భూతల స్వర్గం... దేవరచర్ల
-మల్లన్న దర్శనం సాహసోపేతం
-ఆద్యంతం కనువిందుచేసే కృష్ణమ్మ పరవళ్లు
-ఉల్లాసాన్ని నింపే ఘాట్రోడ్డు ప్రయాణం
-మధురానుభూతులను మిగిల్చే బోటు ప్రయాణం
-మనస్సుకు హత్తుకుపోయే గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు
-ఈ ప్రాంతంలో వెలుగులోకిరాని దర్శనీయ ప్రదేశాలెన్నో!
-పర్యాటకంగా అభివృద్దిపర్చేందుకు ఈ ప్రాంతంపై దృష్టిసారించిన పురావస్తు, పర్యాటకశాఖలు
గోవా.. ఊటీని తలదన్నే ప్రకృతి అందాలు.. పచ్చని
అందాల నడుమ కృష్ణమ్మ సొగసులు... ఆధ్యాత్మికతను ప్రతిబింబించే శివాలయం.. ఆధునిక సదుపాయాలేవీ లేకపోయినా ఆనందం తాండవించే గిరిజన తండాలు... వీటన్నింటినీ కలగలుపుకున్న దేవరచర్ల... ఎన్నో అనుభూతులను మిగుల్చుతోంది. ఆకట్టుకునే పరిసరాలు, సహజమైన అందాలతో పర్యాటకానికి అవసరమైన అన్ని హంగులనూ సొంతం చేసుకుంది ఈ ప్రాంతం. ప్రపంచంలో పర్యాటక కేంద్రాలంటే పెద్ద నగరాలే... అనుకునేవారు ఇక్కడికి ఓసారి రావాల్సిందే. పచ్చని పైరు, చక్కని సెలయేరు. ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే చల్లటి గాలులతో ఈ ప్రదేశంపర్యాటక కేంద్రానికి తీసిపోని రీతిలో అలరిస్తోంది. దీనిపై ఇప్పటికే దృష్టిసారించిన పురావస్తు, పర్యాటకశాఖ పర్యాటక రంగంగా అభివృద్ధి పర్చే దిశగా ప్రణాళిక లను రూపొందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి పర్యాటక కేంద్రంగా ఈ ప్రాంతానికి గుర్తింపు లభిస్తే దేవరచర్ల పర్యాటకులకు భూతల స్వర్గమే అవుతుంది.
రోజువారీ దినచర్యలను గుర్తుచేస్తూ పొద్దున్నే నిద్రలేపే అలారం. హడావుడిగా సగం కాలీ, కాలని బ్రెడ్ ఆమ్లెట్తో అల్పాహారం.. దుమ్మూ, ధూళీ మధ్య ట్రాఫిక్ సిగ్నళ్లను తిట్టుకుంటూ ప్రయాణం... నగరాల్లో చాలామంది జీవితం దాదాపు ఇలానే ఉంటుంది. ఎప్పుడో ఏడాదిలో ఓ వారం రోజులు ఏ గోవాకో వెళ్లిరావాలి, మళ్లీ రొటీన్లో పడిపోవాలి అనుకుంటూ గడిపేస్తారు.
