా చేశారు. పాదచారులై భారతావని నంతటినీ పావనం చేశారు. అటువంటి తీర్థయాత్రలలోనే ఒకసారి వారు పార్వతీ పరమేశ్వరుల సందర్శనార్థము కైలాసానికి వెళ్ళారు. ఆచార్యులవారే పార్వతీ పరమేశ్వరుల సమిష్ఠి అవతారమన్న విషయం మనం మఱవరాదు.

రామచంద్రుడు తాను స్వయంగా విష్ణుమూర్తి అవతారమయి ఉండి అదే విష్ణ్వంశ లేక అవతారమైన పరశురాముని కలిశాడు. కృష్ణుడు ఆయన సోదరుడు బలరాముడు ఇద్దరూ విష్ణ్వతారములే కదా! వారిద్దరూ ఒకేకాలం కలిసి కూడా ఉన్నారు. అవతారాలకు సంబంధించి ఇటువంటి ఆసక్తికరమైన అంశాలు అనేకం ఉన్నాయి.

ఇప్పుడు ఆచార్యులవారు తమ అవతారమునకు మూలమైన పార్వతీ పరమేశ్వరులను సందర్శించారు. పరమేశ్వరుడాయనకు అయిదు స్ఫటిక లింగములు, ఒక తాళపత్ర గ్రంథము ప్రసాదించాడు. కొందరు ఈ తాళపత్ర గ్రంథము అంబిక చేత ప్రసాదించబడిందని చెబుతారు. ఈ గ్రంథంలో అంబికపై వ్రాయబడిన నూరు శ్లోకములున్నాయి. కొందరు ఈ శ్లోకములు పరమేశ్వరుని చేతనే చేయబడినవంటే మరికొందరు లలితా సహస్రనామం వలె వశిన్యాది వాగ్దేవతలచేత పాడబడిందని అంటున్నారు. పరమేశ్వరుడే భక్తునిగా అంబికపై ఈ శ్లోకాలు చెప్పాడంటేనే ఎక్కువ ఉచితంగా ఉంటుందేమో!!

ఈశ్వరుడు ప్రసాదించిన అయిదు స్ఫటిక లింగములు తనవైన మూర్తులు, లింగమునకు చేతులూ, కాళ్ళూ, ముక్కూ, చెవులూ, కళ్ళూ లేక రూపారూపంగా ఉంటుంది. తాళపత్ర గ్రంథము అంబికా స్వరూపము. అంబిక మంత్రమూర్తి. ఈ గ్రంథములో అంబికకూ మంత్రశాస్త్రానికీ సంబంధించినది. ఏ రకంగా శివలింగము శివుని రూపమో ఈ గ్రంథం కూడా అడే విధంగా అమ్మవారి రూపమవుతుంది. కాబట్టి పరమేశ్వరుడు తన స్వరూపమైన స్ఫటిక లింగాలను ప్రసాదిస్తే అమ్మ తన రూపమైన గ్రంథాన్ని ప్రసాదించిందని చెప్పుకోవడం యుక్తంగా ఉంటుంది. ఇచ్చినవారూ, పుచ్చుకొన్నవారు, ఇచ్చినదీ మూడూ ఒక్క వస్తువే! ఇది ద్వైతాద్వైతముల కలయిక!

అట్టి అయిదు స్ఫటిక లింగములలో ఒకటి మన శ్రీ మఠంలో (కంచి కామకోటి మఠం) చంద్రమౌళీశ్వరుడనే పేరుతో అర్చించబడుతోంది. ఇది యోగలింగము. కేదారంలో ముక్తిలింగము, నేపాళంలో వరలింగము, చిదంబరంలో మోక్షలింగము, శృంగేరీలో భోగలింగము ప్రతిష్ఠించబడ్డాయి.

ఆచార్యులవారు ఈ అయిదు స్ఫటిక లింగాలనూ, తాళపత్రగ్రంథాన్ని తీసుకొని కైలాసం నుండి బయలుదేరారు. పార్వతీ పరమేశ్వరుల ఆరాధనా విధానాన్ని మరింత సుష్ఠుపరచాలని వారి ఉద్దేశ్యం. ఆచార్యులవారు కైలాసం నుండి బయటకు వెళుతుంటే ద్వారపాలకునిగా ఉన్న నందీశ్వరుడు చూచాడు. దేముడు వరమిచ్చినా పూజారి వరమీయడనే సామెత ఉన్నది కదా! పార్వతీదేవి అనుగ్రహించినా అంతటి మహోన్నతమైన మంత్రశాస్త్రము కైలాసంలో లేకపోవడం అన్నది ఆయనకు ఇష్టం లేదు. ఈ తాపం కోపంగా మారింది. ఆచార్యులవారి చేతినుండి తాళపత్ర గ్రంథాన్ని ఊడపెరుక్కున్నాడు. ఆచార్యుల వారెదురు చూడని సంఘటన ఇది. ఎక్కువ భాగం గ్రంథం నందికేశ్వరునికి చిక్కింది. మిగిలిన నలభై ఒక్క శ్లోకాలతో ఆచార్యులవారు బయటకు వచ్చారు.

