‘ఆధ్యాత్మికతకు విశ్వరూప ప్రదర్శనం’ ‘దర్శనమ్’
ఆధ్యాత్మిక సాహిత్య ప్రచార ప్రస్థానంలో ‘దర్శనమ్’ అప్పుడే పద్దెనిమిదేళ్ల కాలాన్ని పూర్తిచేసుకొని, పంతొమ్మిదో సంవత్సరంలోకి అడుగిడుతూ అష్టాదశవార్షికోత్సవ సంరంభాన్ని జరుపుకుంటోంది. ఆధ్యాత్మిక పత్రికారంగంలో ఇన్నేళ్లు నిరంతరాయంగా, నిర్విఘ్నంగా కొనసాగడం ఒక ప్రత్యేకత. ఆ ప్రత్యేకతను నిలుపుకొంటూ తనదైన విలక్షణ శైలిలో నడవడం ‘దర్శనమ్’కు గల విశిష్టత. ఇంతటి వైభవాన్ని త
నలో దాచుకొన్న ఈ అరుదైన పత్రికను అభినందించవలసిందే.
భారతీయుల ఆధ్యాత్మికత ఒక వివ్వరూపం లాంటిది. దానికి ఆదీ, అంతం లేనేలేవు. భారతీయుల ఆధ్యాత్మికతకు మూలాలు వేదాలు. ఇవి ఎప్పుడూ ప్రారంభమయ్యాయో ఎవరికీ తెలియదు. ‘యః కల్పః స కల్పపూర్వః’ అన్నట్లు ప్రతి కల్పంలోనూ సృష్టితోబాటు వేదవాఙ్మయాన్నీ లోకంలో బ్రహ్మదేవుడు ప్రవర్తింపజేస్తాడని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అంటే వేదాలకు మూలకాలం ఏదో ఎవరికీ తెలియదు. అవి ప్రతికల్పంలోనూ పరమాత్ముని అనుగ్రహంతో లోకానికి అందుతాయి. వాటిని ఆధారం చేసుకొనరి లోకంలో సాహత్య సృష్టి జరుగుతుంది. అదుకే అవి అపౌరుషేయాలని కీర్తి గడించాయి. అపౌరుషేయాలైన వేదాలే మానవజీవితంలోని చతుర్విధ పురుషార్థాలైన ధర్మార్థకామమోక్షాలకు ఆధారాలు. వేదాలు లేనిదే ధర్మస్వరూపం తెలియదు. వేదాలు లేనిదే అర్థమూల్యం అవగతంకాదు. వేదాలు లేనిదే కామలక్ష్యం విదితంకాదు.వ ఏదాలు లేనిదే మోక్షసాధన అసాధ్యం. ఇలా భారతీయుల జీవితమంతా వేదాలతోనే ముడివడి ఉంది. వేదాలు అనంతాలు. అవి సంఖ్యాప్రమాణంలో ఎన్ని ఉన్నాయో ఎవరికీ తెలియదు. ప్రాచీన కాలంలో లభించినన్ని శాఖలూ, భాగాలూ నేడు లభించడంలేదు. కాలక్రమంలో మనుస్యుని అజాగరూకతవల్ల అవి లుప్తమైపోయాయి. మనిషి తన అశక్తతతో వాటిని రక్షించుకోలేకపోయాడు. కనబడకుండా పోయినవి పోగా, ప్రస్తుతం లభిస్తున్న శాఖలు శతాధికాలే. వాటినిపూర్తిగా చదవాలంటే మనిషికి ఒక జన్మ చాలదు. మరిన్ని జన్మలు కావాలి. జన్మరాహిత్యం కోసం తపించే మనిషి ఒక్కజన్మలోనే వీటినన్నింటినీ చదివి తెలుసుకోవాలి. ఇది సాధ్యమా? అంటే కానే కాదు. అలాంటప్పుడు వేదవ్మాయంలోని అపారజ్ఞానరాశిని సంక్షిప్త సుందరంగా, అరటిపండు ఒలిచి నోటిలో పెట్టినట్లు సులభశైలిలో అందించే సాహిత్యం కావాలి. అది ఎక్కడ లభిస్తుంది? అంటే ‘దర్శనమ్’ పత్రిక దానికి సమాధానం చెబుతుంది.