కానీ, కోడికూతతో మేల్కొలుపు. కట్టెల పొయ్యిపై కాల్చిన జొన్నరొట్టెలు ఘుమఘుమలు... కళ్లాపితో నిండుగా అలికిన ముంగిళ్లూ... ఇలాంటి ఆనందాలను ఆస్వాదించాలని లేదా అనడిగితే ఎందుకు లేదు, కానీ.. అంటూ ఆపేస్తారు. ఆ కానీకి ఎన్నో కారణాలు. ఈ పరిస్థితుల్లోనే.. వాటన్నింటికీ పరిష్కారం చూపిస్తోంది అందమైన చందంపేట. ఈ ప్రాంతంలో అనాదిగా సాగుతున్న ఆడపిల్లల అమ్మకాలు, భ్రూణహత్యలు నాణేనికి ఓవైపు అయితే సహజసిద్ధంగా ఏర్పడ్డ ప్రకృతి అందాలు.. కనువిందుచేసే కృష్ణమ్మ సొగసులు నాణేనికి మరోవైపు కన్పిస్తాయి. ప్రకృతిలోని ఎన్నో అందాలను తమలో నింపుకున్న పల్లెలు, వింతైన ఆచారాలతో నిండిన గిరిజన ఆవాసాలెన్నో ఇక్కడ కనువిందుచేస్తాయి. అందులో చెప్పుకోదగ్గ పర్యాటక ప్రదేశం దేవరచర్ల. మునిస్వామి గుట్టలపై కొలువుదీరిన మల్లన్న ఆధ్యాత్మిక చింతన కల్గిస్తుండగా.. భూతల స్వర్గాన్ని తలపించే ప్రకృతి అందాలెన్నో పర్యాటకులను ఆనందతాండవం చేయిస్తాయి. దేవరచర్లను సందర్శించుకునేందుకు వచ్చేవారికి చుట్టుపక్కల చూడదగ్గ ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. ఘాట్ రోడ్డుపై ప్రయాణం... దేవరచర్లకు చెంతనే వైజాగ్ను తలపించే తీర ప్రాంతాలు.. సాగర్ జలాలపై బోటు షికారుతో ఉల్లాసాన్ని కల్గించే వాతావరణం ఇక్కడ కన్పిస్తుంది.
మహిమాన్వితం దేవరచర్ల...
దేవరచర్ల... దేవరకొండ నియోజకవర్గ కేంద్రానికి 40కి.మీ.ల దూరంలో ఉన్న ఓ మారుమూల ఆవాసం. చందంపేట మండలం ఎల్మలమంద పంచాయతీ పరిధిలో ఉన్న ఓ కుగ్రామం ఇది. ఇక్కడి మునిస్వామి గుట్టలపై ఉన్న కొలువుదీరిన పరమశివుడిని దర్శించుకునేందుకు 5కి.మీ.లు కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. నడిచేందుకు సైతం వీలులేకుండా రాళ్లురప్పలతో ఉన్న మార్గం మీదుగా నకడ సాగించడం సాహసోపేతమే అవుతుంది.
కంబాలపల్లికి వెళ్లే దారిలోను, చిత్రియాలకు వెళ్లే దారిలోనూ దేవరచర్లకు వెళ్లవచ్చు. దేవరచర్ల నుంచి మునిస్వామి గుట్ట వరకు కిలోమీటర్ మేర పొలం గట్లవెంట నడక సాగించాల్సి ఉంటుంది. రాళ్లుతేలిన దారి గుండా ప్రయాణం సాగించాక.. దట్టమైన అటవీప్రాంతం గుండా ప్రయాణం సాగించాల్సి ఉంటుంది. ఆలయం సమీపంలోకి రాగానే అల్లనేరెడు చెట్టు దర్శనమిస్తుంది. ఇక్కడి నుంచి చూస్తే బహుబలి సినిమాలోని వాటర్ఫాల్స్కు సంబంధించిన ఎన్నో సుందర దృశ్యాలు గుర్తుకువస్తాయి. గుట్టను తొలిచి ప్రతిష్ఠించిన శివలింగం ఇక్కడ దర్శనమిస్తుంది. ఎక్కడాలేని రీతిలో గుడి