18/05/2026
పుస్తక పఠనం - ఇరవైఒకటవ భాగం
*********************************
20) త్రిత్వ సిద్ధాంతం, యేసు రెండు స్వభావాలు బైబిలులో “మర్మం” అనబడదు
“ఇది ఒక మర్మం… మనుష్య బుద్ధితో అర్థం చేసుకోలేం” — ఈ ఒక్క మాటతో ఎన్నో సిద్ధాంతాలు ప్రశ్నలకు అతీతంగా చేయబడ్డాయి. చరిత్రలో అనేకసార్లు, ప్రజలు అర్థంకాని లేదా పరస్పర విరుద్ధమైన బోధనలను పరిశీలించకుండా అంగీకరించేందుకు “మర్మం” అనే పదాన్ని ఒక కవచంలా ఉపయోగించారు. ఎవరైనా హేతుబద్ధమైన ప్రశ్నలు అడిగితే, వారిని విశ్వాసహీనులుగా లేదా దేవుని విషయాలను అర్థం చేసుకోలేని వారిగా చిత్రీకరించారు.
కానీ లేఖనం చెప్పే “ముస్తేరియన్” (μυστήριον) అనేది ఈరోజు భావించే విధంగా అర్థంకాని మిస్టరీ కాదు. అది దేవుడు ఒకప్పుడు రహస్యంగా ఉంచి, తరువాత తన ప్రజలకు వెల్లడించిన “పవిత్ర రహస్యం” అనే అర్థాన్ని ఇస్తుంది. దేవుని సత్యం శాశ్వతంగా అయోమయంలో ఉండటానికి కాదు — వెలుగులోకి రావటానికి. అందుకే లేఖనంలో “మర్మాలు” అని చెప్పబడిన విషయాలు తరువాత స్పష్టంగా వివరించబడ్డాయి.
అయితే త్రిత్వ సిద్ధాంతం మరియు “యేసు రెండు స్వభావాలు” వంటి బోధనలు మాత్రం లేఖనంలో ఎక్కడా “ముస్తేరియన్”గా చెప్పబడలేదు. పైగా అవి తరచుగా సాధారణ భాషలో అర్థంకాని, పరస్పర విరుద్ధమైన వాక్యాల రూపంలో బోధించబడుతున్నాయి:
* “ఒక దేవునిలో ముగ్గురు వ్యక్తులు”
* “యేసు 100% దేవుడు మరియు 100% మనిషి”
* “శాశ్వతంగా జన్మించిన కుమారుడు”
ఇవి దేవుని వాక్యంలో స్పష్టంగా చెప్పబడిన సత్యాల కంటే, ప్రశ్నించకుండా అంగీకరించమని ఒత్తిడి చేసే తాత్విక ప్రకటనలుగా కనిపిస్తాయి.
దేవుడు మనుష్యులను అంధ విశ్వాసానికి పిలవలేదు. ఆయన “సత్యాన్ని తెలిసికొందురు” అని చెప్పాడు. నిజమైన సత్యం పరిశీలనను భయపడదు; అది మరింత ప్రకాశిస్తుంది. ఈ అధ్యాయంలో “మర్మం” అనే పదం నిజంగా ఏమిటి? దాన్ని ఎలా తప్పుగా ఉపయోగించారు? త్రిత్వం మరియు ద్వంద్వ స్వభావ సిద్ధాంతాలు నిజంగా లేఖనసంబంధమైనవేనా? అనే విషయాలను హేతుబద్ధంగా మరియు లేఖన ఆధారంగా పరిశీలించబోతున్నాము.
త్రిత్వ సిద్ధాంతాన్ని ఏ మనిషి గ్రహించలేడని, అది ఒక మర్మం అని చెబుతారు. కానీ లేఖనం ఎన్నడూ “త్రిత్వం” (Trinity) లేదా క్రీస్తు యొక్క “రెండు స్వభావాలు” (dual nature) అనే పదాలను ఉపయోగించదు, మరి వాటిని అర్థంకానీ మర్మములుగా నిర్వచించడమైతే అస్సలు చేయదు. అంతేకాక, బైబిల్ లోని గ్రీకు పదమైన ముస్తేరియన్ (μυστήριον — Strong’s #3466) అనేదానిని చాలా ఇంగ్లీష్ బైబిల్స్ లో “Mystery” గా అనువదించబడింది. కానీ నిజంగా ఇప్పటి ఆధునిక అర్థంలో “మర్మం” అనే అర్థం రాదు, దాని అసలైన అర్థం ఆధ్యాత్మికంగా లేదా పరిశుద్ధత విషయంలోని ఓ రహస్యమైన విషయం అనే భావం మాత్రమే.