ఇది వింటుంటే మీకందరికీ నందికేశ్వరునిపై కోపం వస్తున్నది కదా! మీ మనసులలో “అతడు ఆచార్యులవారి యెడ ఈ విధంగా ప్రవర్తింపనగునా? అంబిక ప్రచారం చేయడానికి అనుగ్రహించిన వంద శ్లోకాలలో ఏభైతొమ్మిది ఊడపెరుక్కోవడం న్యాయమా?” అన్న భావం వచ్చి ఉండవచ్చు. నాకు మటుకు నందికేశ్వరునికి మనం ఎంతో కృతజ్ఞులమై ఉండాలని తోస్తోంది

ఆచార్యులవారు జరిగినదానికి వ్యాకులితులైనారు. “అమ్మ మానవాళిపై దయతో వారికందించవలసినదని ఇచ్చిన పెన్నిధిలో ఎక్కువ భాగం పోగొట్టుకొనా.” అంటూ ధార్మిక ద్రవ్యానికి ఏర్పరచబడ్డ ధర్మకర్తవలె బాధపడ్డారు. మరి శంకరులు లోక శంకరులు. తమ జీవితంలో ప్రతి క్షణమూ మానవాభ్యుదయానికై వెచ్చించిన వారు మరి!!

ఆ సమయంలో అంబిక గొంతు వినిపించింది. “పోయిన ఏభై తొమ్మిది శ్లోకాలూ నీవే పూరించు. అదే నన్ను తృప్తి పరుస్తుంది. నీ వలనే ఈ కార్యం అవ్వాలనే ఉద్దేశ్యంతోనే ఆ శ్లోకాలు పోయేట్లు చేశాను.” అన్నది అంబిక. అంతె! అదే క్షణంలో ఆనకట్టల తలుపులు తెరవగానే పడత్రోసుకొని వచ్చే మహానదీ ఉత్తుంగ ప్రవాహంవలె ఆచార్యులవారి ముఖం నుండి ఏభై తొమ్మిది శ్లోకాలు వెలువడ్డాయి. ఇవి అంబిక కేశాలు పాదాంత వర్ణనతో కూడినవి.

(సశేషం)

#కంచిపరమాచార్యవైభవం

03/01/2018

భజ గోవిందమ్ ! భజ గోవిందమ్ !

6.యావత్పవనో నివసతి దేహే,

తావత్పృ చ్ఛతి కుశలం గేహే

గతవతి వాయౌ దేహాపాయే,

భార్యా బిభ్యతి తస్మిన్కాయే.

భావం : ఎంతవరకూ ఈ దేహంలో ప్రాణం ఉంటుందో అంతవరకూ ఇంటిలోని వారు “కుశలమా ?”అని అడుగుతూ ఉంటారు. ఆ దేహంలో ప్రాణం పోగానే శవాన్ని చూసి అతని భార్యకూడా భయపడుతుంది.

దేహంలో ఉండే ప్రాణం ఎప్పటికైనా పోయేదే.ప్రాణం పోయిన మరుక్షణం పుంలింగం, స్త్రీలింగం అనే విభజనకు ఆస్కారం లేకుండా ఆ దేహం “శవం” అని పిలువబడుతుంది. శవాన్ని చూడటం, తాకటం అశుభమని కొందరు అంటారు. చూడటానికి కొందరు భయపడతారు. జీవులన్నీ శవాలుగా మారక తప్పని సృష్టి రచన ఇది!

ఆశ్చర్యం కాకపోతే, అంతవరకూ భార్య తన భర్తయొక్క శరీరాన్ని ప్రేమించింది. అతనికి సమస్తమైన పరిచర్యలు చేసింది.అతనికి ఇష్టమైనట్టు అలంకరించుకొంది. ఇష్టమైన పదార్థాలను వండి పెట్టింది. అతనితో కష్ట సుఖాలు పంచుకొంది. తనకు వల్లమాలిన భయం వేసిన సందర్భాల్లో అతనిని తీగలా అల్లుకొంది.“మా వారు మహ మంచివా”రని మురిసిపోయింది. అరమరికలు లేకుండా తన ప్రేమనంతా అతనికి అర్పించింది. అతను ఏ పనిమీదనైనా పొరుగూరు వెడితే, వచ్చే వరకూ బెంగగా ఎదురు చూసింది.అతను రావటం ఆలస్యమైతే కీడుశంకించి, అల్లాడిపోయి కన్నీరు కార్చింది. ఇంతగా భర్తతో మమేకమైన ఇల్లాలు - భర్త శవాన్ని చూసి , దానిని తాకటానికి భయపడుతోందే !- ఎందుకా భయం?దానికి సమాధానం ఎవరు చెప్తారు? ఇదే పరిస్థితి తన ప్రియమైన ఇల్లాలు గతిస్తే , భర్తకూ వస్తుంది.