ముందు 18స్తంభాలతో నిర్మించిన అపురూప మండపం కన్పిస్తుంది. రెండు ద్వారాలపై పూర్ణకుంభం చిహ్నాలు చెక్కబడి ఉంటాయి. సూర్యకిరణాలు సైతం దూరని దట్టంగా చెట్లు కమ్ముకోవడంతో దేవాలయ ప్రాంగణం అంతా చీకటిగానే ఉంటుంది. అనుక్షణం గంగమ్మ శివలింగాన్ని అభిషేకించే దృశ్యం మనకు సాక్షాత్కరిస్తుంది. శివాలయాన్ని ఆనుకుని ఉన్న గుట్ట, చెట్టులు పెనవేసుకుపోయి ఏనుగు ఆకారంలో దర్శనమిచ్చే దృశ్యం ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
దేవరకొండ ఖిల్లాను ఏలిన రేచర్ల పద్మనాయక వంశీయులు 14వ శతాబ్ధకాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి. ఒకప్పుడు ఈ ప్రాంతానికి ఎలుకలింగయ్యపాడు అనే పేరు కూడా ఉంది. ఎలుక అంటే వినాయకుని వాహనమని, లింగయ్య అంటే శివుడు అని వినాయకుడు, శివుడు నివాసమున్న ప్రాంతంగా దీనికి ఆపేరు వచ్చినట్లు స్థానికులు చెబుతారు. ఇక్కడి దేవాలయంలో విష్ణు, నంది, వలి సుబ్రహ్మణ్యం, భైరవ వంటి ఎన్నో దేవతామూర్తుల ప్రతిమలు ఉండడంతో కాలక్రమంగా ఈ ప్రాంతానికి దేవరచర్ల పేరు వచ్చిందని ఇక్కడి గిరిజనులు చెబుతారు. తపస్సు చేసుకునేందుకు ఈ ప్రాంతానికి వచ్చే మునులు ఆతర్వాత ఎవరికీ కన్పించకుండా మాయమై పోతారన్న ప్రచారం కూడా ఉంది. ఇక్కడి శివలింగానికి స్థానిక గిరిజనులే పూజారులుగా వ్యవహరిస్తున్నారు. ఏకాదశి, శివరాత్రి వంటి పర్వదినాల్లోనే దేవాలయాన్ని స్థానిక గిరిజనులు శివుడిని దర్శించుకుంటుండగా.. మారుమూల ప్రాంతంలో ఈ దేవాలయం ఉండడం వల్ల ఎంతో ప్రాశస్త్యమున్న ఈ దేవాలయం చరిత్ర బాహ్య ప్రపంచానికి తెలియకుండా పోయింది.
స్థానికులే గైడ్లు...
ప్రకృతిలోని ఎన్నో అందాలను, వింతైన ఆచారాలతో నిండిన గిరిజన తండాలెన్నో దేవరచర్లకు వెళ్లే దారిలో సాగర్ లోతట్టు ప్రాంతంలో తటస్థపడతాయి. దుమ్ము, ధూళి మధ్య ట్రాఫిక్ సిగ్నళ్లను తిట్టుకుంటూ బిజీ లైఫ్ను గడిపే ఎన్నో జీవితాలకు ఇక్కడి ఆవాసాలు ఊరటకల్పిస్తాయి. కొండలు, కోనల్లో సహజ సిద్ధ వాతావరణంలో ఉండే తండాలకు వెళ్లిన వారిని గిరిజనుల అనురాగాలు, అప్యాయతలు మధురానుభూతిని మిగుల్చుతాయి. తండాల్లో పూరిగుడిసెలతో నిర్మించే ఇంటి నిర్మాణ శైలి ప్రత్యేకంగా ఉంటే, గిరిజనులు అప్యాయంగా వండివాడ్చే వంటకాలు అద్భుతంగా ఉంటాయి. దేవరచర్ల సందర్శనార్థం వచ్చేవారికి, ఏదైనా సర్వే కోసమో, ఇక వేరే ఇతర పనుల నిమిత్తమో ఇక్కడకు వచ్చే అధికారులకు, ఇతరులెవ్వరికైనా ఇక్కడి గిరిజనులే అతిథ్యాన్ని ఇస్తారు.