ది ఎమ్ఫసైజ్డ్ బైబిల్ (Rotherham అనువాదం) ఈ ముస్తేరియన్ అనే పదాన్ని సరిగ్గా “Sacred Secret” (పవిత్ర రహస్యం) అని అనువదించింది. ముస్తేరియన్ అనే పదం “మిస్టరీ” అనే అర్థం ఇవ్వదని అనేక లెక్సికాన్లు (నిఘంటువులు) మరియు బైబిల్ డిక్షనరీల ద్వారా స్పష్టంగా ధృవీకరించవచ్చు. లేఖనాలను గమనించినా ఇదే స్పష్టమవుతుంది.
లేఖనం చెబుతున్నది ఏమిటంటే — దేవుని యొక్క ఎన్నో ముస్తేరియన్లు ఇప్పుడు వెల్లడించబడ్డాయి. అంటే అవి అవిచ్ఛిన్నమైన, తెలియని మిస్టరీలు అని కాదు. అవి దేవుని రహస్యాలు — అయితే ఇప్పుడు అవి ప్రజలకు తెలియజేయబడ్డాయి. (ఉదా: రోమా 16:25-26; 1 కోరింథీయులు 2:7-10; ఎఫెసీయులు 3:4-5; కొలస్సయులు 1:26).
ఇవేమీ అంతుచిక్కని మిస్టరీలు కాదు — ఇప్పటికీ బైబిల్ లో స్పష్టంగా వెల్లడించబడిన దేవుని రహస్యాలు మాత్రమే.
కొన్ని సిద్ధాంతాలను ప్రజలకు “మర్మం” అని బోధించడం అనేది ఒక కుయుక్తి, త్రిత్వం లాంటి అసంబద్ధమైన సిద్ధాంతాలకు సమర్ధనగా ఉండుటకు ఈ పదం ఉపయోగించడం జరిగింది. ఎవరు వీటిని ప్రశ్నించినా, హేతువాదులుగా ముద్రవేయబడి, వేధింపులకు గురయ్యారు. అందుకే మర్మం“Mystery” అనేది అసలైనది అనువాదం కాదు.
లేఖనంలో కొన్ని విషయాలను “మర్మాలుగా” అనువదించబడ్డాయి.
ఉదా: యూదులు కాకుండా ఇతర జాతులకు కూడా రక్షణ (రోమా. 11:25; ఎఫె. 3:4-6), మరియు జీవించి ఉన్న మీరు ఒక రెప్పపాటు క్షణంలో మార్చబడతారన్నది (1 కొరి. 15:51).
కానీ త్రిత్వ సిద్ధాంతం గానీ, యేసు యొక్క రెండు స్వభావాలను గానీ ఎక్కడా ముస్టేరియన్ అని పిలవబడలేదు. అవి నిజమైన లేఖన సిద్ధాంతాలు అయితే, అవి కూడా దేవుని రహస్యాలుగా లేఖనంలో ఖచ్చితంగా ఉండేవి. లేనందువల్ల అవి లేఖనానికి చెందిన సిద్ధాంతాలు కాదని చెప్పటమే ఉత్తమమైన నిర్ధారణ.
త్రిత్వ సిద్ధాంతం, క్రీస్తు యొక్క రెండు స్వభావాలు “మర్మాలు” కావు — అవి పరస్పర విరుద్ధమైనవి.