చనిపోయిన వాడిని చూసేందుకు అతని ముఖ్య బంధువులింకా రావలసి ఉన్నా, “తరవాత జరగవలసిన పనులు కానీయండి త్వరగా, ఎంతసేపు ఇలా పెట్టుకు కూర్చుంటాం” అని హెచ్చరించేవారు, ఆ శరీరం మీద ఒక చిన్న బంగారు ఉంగరమో, గొలుసో ఉంటే - దాన్ని తీసెయ్యమని ముందుచూపుతో సైగలు చేసేవారు , ఆ శవానికి దూరంగా వలయాకారంలో నిలబడి , చనిపోయినవాడి ని గూర్చి చర్చించేవారు .. ఇలా ఎన్ని దృశ్యాలు!

సంసారంలోని ప్రేమలను, ఆకర్షణలను, త్యాగాలను అల్పంగా పరిగణించలేము. శంకించ లేము.అయితే అవి ఎప్పటికీ శాశ్వతం అనుకుంటే మాత్రం అది భ్రమ! వాటన్నిటికీ మరణమే హద్దు. భార్యా భర్తల సుదీర్ఘ సాహచర్యం ఎంత నిజమో , వారిలో ఒకరు మరణిస్తే రెండవవారు - వారి కళేబరాన్నిచూసి భయపడతారనేది కూడా అంత నిజం. కాల గమనంలో ఉవ్వెత్తున లేచిన విషాద తరంగం , ఆ కాలగమనంలోనే అణగిపోతుంది. ఇది సృష్టి ధర్మం.

ఇలాంటి విషాద ఘట్టాలు మరుగున పడవెయ్యటానికే భగవంతుడు జీవులకు “మరపు” అనే దివ్యౌషధాన్ని ప్రసాదించాడని శ్రీ వడ్డాది సుబ్బారాయుడు గారు తమ “భక్తచింతామణి” శతకంలో చెప్పారు.

ఒక వ్యక్తి రైలు ఎక్కబోతూ ప్రమాద వశాన చక్రాల క్రింద పడ్డాడు. ప్రాణం పోలేదుగానీ, అతని ఎడమచేయి తెగి, అతని శరీరం నుంచి వేరయింది. దానిని అతడు తన కుడిచేతితో తాకటానికి, పట్టుకోవటానికి భయపడు తున్నాడు! తెగిన చేయి వేరెవరిదో కాదు.తనదే! అయినా దానిని చూస్తే భయం! అన్ని అంగాలూ ఆయా స్థానాల్లో , సజీవంగా ఉంటే తప్ప, అస్తవ్యస్తమైతే భీతిగొల్పుతాయి. జీవం లేని తన శరీరాంగాన్ని తానే చూడటానికి భయమైతే , తన వారి శవాలను చూసి ఎవరైనా భయపడటం ఆశ్చర్యం కాదు. అది సహజం. ఈ నిజాన్ని అందరూ జీర్ణించుకోవలసినదే.

“సత్యహరిశ్చంద్ర” నాటకంలో బలిజే పల్లివారు -

“మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునన్ నా యిల్లాలని నా కుమారుడని ప్రాణంబుండు నందాక నెం తో యల్లాడిన యీ శరీర మిపుడిందున్ గట్టెలన్ గాలుచో నా యిల్లాలును రాదు పుత్రుడును తోడై రాడు తప్పింపగన్” - అని జీవిత సత్యాన్ని ఆవిష్కరించారు.

నిజమే, ప్రాణం ఉన్నంత వరకూ ఈ బంగారు సంకెళ్ళలో చిక్కుకొని - భార్య, బిడ్డలు, బంధువుల తోడిదే లోకంగా జీవిస్తాం. ప్రాణం పోగానే మనం ఎవరికీ ఏమీకాము - వారు మనకేమీ కారు అనే పదునైన సత్యం మనకు తెలుసు. కానీ దాన్ని స్వాగతించి , తదనుగుణంగా జీవనగమనాన్ని దిద్దకోవటానికి సంసిద్ధులం కాలేము. ఇదే జీవుల దైన్యం!