ఇక్కడి విశేషాలు తెలిపేందుకు తండాల్లో పుట్టిపెరిగిన వాళ్లే గైడ్లుగా వ్యవహరిస్తారు. ఇక గిరిజన మహిళల కట్టూ, బొట్టూ, పద్ధతులు, అలవాట్లూ... అన్నీ అద్భుతమే. గిరిజనులు ధరించే ఆభరణాలు, దుస్తులు వారి సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపడతాయి. ప్రతి యేటా ఆషాఢ, శ్రావణమాసాల్లో తొమ్మిది రోజులపాటు తండాల్లో నిర్వహించే తీజ్ పండగను గిరిజనులు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించి తమ సంప్రదాయాలను బతికిచ్చుకుంటున్నారు. దేవరచర్ల, వైజాగ్కాలనీలకు కూతవేటు దూరంలో ఉన్న తుల్చాభవాని దేవాలయం కూడా సందర్శించదగ్గ ప్రదేశమే. గిరిజనుల ఆరాధ్యదైవమైన తుల్చాభవాని జాతర ప్రతి యేటా దసరాకు ఒకరోజు ముందు మొదలవుతుంది. గిరిజనుల అతిపెద్ద జాతర ఇది. రెండు రోజులపాటు సాగే జాతరలో అమ్మవారిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని నలుమూలల భక్తులు ఇక్కడకు తరలివస్తారు. మహారాష్ట్రలోని తుల్చాభవాని దేవాలయాన్ని సందర్శించుకునేందుకు వీలుపడని వారు ఇక్కడకు వచ్చి మొక్కులు తీర్చుకుని పరవశులవుతారు. ఈ జాతర సమయంలోనే వర్షాలు సమృద్ధిగా కురియడంతో సాగర్ వెనుక జలాలు ఈ దేవాలయాన్ని తాకుతాయి. దేవాలయం పక్కనే ఏర్పాటుచేసిన వీర శివాజీ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
మర్చిపోలేని అనుభూతి... ఘాట్రోడ్డు ప్రయాణం...
దేవరచర్లతోపాటు ఇతర ప్రాంతాల సందర్శనకు వెళ్లే సందర్భంలో అటవీ ప్రాంతంలోని ఘాట్రోడ్డుపై దుందుబీ నది వెంట సాగే ప్రయాణం ఎంతో ఉల్లాసంగా సాగుతుంది. రాజీవ్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు పరిధిలో ఉన్న ఈ ప్రాంతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వచ్చింది. తిమ్మాపురం పంచాయతీ పరిధిలోని పెద్దరాజుబాయి వద్దకు వెళ్లేసరికి ప్రారంభమయ్యే ఘాట్రోడ్డు చిత్రియాల ప్రాంతంలోని ఎల్లమ్మగట్టు వరకు 3కి.మీ.ల మేర సాగుతుంది. కాకునూటితండా నుంచి రేకులగడ్డ వరకు 4కి.మీ.ల మేర ఉండే ఘాట్రోడ్డు, బుగ్గతండా నుంచి సుద్దబాయితండావరకు 4కి.మీ.ల ఘాట్రోడ్డు, ఉస్మాన్కుంట నుంచి చౌటుట్ల మీదుగా రేకులగడ్డ వరకు 6కి.మీ.లు సాగే ఘాట్రోడ్డు, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి కంబాలపల్లి మీదుగా పొగిళ్ల వరకు 12కి.మీ.ల ఘాట్రోడ్డు ప్రయాణం మరిచిపోలేని మధురానుభూతిని మిగుల్చుతుంది.
....................................................................................................................................................................దేవరచర్ల.. ఓ అద్భుత ప్రదేశం!