“యేసు శాశ్వతంగా జన్మించినవాడు”,
“ఒక దేవునిలో ముగ్గురు వ్యక్తులు”,
“యేసు 100% మనిషి మరియు 100% దేవుడు”
అనే సిద్ధాంత వ్యాఖ్యానాలు సాదా భాషలో అన్వయించలేనివి, పరస్పరంగా విరుద్ధమైనవి. ఇదే విషయాన్ని వందేళ్లకు పైగా క్రితమే విలియం జి. ఎలియట్ పేర్కొన్నారు: “ఒక రహస్యం మరియు దాని విరుద్ధత అనేవి రెండూ ఒకదానికొకటి వ్యతిరేఖమైనవి. రహస్యం మనకు అంతుపట్టని విషయం లేదా అస్పష్టంగా కనిపించేది అని అర్థం. రెండవది విరుద్ధం, స్పష్టంగా తప్పుడు విషయం అని అర్థం. రెండు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు ఒకే సమయంలో నిజమయ్యే వీలుండదు.
కాబట్టి ఒక భవిష్యత్తుకు సంబంధించిన దినమును గురించి క్రీస్తు తనకు తెలియదని చెప్పినప్పుడు (మార్కు 13:32 చూడండి), ఆయనను సర్వజ్ఞుడని చెప్పడం అంటే ఆయన స్వయంగా చెప్పిన దానిని కూడా అంగీకరించకుండా నిరాకరించడమే.” (Discourses on the Doctrines of Christianity, American Unitarian Association, Boston, 1870, p. 6)
యేసు క్రీస్తుకు ఉన్నవని భావించే రెండు స్వభావాలు లేఖనం ఎక్కడా చెప్పలేదు. పైగా ఇది దేవుడు ఏర్పాటు చేసిన సహజ నియమాలను వ్యతిరేకిస్తుంది. రెండు విభిన్నమైన లక్షణాల్లో 100% ఉండడం సాధ్యమే కాదు. యేసు 100% దేవుడూ, 100% మనిషీ కావడం అనేది “రహస్యం” కాదు — అది కేవలం విరుద్ధతతో కూడిన మూఢనమ్మకం మాత్రమే.
లేఖనం స్పష్టంగా అనేక చోట్ల యేసు మనిషేనని చెబుతుంది. ఆయన దేవుడని అనిపించే కొన్ని వాక్యాలు పాఠాంతరంగా అనిశ్చితంగా ఉండడం గాని, యూనిటేరియన్ దృక్పథంలో అర్థమయ్యేలా అనువదించుకోవడం గాని చేయవచ్చు. పైగా, యేసు చేసిన అద్భుత కార్యాలు ఆయన దేవుడని నిరూపించవు. అవన్నీ దేవుని శక్తితో, దేవుడు ప్రవక్తల ద్వారా చేసినట్లుగానే, యేసు ద్వారా కూడా జరిగాయి (అ.కా. 2:22).
“ద్వంద్వ స్వభావం” సిద్ధాంతంలో ఒక భయంకర లోపం ఏమిటంటే, యేసులోని రెండు స్వభావాలు ఒకదాని గురించి మరొకటి తెలుసుకోవాల్సి ఉంటుంది. యేసు యొక్క దైవ స్వభావం ఆయన మానవ స్వభావం గురించి తెలుసుకుంటుంది. కానీ త్రిత్వ సిద్ధాంతం ప్రకారం, యేసు యొక్క మానవ స్వభావం ఆయన దేవుడని తెలుసుకుంది, అందుకే త్రిత్వవాదులు యేసు తాను దేవుడని బోధించాడని చెప్తారు. కానీ యేసుకు తాను దేవుడని తెలిసి ఉంటే, “కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై, దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమునుగల ప్రధానయాజకుడగు నిమిత్తము, అన్నివిషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసివచ్చెను.” (హెబ్రీ. 2:17) అని చెప్పినప్పుడు అది తప్పు అవుతుంది. ఎందుకంటే యేసు 100% దేవుడు మరియు 100% మానవుడుగా అదే సమయంలో ఉంటే, ఆయన ఇతర మానవుల వలె సంపూర్ణంగా మానవుడు కాలేదన్నమాట.
ఉదాహరణకు, ఆయన దేవుని స్వభావంలో ఉన్నప్పుడు ఏ విషయానికీ శోధనకు లోనుకాడు (యాకోబు 1:13). కానీ ఆయన మనుష్య స్వభావానికి ఆ జ్ఞానం, అదే భరోసా ఉంటే, ఆయన మనుష్య భాగం కూడా శోధనకు లోనవకుండా ఉండేది. కానీ హెబ్రీయులకు 4:15 ప్రకారం, ఆయన మనమందరం ఎదుర్కొనే ప్రతి విషయంలోనూ ఆయనకు శోధన వచ్చింది.
