ఈ ఆలయ వ్యవస్థాపకులు శ్రీ శివకోటి శివయ్యస్వామి వారు. ఈ ఆలయమునకు శివకోటి అని పేరు. ఇవి సార్థక నామధేయములు. ఎందుకనగా శివయ్యస్వామి వారు గురువుల చేత ఆదేశింపబడిన వారై శివపంచాక్షరి మహామంత్రమును కోటి సార్లు జపము చేసి ఈ ఆలయమును నిర్మించి శివకోటి అని పేరు పెట్టిరి. శ్రీ శివకోటి శివయ్యస్వామి వారి ఆత్మను ఉద్దరించిన సద్గురువులు హనుమత్ స్వరూపులు శ్రీశ్రీశ్రీ కల్లూరి వెంకట నారాయణస్వామి వారు బ్రహ్మిభుతులైన తరువాత
శ్రీ శివకోటి శివయ్యస్వామి శ్రీశ్రీశ్రీ పూర్ణానంద స్వామి వారిని ఆశ్రయించినారు. శ్రీ పూర్ణానంద స్వామి వారు బాల్యమునందే తమిళనాడు లోని తామ్రపర్ణి అడవిలోని సిద్దగుహలో ఘోర తపము చేసి సిద్ధపురుషులై భక్తుల కోరిక మేరకు శ్రీశైల మహాక్షేత్రంలో ఆశ్రమం నిర్మించి ఆర్తుల బాధలను తీరుస్తూ, ఆస్తిక సాధకులకు చక్కటి తపోసాధనయందు శిక్షణయిస్తూ చాల మందిని ఉధరించినారు. అందు, వారి అత్యంత ప్రియ శిష్యులై, మన శివకోటి శివయ్య స్వామి వారు, వారి శిక్షణలో 12 సంవత్సరములు సాధన చేసి అనేక మంత్ర దీక్షలు పొంది శ్రీ గురువుల అనుగ్రహం చేత లోక కల్యానార్థమై మహా యాగములు చేసారు. అందులో కొన్ని మాత్రము ఈ క్రింద తెలియజేయబడినవి. శ్రీ యజుర్వేద యజ్ఞము,ఆవహన్తి యాగము, ఐదు సహస్ర చండియాగములు, సంపత్కరి శ్రీ యాగము, 41 రోజుల పాటు ధీర్ఘసత్ర యాగము, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రములలో ప్రతి క్షేత్రమునందు రుద్రయాగము, పార్థివ సహస్ర లింగార్చన, చండియాగములు,అష్టాదశ శక్తి పీఠం ల యందు దేవి యాగములు, త్రైయంబకములో అమృత పాశుపత మాహా రుద్ర యాగము, గోదావరి జన్మస్థానమైన బ్రహ్మగిరి యందు శివ ప్రతిష్ట, గౌతమ అహల్య విగ్రహ ప్రతిష్ట చేసినారు మరియు లక్షత్రయ పూజ సహితముగా వాయల్పాడు గ్రామమునందు శివ ప్రతిష్ట చేసినారు. శ్రిగురువుల చేత ఆదేశింపబడిన వారై క్షేత్ర అభివృధి కోసం 1. శ్రీశైలం, 2.మహానంది, 3.శ్రీకాళహస్తి, 4.గోకర్ణం, 5.కంచి, 6.కాశి, 7.తిరువన్నామలై, 8.రామేశ్వరం, 9.జంబుకేశ్వరం, 10.చిదంబరం, 11.తామ్రపర్ణి క్షేత్రాలలో శివపంచాక్షరి సంపుటిత మహారుద్రయాగములు (1331 సార్లు రుద్రా స్వహకారము), సహస్ర లింగార్చనలు, శతచండి యాగములు చేసి ఆ ఫలితాన్ని ఆక్షేత్ర దేవతకు భక్తీ పూర్వకముగా సమర్పించినారు.