“ధనాని భూమౌ పశవశ్చ గోష్ఠే

నారీ గృహద్వారి జనః శ్మశానే

దేహశ్చితాయాం పరలోకమార్గే

ధర్మానుగో గచ్ఛతి జీవ ఏకః”

ఒక మనిషి మరణించగా అతడు సంపాదించిన ధనం భూలోకంలోనే ఉండిపోతుంది. అతని పశుసంపద పశుశాలలోనే ఉంటుంది, అతని భార్య తన యింటి గడప వరకూ మాత్రమే వస్తుంది, చివరకు అతని దేహం కూడా చితిలోనే దహింపబడుతుంది. ఇవన్నీ ఎక్కడి వక్కడే ఆగిపోగా ఆ మనిషి చేసిన ధర్మమే అతనిని అనుసరిస్తుంది.

03/01/2018

భజ గోవిందమ్ ! భజ గోవిందమ్ !

5. యావద్విత్తోపార్జనసక్తః

తావన్నిజపరివారో రక్తః

పశ్చాజ్జీవతి జర్జరదేహే,

వార్తాం కోపిన పృచ్ఛతి గేహే.

భావం : ఎంత వరకూ తాను ధనాన్ని సంపాదిస్తూ ఉంటాడో, అంత వరకూ ఒక వ్యక్తియందు అతని బంధువులు, స్నేహితులు , ఇతరపరివారం అనురక్తిని చూపుతూ ఉంటారు. వయస్సు ఉడిగి , శరీరబలం కోల్పోయి అతడు ధనం సంపాదించలేని వాడైతే , ఇంట్లో అతనినిగూర్చి పట్టించు కొనే వాళ్ళు ఎవ్వరూ ఉండరు.

ఇది ఒక కఠోర జీవిత సత్యం.సంపాదనపరుడికే సంసారంలో సముచిత గౌరవం, సంపాదనలేని వాడిపట్ల వైముఖ్యం ! ఇది లోకంలో మానవనైజం. కుటుంబంలో అందరి అవసరాలూ కాదనకుండా తీర్చటానికి ఆ ఇంటి యజమాని శక్తికి మించి పని చేస్తాడు.తన ఆరోగ్యాన్ని గురించి కూడా పట్టించుకోడు. తనవారు ఆనందంగా ఉంటే చాలుననే భావోద్వేగం అతనికి శ్రమను తెలియనీయదు. గారాలు పోతూ సంతానం, ప్రణయ కోపాలతో కళత్రం తమ కోరికలను అతని సంపాదన ద్వారా తీర్చుకుంటారు. అదే అతనికానందం. కుటుంబ యజమానిగా తన వారిని పోషించుకోవటం అతని కర్తవ్యం.

సంపాదన లేని పురుషుణ్ణి కొందరు చుల్కనగా చూడటం మన నిజ జీవితాల్లో తరచూ తటస్థిస్తున్నదే . రెక్కలు ముక్కలు చేసికొని సంపాదించి, తనవారికి పెట్టిన వ్యక్తి - శరీరశక్తి సన్నగిల్లి, సంపాదించలేని వాడైనప్పుడు అతని పట్ల ఎవరూ శ్రద్ధ వహించరు సరికదా, అతనిని ఈసడించుకోవటం ప్రారంభిస్తారు. ఆ వ్యక్తి ఆరోగ్యం చెడి మంచాన పడితే “ఎలా ఉన్నా?”వని అడిగేవారుండరు. “సమస్త మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలే” అనే సత్యాన్ని మనం విశ్వసించక తప్పదు.ధనం అంతగాఈ ప్రపంచాన్ని శాసిస్తోంది.

ధనవంతుడెంతటి గౌరవాన్ని పొందగలడో భర్తృహరి -

“యస్యాస్తి విత్తం సనరః

స పండితః సశ్శ్రు తవాన్ గుణజ్ఞః.

స ఏవ వక్తా స చదర్శనీయః

సర్వే గుణాః కాంచన మాశ్రయంతి” - అనే శ్లోకంలో వివరించాడు.

ఎవడు ధనవంతుడో వాడినే - ఈ లోకం గొప్ప కులంలో జన్మించిన వాడంటుంది! వాడే పండితుడంటుంది! వాడే ఎన్నో గొప్ప విద్యలు నేర్చిన వాడంటుంది! వాడే సద్గుణవంతుడంటుంది! వాడే మాటకారి అంటుంది! వాడే అందగాడంటుంది! “డబ్బుంటే సుబ్బి - సుబ్బలక్ష్మి” అవుతుంది!