అంతేకాక, దేవునికి మనుషులలాగా సమస్యలు, అనిశ్చితి, ఆందోళనలు ఉండవు. యేసు తాను దేవుడినని నిజంగా తెలుసుకుంటే, ఆయనకూ అవి ఉండేవి కావు. అదీ కాక, లూకా 2:52 ప్రకారం, ‘యేసు జ్ఞానంలో పెరిగాడు’. కానీ, యేసు యొక్క మనుష్య భాగం ఆయన దేవత్వ భాగాన్ని అందుబాటులో ఉంచుకున్నట్లయితే, ఆయనకు అనంతమైన, సహజమైన జ్ఞానం ఉండేది. అలాగే, హెబ్రీయులకు 4:15 ప్రకారం, యేసు తన అనుభవించిన బాధల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. కానీ, ఆయన మనుష్య భాగం తన దేవత్వ భాగాన్ని ఉపయోగించగలిగితే, ఆయనకు ఏదైనా నేర్చుకోవాల్సిన అవసరం ఉండేదే కాదు.
కెనోటిక్ త్రిత్వవాదులు యేసు తన దైవ స్వభావాన్ని తగ్గించుకున్నాడు లేదా పరిమితం చేసుకున్నాడని వాదిస్తారు, కానీ ఆ వేదాంతం కేవలం హెబ్రీయులకు 4:15లో వచనాలను సమన్వయం చేయడానికి అభివృద్ధి చేయబడింది. తాను దేవుడని తెలుసుకునే లేదా దేవుడిగా అనుభవించే వాటిని పరిమితం చేయగలడనే ఆలోచన లేఖనంలో ఎక్కడా బోధించబడలేదు లేదా వివరించబడలేదు, మరియు కెనోటిక్ త్రిత్వవాదం అచ్చం ఈ కారణంతో సాంప్రదాయ త్రిత్వవాదులచే తిరస్కరించబడింది. కెనోటిక్ త్రిత్వవాదులు క్రీస్తు యొక్క మానవ అనుభవాల గురించి వివరించాలంటే మరియు “కష్టమైన వచనాలను” వివరించాలంటే చాలా సులభమైన మార్గం ఏమిటంటే, యేసు పూర్తిగా మానవుడని, అదే సమయంలో అయిన దేవుడు కాదని గ్రహించడమే.
ముగింపు
దేవుని వాక్యం మనలను అయోమయానికి కాదు, సత్యజ్ఞానానికి నడిపిస్తుంది. లేఖనంలో వెల్లడించబడిన “పవిత్ర రహస్యాలు” చివరికి దేవుని చిత్తాన్ని మనుష్యులకు స్పష్టంగా తెలియజేయడానికే ఇవ్వబడ్డాయి. కానీ త్రిత్వ సిద్ధాంతం మరియు “రెండు స్వభావాలు” వంటి బోధనలు స్పష్టమైన లేఖన బోధల కంటే తాత్విక విరుద్ధతలపై ఎక్కువగా ఆధారపడుతున్నట్లు కనిపిస్తుంది.
యేసు గురించి లేఖనం నిరంతరం చెబుతున్న ప్రధాన సత్యం ఏమిటంటే — ఆయన దేవునిచే అభిషిక్తుడైన మెస్సీయా, దేవుని కుమారుడు, మనుష్యులలో నిజమైన మనిషి. ఆయనకు దేవుడు శక్తినిచ్చాడు, జ్ఞానమిచ్చాడు, కార్యములను చేయించాడు. ఈ సరళమైన సత్యాన్ని అంగీకరించినప్పుడు మాత్రమే యేసు జీవితము, శోధనలు, విధేయత, బాధలు, మరియు ఆయన ద్వారా వచ్చిన రక్షణ పూర్తిగా అర్థవంతమవుతాయి.
సత్యం అనేది అర్థంకాని విరుద్ధతలలో దాగి ఉండదు; అది దేవుని వాక్యంలో స్పష్టంగా ప్రకాశిస్తుంది.
——————
Priest.
Vijaya Kumar Panta