ఆకుపచ్చని చీర కట్టిన మనోహరపు కొండలు..! కొండల నడుమ జాలువారే జలపాతం..! శివలింగాన్ని నిత్యం అభిషేకించే జలధారలు..! బాహుబలి చిత్రంలో రాజమౌళి సృష్టించినగ్రాఫికల్ ప్రపంచం కాదు..! మనసు పరవశించే.. శరీరం తన్మయత్వానికి లోనయ్యే ఈ అద్భుతం మన తెలంగాణలోనే ఉంది..! లింగమయ్య-గంగాదేవీ అపూరూప సంగమమైన ఈ అద్భుత ప్రదేశం దేవరచర్ల.జటాఝూటంలో గంగను బంధించిన లింగమయ్య… పాల వెన్నెల జలధారల్లో జలకమాడే అద్భుతం..! పరవళ్లు తొక్కుతూ కొండలు, కోనల నడుమ ఉరకలెత్తిన ఆకాశగంగ… పరమశివుడ్ని అభిషేకించే అపురూప దృశ్యం..! పచ్చటి కొండలు… దట్టమైన అడవులు…! గల గల జలధారల సవ్వడి..! నల్లగొండ జిల్లా చందంపేట మండలం దేవరచర్లలో ఈ ప్రకృతి సోయగాలు మనల్ని మరో లోకంలోకి తీసుకెళుతాయి…!శివుడ్ని అభిషేకించే జలపాతం బాహుబలి చిత్రంలో రాజమౌళి క్రియేటివ్ విజన్..! గ్రాఫిక్స్ తో సిల్వర్ స్క్రీన్ పై చేసిన రాజమౌళి మ్యాజిక్ ప్రకృతిలో నిజంగానే ఉంది..! ఆశ్చర్యం… అద్భుతం.. దేవరచర్లలో మునిస్వామి గుట్టలు..! దేవరకొండ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుగ్రామం దేవరచర్ల. ఇక్కడ్నుంచి 5కిలోమీటర్ల నడక ద్వారా మునిస్వామిగుట్టకు చేరుకోవచ్చు.మునిస్వామి గుట్టలో కొండల పై నుంచి జలపాతం జాలువారే చోటే శివలింగం కొలువై ఉంది. ఇదే ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ వందల ఏళ్ల నాటి పురాతన ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం పక్కనే ఓ సొరంగ మార్గం కూడా ఉండటం విశేషం. అయితే ఈ నిర్మాణాలు ఎప్పటివో ఎవరికీ తెలియదు. ఇక్కడ ఉండే గిరిజనులు మాత్రం తమ తాత ముత్తాతల కాలం నుంచి ఈ శివాలయం, జలపాతం ఉన్నాయని చెబుతున్నారు.ప్రతి ఏటా శివరాత్రి, ఏకాదశి పర్వదినాల్లో మునిస్వామి గుట్టల్లో ఇక్కడి గిరిజనులుగోపా బావోజీ పూజలు నిర్వహిస్తారు. ఈ జాతరకు గుట్టపైకి వందల సంఖ్యలో భక్తులు వచ్చి పూజలు నిర్వహిస్తారు. మిగతా సందర్భాల్లో మునిస్వామి గుట్టలకు ఎవరూ రారు. నిర్మానుష్యంగా ఉంటుంది. ఈ ఆలయానికి అపవిత్రంగా వెళ్తే అక్కడి కందిరీగలు, గబ్బిలాలు హాని చేస్తాయని ఇక్కడి గిరిజనులు విశ్వసిస్తారు.దేవరకొండ ఖిల్లా దుర్గాన్ని 13వ శతాబ్దంలో రేచర్ల పద్మనాయక వంశానికి చెందిన రాజులు పాలించారు. ఇక్కడి శివాలయంలో చెక్కిన పద్మాలను బట్టి ఈ నిర్మాణాలు పద్మనాయక కాలం నాటివని తెలుస్తోంది. అయితే, కాలక్రమేణా ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. చెట్లు విరిగిపడటంతో ఆలయం కొంతమేర కూలిపోయింది.శివలింగాన్ని జలధారలు అభిషేకించే దృశ్యం ఎంతో రమణీయంగా ఉంటుంది. గుట్టల నుంచి జాలువారుతున్న నీటి పరవళ్లు ఎప్పుడూ లింగాన్ని అభిషేకిస్తూనే ఉంటాయి. మునిస్వామిఆలయాన్ని గుట్ట కింది భాగంలో నిర్మించారు. ముందు స్తంభాలను మాత్రమే నిలబెట్టి వెనుక భాగంలో కొండనే తొలిచి ఆలయంగా మలిచారు. నిర్మాణంలో వాడిన చతురస్రాకార ఇటుకలు కేవలం 200 నుంచి 300 గ్రాముల బరువు మాత్రమే ఉండటం ఆశ్చర్యకరం.మునిస్వామి గుట్టల్లో శిథిలావస్థకు చేరిన మరొక ఆలయ ఆనవాళ్లు కూడా ఉన్నాయి. ఇక్కడశివలింగం చుట్టూ చిన్నసైజులో మరో 18 లింగాకారాలున్నాయి. ఆలయం పక్కనే ఒక గుహ లాంటి నిర్మాణం ఉంది. ఇక్కడి నుంచి శ్రీశైలం వరకు సొరంగ మార్గం ఉందని స్థానికులుచెబుతుంటారు.
_____ #కేతావత్_హరికృష్ణ