కుటుంబంలో యజమాని పదవీ విరమణ చేసి ఇంటిలో ఉంటే - అతని పట్ల కుటుంబ సభ్యులకు మునుపటి శ్రద్ధ సన్నగిల్లుతుంది. ఇది అన్ని కుటుంబాలకూ వర్తించక పోవచ్చు.ఎక్కువ శాతం కుటుంబాల్లో ఇలాగే జరుగుతుంది. తండ్రి గారి తరువాత అతని కూతురో, కొడుకో సంపాదన పరులైతే , ఇక అందరి ప్రత్యేక శ్రద్ధ అటు మళ్ళుతుంది! “వాళ్ళు ఆఫీసుకు వెళ్ళాలి, వాళ్ళ పని చూడాలి ముందు” అని మిగిలినవారిని ప్రక్కన పెట్టటం, చివరకు భోజన విషయంలో కూడా - వివక్ష చూపి,వాళ్ళను ముఖ్యులుగా భావించి వడ్డించటం జరుగు తుంది. తల్లిదండ్రుల కష్టంతో పెరిగి, పెద్దవాళ్ళై, గృహస్థులై, సంపాదన పరులై - ముసలి వాళ్ళైన తల్లి దండ్రులను నిస్సంకోచంగా వృద్ధాశ్రమాలకు తరలిస్తున్న ప్రబుద్ధులు మన సమాజంలో కోకొల్లలుగా ఉన్నారు.

“పొడుపుమల పయి బంగరు మ్రుగ్గులుంచి

సంజ మబ్బుల కుంగరాల్ సంతరించి

పోవుచున్నావు, నీ వేమి పొందితోయి?

వెర్రి మిత్రుడ! లోకంపువిధము కనవొ?” అంటారు కృష్ణ శాస్త్రిగారు

“కృష్ణపక్షం” లో , “లోకము” అనే ఖండికలో. ఇది - అందరికీ అన్నీ సమకూర్చి, తాను పొందినదేమిటో తెలియక ,ఈ లోకంనుంచి నిష్క్రమించే వారికి కూడా అన్వయించవచ్చు.

రామాయణంలో సీతారాములు వనవాసానికి వెడుతున్న సందర్భంలో కౌసల్య సీతతో - "న

త్వయా నావమంతవ్యః పుత్త్రః ప్రవ్రాజితో మమ తవ దైవతమస్త్వేష నిర్ధనః సధనోపి వా"

(ధనవంతుడైనా, నిర్ధనుడైనా, అతడే నీకు దైవం. అడవులకు పంపబడుతున్న నా బిడ్డ, నీ వలన ఎప్పుడూఅవమానింపబడి,నొచ్చుకోకూడదు) అంటుంది.

ధనహీనులైన భర్తలను అవమానించే స్వభావం ఉన్నస్త్రీలు రామాయణ కాలం నాటికీ ఉన్నారు!ఐతే, సీతమ్మ తాను తన తల్లిదండ్రుల ద్వారా ఉత్తమ స్త్రీ ధర్మాలను తెలుసుకున్నదానినని, తన భర్తయైన శ్రీరాముణ్ణి ప్రాణాధికంగా చూసుకుంటాననీ చెప్పింది.

“నాయనా! లోకరీతి చాలా భయంకరమైనది. అది ధనానికే ప్రాధాన్యమిస్తుంది.నువ్వు సంపాదించినంతకాలమే అందరూ నీ వాళ్ళమని నీ చుట్టూ తిరుగుతారు, నువ్వు నిర్ధనుడవో, వయోభారంతో అశక్తుడవో అయినప్పుడు ఎవరూ నిన్ను పట్టించుకోరు. అన్ని వేళలా నిన్ను ఆదరించి , సంరక్షించేవాడు దైవమొక్కడే. అందువల్ల లోకవ్యవహారాల యందు విరక్తుడవై , గోవిందనామ స్మరణ చెయ్యి. భయంకర భవసాగరాన్ని తరించు”అని శంకరులు కృపామతియై లోకులకు ఈ శ్లోకం ద్వారా సందేశం ఇచ్చారు.

29/12/2017

భజ గోవిందమ్ ! భజ గోవిందమ్ !

3. నారీస్తనభర నాభీదేశం,

దృష్వ్టా మాగా మోహావేశమ్

ఏతన్మాంస వసాదివికారం,

మనసి విచిన్తయ వారం వారమ్.

భావం : స్త్రీల స్తనభారమును,నాభీ ప్రదేశమును చూసి మోహావేశం పొందకు. అవి మాంసంతో, వస ( క్రొవ్వు) తో వికారంగా ఉంటాయనే విషయాన్ని మళ్ళీ మళ్ళీ మనస్సులో భావించుకో.

స్త్రీ సౌందర్యానికి ఆకర్షితుడైతే, మోక్ష సాధకుడు యోగభ్రష్టుడౌతాడని,అందువల్ల మనో వికారానికి గురి కారాదని శంకరులు ఈ శ్లోకంలో హెచ్చరిస్తున్నారు.

కాంతా కనకాలు ఆధ్యాత్మిక రంగంలో ఏకాగ్రతను భగ్నం చేస్తాయనే మాట అనుభవంలో ఉన్నదే. “ఈనాడు చాలామంది పొద్దు పొడిస్తే కాంచన కాంక్ష, పొద్దు గ్రుంకితే కామినీ కాంక్షగా జీవిస్తున్నా”రని భగవాన్ సత్యసాయి బాబా చెప్పారు. స్త్రీ వ్యామోహంతో విశ్వామిత్రాది మహర్షుల తపోనిష్ఠలు పంచబంగాళమయ్యాయి.

“ధనుర్దాసు” అనే వస్తాదు, తన భార్యయైన “హేమాంబ” నేత్రసౌందర్యానికి లోబడి, ఆ కళ్ళకు ఎక్కడ సూర్య రశ్మి సోకుతుందో! ఆ నేత్ర సౌందర్యం ఎక్కడ వాడిపోతుందో! అని భయపడుతూ ఉండేవాడు. ఆమెతో కలిసి తెల్లవారకుండానే శ్రీరంగంలో కావేరీనదికి స్నానానికి వెళ్ళేటప్పుడు కూడా ఆమె కళ్ళమీద సూర్య కిరణం పడరాదని, ఆమెకు గొడుగు పట్టేవాడు! తనను చూసి ఎందరు పరిహసిస్తున్నా పట్టించుకునేవాడు కాదు. అతని ఏకాగ్రత అశాశ్వత సౌందర్యారాధనలో నిస్తేజమౌతోందని, దానిని శాశ్వత సౌందర్యారాధన వైపు మళ్ళిస్తే అతని జీవితం చరితార్థమౌతుందని భగవద్రామానుజులు భావించి ,అతనికి శ్రీరంగనాథస్వామివారి నేత్ర సౌందర్య దర్శన భాగ్యాన్ని ప్రసాదించారు. ఆ ఘట్టంతో ధనుర్దాసుకు నిత్యసౌందర్యం అంటే ఏమిటో అర్థమైంది. తదనంతర కాలంలో అతడు పరమ వైష్ణవుడయ్యాడు.

శరీరగతమైన అందం పరిణామశీలం కలది. ఒకప్పటి అందచందాలు, బిగువులు, విలాసాలు ఎప్పటికైనా వికృతాలవటం తథ్యం.అందుకే స్త్రీ బాహ్య సౌందర్యం పట్ల మోహావేశం తగదని శంకరులు హితవు చెప్తున్నారు. “యౌవనం తాలూకు అందాలన్నీ వార్ధక్యమనే అగ్నిలో దగ్ధమై బూడిదలా రాలుతున్నా” యన్నాడు ఒక సంస్కృత కవి.ఒక ముసలి అవ్వ వంగిన తన నడుమును పైకెత్త లేక భూమినే చూస్తూ నడుస్తోంది. ఒక ఆకతాయి ఆమె దగ్గరకు వెళ్ళి “అవ్వా! ఏమిటీ వెతుకుతున్నావు?” అంటే , “నాయనా ! నా యౌవనం అనే ముత్యం ఎక్కడో జారిపోయింది , దాన్ని వెతుకుతున్నాను” అందిట! ఇది ప్రాకృతిక సత్యం. దీనిని పదే పదే స్మరించుకుంటూ వ్యవహరించాలని భగవత్పాదుల సందేశం.

శ్రీ కాళ్ళకూరి నారాయణరావు రచించిన చింతామణి నాటకంలో “చింతామణి” పాత్ర అందరికీ సుపరిచితం. ఆమె అందాన్ని వలగా వేసి, ఆమె తల్లి “శ్రీహరి” ఎందరో ధనవంతులను, ప్రాజ్ఞులను ఆకర్షించింది. అందరూ ఆమె అందానికి దాసానుదాసులయ్యారు. తమ ఆస్తులను అమ్ముకొని ఆమెకిచ్చి తాము నిర్ధనులయ్యారు. వారి భార్యలు ఎంతో క్షోభించారు.కథాంతంలో అంతటి సౌందర్యరాశీ, దేహసౌందర్యం పట్ల, తన వేశ్యావృత్తి పట్ల విరక్తయై -

“చమురు జిడ్డు మొగంబు చంద్రబింబంబంచు

పుసి కన్నులను దమ్మి పూవులనుచు

జీమిడి ముక్కు విచ్చిన నూవుఁ బూవంచు

వాలు చూపులు విరికోలలనుచు

చొల్లు పెదవి తేనె జొబ్బిలు గనియంచు

పాల తిత్తులు పూలబంతులనుచు

కంపుతొడ లనంటి కంబంబులంచును

చీడ పాదంబులు చివురు లనుచు

రక్త మాంస పురీష మూత్రముల పాత్ర

మేలిమి పసిండి బొమ్మంచు , మెరుపటంచు

నజ్ఞులగువారు మోహాంధు లగుచు దలతు

రంతియేగాక సౌందర్య మనగఁ గలదె?”

(చమురు పట్టి జిడ్డోడే ముఖాన్ని చంద్రబింబమనీ,పుసులు కట్టిన కళ్ళను తామరపువ్వులనీ, చీమిడి కారే ముక్కును నువ్వు పువ్వనీ,వాలు చూపుల్ని పూలబాణాలనీ,చొల్లుకారే పెదిమలను తేనెలూరే గనులనీ, పాల తిత్తులను (స్తనాలను) పూలచెండ్లనీ, కంపుకొట్టే తొడలను అరటి స్తంభాలనీ, చీడపట్టిన పాదాలను మెత్తని చిగుళ్ళనీ, రక్త మాంస మూత్రాదులతో నిండిన పాత్ర లాంటి దేహాన్ని బంగారు బొమ్మ అనీ - మోహంతో కళ్ళు మూసుకు పోయిన వాళ్ళు భావిస్తారే గానీ - శాశ్వత మైన అందమంటూ అసలెక్కడిది?) అంటుంది తన ప్రియుడైన బిల్వమంగళునితో.

ఒకప్పుడు వేశ్యలోలుడై యధేచ్ఛగా తిరుగుతున్న వేమనకు ఆయన వదిన గారు ఒక సందర్భంలో నగ్నంగా కనిపించిన సన్నివేశంతో ఆయనకు జ్ఞానోదయం అయింది. అంతవరకూ తాను తుచ్ఛ శారీరక సౌఖ్యాల కోసం వెంపరలాడాడని గ్రహించాడు. మోహాన్ని వదలి యోగి వేమన అయ్యాడు.

[భజ గోవిందమ్ ! భజ గోవిందమ్ !

4. నళినీదళగత జలమతి తరళం

తద్వజ్జీవిత మతిశయ చపలమ్

విద్ధి వ్యాధ్యభిమాన గ్రస్తం

లోకం శోకహతం చ సమస్తమ్.

భావం : తామరాకు మీది జలబిందువు చంచలమైనది. అలాగే జీవితం కూడా మరింత చంచలమైనది. లోకమంతా వ్యాధులతో,దురభిమానంతో మ్రింగబడుతోంది.దుఃఖంతో ఆక్రమింపబడి ఉంది.

జీవితం అశాశ్వతం, అది ఎప్పుడైనా నశించిపోయేదే. లోకమంతా రోగాలతో, దురభిమానాలతో నిండి ఉంది, సర్వత్రా దుఃఖమే వ్యాపించి ఉంది - అని భగవత్పాదులు జీవితాన్ని, లోకాన్ని విశ్లేషిస్తున్నారు.

“నీటిబొట్టు, తామరాకు” అనే పదాలద్వారా భగవత్పాదులు జీవుల జన్మయాత్రను గూర్చి ప్రస్తావించారు. సరస్సు - పరమాత్మ! తామరాకు - సృష్టి! నీటిబొట్టు - జీవుడు! పరమాత్మ నుండి సృష్టిలోకి జీవుని ప్రవేశం సంభవిస్తుంది. “బిందువు” సరస్సులోనిదే - కానీ అది భిన్నమనిపిస్తుంది!
ఇది “పరమాత్మ,జీవాత్మ వేరు” అనుకోవటం వంటిది! నిజానికి రెండూ ఒకటే అనే అద్వైత తత్త్వం ఇక్కడ కనిపిస్తుంది.

మాయా ప్రభావంతో జీవి తాను పరమేశ్వరుడినే అనే విషయాన్ని విస్మరిస్తాడు. నీటి బిందువు మళ్ళీ సరస్సులో చేరుతుంది. జీవి పరమాత్మను చేరుతుంది.

జీవియొక్క జీవితం చాలా చంచలమైనది. అందువల్ల దాన్ని సద్వినియోగం చేసుకోవాలని హితవు చెప్తున్నారు.

మరొక విధంగా ఆలోచిస్తే ,తామరాకుమీది నీటిబొట్టు - సూర్యకాంతితో తళతళ మెరిసిపోతూ, అది ఒక విలువైన మంచిముత్యమనిపిస్తుంది! తన అందానికి తానే మురిసిపోతూ అజ్ఞానంతో అహంకరిస్తుంది. సూర్యతేజం మరింత పెరిగితే , ఆ వేడికి అది వెంటనే ఆవిరై రూపుమాసిపోతుంది!

దీనిని మానవ జీవితానికి చక్కగా అన్వయించవచ్చు. మానవుడు కూడా తాను ధనవంతుడిననో, అందగాడిననో , పెద్ద అధికారిననో, గొప్ప విద్వాంసుడిననో - అనేక కారణాలతో అహంకరిస్తూ ఉంటాడు. కానీ, ఇవన్నీ అశాశ్వతాలని గ్రహించడు. సర్వమూ దైవాధీనమనే సత్యాన్ని మరచి విఱ్ఱవీగి, అంతా తన గొప్పతనమే అనుకొని, ఒక దశలో తప్పకుండా పశ్చాత్తప్తుడౌతాడు.

“జంతూనాం నరజన్మ దుర్లభమ్” అన్నారు కదా! ఇక్కడ జీవితం యొక్క ఉత్కృష్టతను, అల్పకాలికతను కూడా స్ఫురింపజేసి ధర్మాచరణకు ప్రోత్సహిస్తున్నారు శంకరులు.

“క్షణం చిత్తం, క్షణం విత్తం క్షణం జీవిత మావయోః

యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితా గతిః”

మన మనస్సులోని సంకల్పాలు క్షణక్షణానికి మారిపోతూ ఉంటాయి, ధనమా - అది మరింత చంచలమైనది! ఆయుర్దాయం ముగిసిపోతోంది! యముడు నిర్దయుడు! ఆయుష్షును పెంచడు!అందుకే చేయదలచిన, చేయవలసిన ధర్మాన్ని త్వరగా ఆచరించాలి - అనే ఆత్మీయమైన సూచన ఈ శ్లోకంలో ఉంది.

లోకమంతా వ్యాధులతో, దురభిమానాలతో, విచారంతో నిండి తల్లడిల్లుతోందనే మాట కూడా శంకరులు ఈ శ్లోకంలో చెప్పారు. వ్యాధులు రావటానికి కారణం కొంత మన స్వయంకృతాపరాధం కాగా, గత జన్మలలో చేసిన పాపం కొంత.(“పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే”)

వీటిలో శారీరక వ్యాధులు కొన్ని, అజ్ఞానాహంకార జనితాతైన రోగాలు కొన్ని. అసలు సంసారమే ఒక వ్యాధి. అందుకే దానిని “భవరోగం” అంటారు.వ్యాధి ఎలా సంక్రమించినా ,అది మనోవైకల్యాన్ని కలిగిస్తుంది. అనారోగ్యం దైవసాధనపై దృష్టిని కేంద్రీకరించనీయదు. యుక్తాహార విహారాలతో వ్యాధులను అదుపులో ఉంచుకోవచ్చు.

కానీ జిహ్వా చాపల్యంతో తినరానివి తినటం, త్రాగరానివి త్రాగటంతో వ్యాధులు ప్రబలుతున్నాయి. సాధకుడు మితాహారం తీసుకోవాలి. భగవత్పాదులు సాధన పంచకంలో “క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం” అన్నారు.ఆకలి అనే రోగానికి భిక్షాన్నమనే ఔషధంతో చికిత్స చేసుకోవాలట!

“రోజులో ఒకసారి తిన్నవాడు యోగి, రెండుసార్లు తింటే భోగి, మూడుసార్లు తింటే రోగి” అనే అనుభవ వాక్యం ప్రచారంలో ఉంది.

దురభిమానాన్నే గర్వం, అహంకారం అనికూడా అంటారు. ఇది వ్యక్తిత్వానికి చేటు తెస్తుంది. అందరి కంటే నేను అధికుడను అనుకోవటంతో ఆగక, మిగిలినవారు అల్పులు అనుకోవటం ఆ గర్వానికి పరాకాష్ఠ! గర్వం జ్ఞానాన్ని మరుగున పడవేస్తుంది. కన్ను, మిన్ను కానని అహంకారం ఏదో ఒక క్షణంలో భారీ మూల్యమే చెల్లించుకుంటుంది!

ఇక , లోకంలో శోకం సర్వత్రా వ్యాపించి ఉంది.అసలు మానవులు ఏడుస్తూనే జన్మిస్తారు. ఆ తరువాత, అజ్ఞానం, అత్యాశలతో అనుక్షణం శోకిస్తూనే ఉంటారు. తాము చిదానంద స్వరూపులమనే ఎరుక వారికి ఉండదు.

“ఏడ్చుచుండు అనునిత్యము నరుడు, నవ్వెడివాడే నారాయణుడు” అన్నారు సత్యసాయిబాబా.
శోకింప కూడని తావులలో శోకించకూడదని భగవద్గీతా సందేశం.

“నాయనా! ఈ జీవితం అశాశ్వతం, నువ్వు జీవిస్తున్న ఈ లోకం వ్యాధులతో, అహంకారంతో, అంతులేని శోకంతో నిండి ఉంది.అందువల్ల అప్రమత్తుడవై ఉండు. గోవిందుణ్ణి సేవించు.సంసార సాగరాన్ని తరించు” అని పరమదయా స్వరూపులైన శంకరులు ఈ శ్లోకంలో ప్రవచించారు.

Address

Shankara Matam, Brahmin Street, Ponnur-
Guntur
522124

Website

Alerts

Be the first to know and let us send you an email when Brahmana Maha Sabha - Ponnur - 189/79 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share