‘దర్శనమ్’ ఆధ్యాత్మికతకు విశ్వరూప ప్రద్శనం లాంటి పత్రిక. దీనిలో అనేకాధ్యాత్మికాంశాలు వివిధ వ్యాసరూపాలలో సాక్షాత్కరిస్తాయి. భారతీయులకు ఆత్మలైన వేదాలలోని ఉపనిషత్తులతో ప్రపంచీకృతం అయిన వాదోపవాదాలూ, చర్చలూ, ప్రశ్నోత్తరాలూ ఇందులో ఆవిష్కతాలైనాయి. చతుర్విధ పురుషార్థ సాధనకు పట్టుకొమ్మలైన రామాయణ, భారత, భాగవతేతిహాసాలలోని రమణీయకథలూ, కమనీయ ఘట్టాలూ సుందర వర్ణనలతో అలరారుతున్నాయి. ప్రస్థాన త్రయాలలోని ఉపనిషత్తులనూ, బ్రహ్మసూత్రాలనూ, భగవద్గీతనూ అన్ని కోణాలనుండి అధ్యయనం చేసి విడమరచి చెప్పే విద్వాంసుల రచనలు ఈ పత్రికకు అలంకారాలు. శంకర భగవత్పాదులవంటి జగద్గురువులు రచించినర స్తోత్రసాహిత్యం తొలిపుటలోనే పులకరింపజేస్తుంది. మహర్షుల స్తోత్ర వాఙ్మయం మానవాళికి లభించిన అపూర్వవరం. ఈ స్తోత్రాలలో భక్తి జ్ఞానవైరాగ్యాలు అంతర్గర్భితంగా ఉంటూ, మనుష్యులను సన్మార్గాలవైపు పయనింపజేస్తున్నాయి. మనిషికి ప్రాథమిక దశలో ఏర్పడవలసింది భక్తి. ఏ పనిమీద అయినా భక్తి లేనిదే శక్తి రాదు. శక్తి రానిదే రక్తి రాదు. రక్తి రానిదే ముక్తిలేదు. పూజకు కావలసింది భక్తి. అర్చనకు కావలసింది భక్తి. సేవకు కావలసింది భక్తి. జపానికి కావలసింది భక్తి. తపస్సుకు అవసరమైంది భక్తి. ఇలా ప్రతి చర్యకూ భక్తి మూలం. అది లేనిదే మనస్సు ఏకాగ్రం కాదు. అందుకే శంకరభగవత్పాదులు. శివానందలహరిలో - మనస్సు ఒక కోతి లాంటిదనీ, దాన్ని కట్టడి చేయడానికి భక్తిని గొలుసుగా మార్చుకోవాలనీ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ చెబుతాడు. ఈశ్వరానుగ్రహం వల్లనే భక్తి సాధ్యం. అలా దైవానుగ్రహాన్ని కలిగించే భక్తి సాహిత్యం ‘దర్శనమ్’లో కనబడుతుంది. భక్తి జ్ఞానానికి దారి తీస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. భక్తి అంటే సేవాభావం. తాదాత్మ్యభావం. ఏది లేకుంటే మనిషి జీవించలేడో అదే భక్తి. బక్తి లేకుండా మనిషి ఏ పనిలోనూ ఫలితాన్ని పొందలేడు. అనేక విజయాలను సాధించిన మహాత్ములు లోకంలో ఎందరో ఉన్నారు. వారి జీవితచరిత్రలను పరిశీలించినప్పుడు వారు ఎంత భక్తి గలవారో అర్థమౌతుంది. భక్తిద్వారా లభించిన జ్ఞానం మనిషికి సత్యపదార్థాలను గుర్తించే శక్తిని ప్రసాదించి, కృతార్థుణ్ణి చేస్తుంది. సత్యపదార్థజ్ఞానమే నిజమైన జ్ఞానం. అసత్యాన్ని తెలుసుకుంటే జ్ఞానం కలిగినట్లు కాదు. సత్యాన్ని తెలుసుకుంటేనే జ్ఞానం కలిగినట్లు. అందుకే ఉపనిషత్తులో సైతం - ‘అవిద్యాయామన్తరే వర్తమానాః, స్వయంధీరాః పండితం మన్యమానాః, దంద్రమ్యమాణాః పరియన్తి మూఢాః అంధేనైవ నీయమానా యథాంధాః’ అని పేర్కొనబడింది. అంటే అసత్యాలలో మ్రగ్గిపోతున్నమూర్ఖులు కొందరు తామే ధీరులమనీ, పండితులమనీ విర్రవీగుతుంటారు. వారు తమ అజ్ఞానంలో తామే కొట్టుమిట్టాడుతూ, ఆ చక్రంలోనే తిరుగుతుంటారుగానీ, సత్యపథంవైపు రారు’ అని అర్థం. ఇలా జ్ఞానప్రకాశాన్ని వెలిగించే ఉపనిషత్తుల దర్శనాలకు ‘దర్శనం’ ఒక నెలవు. జ్ఞానం వైరాగ్యకారకం. వైరాగ్యం అంటే సంసారాన్ని వదలి సన్యాసులలో కలవడం అని కాదు అర్థం. సంసార జీవనంలోనే ఉంటూ, దేనికీ భయపడకుండా నిశ్చలంగా, ధైర్యంగా జీవించడం అని అర్థం. మనిషికి తప్పు చేస్తే ఏమౌతుందో తెలుసు. తెలిసినా ఎందుకు తప్పు చేస్తున్నాడనేది ప్రశ్న. దీనికి కారణం వైరాగ్యభావం లేకపోవడమే. భౌతిక సౌఖ్యాలే శాశ్వతాలని అనుకుంటున్నంతకాలం మనిషిక వైరాగ్యం కలుగదు. భౌతిక సుఖాలు అశాశ్వతాలనీ, అవి ఎడారిలో ఎండమావుల వంటివనీ తెలిసినప్పుఉ వాటికోసం తపించే అవసరం ఉండదు. సుఖం జీవితంలో ఒకభాగమే అయినా సుఖమే జీవితంకాదు. కష్టం కూడా జీవితమే. తీపి ఒక్కటే జీవితంకాదు. ఉప్పు, పులుపు, వగరు, కారం, చేదూ కూడా జీవితంలోని భాగాలే. ఈ సత్యాన్ని మనిషి గుర్తించాలి. ఇలాంటి విషయాలను గుర్తుకు తెస్తుంది ‘దర్శనమ్’.
ప్రపంచానికి మార్గదర్శనం చేస్తున్న యోగులూ, విరాగులూ, పీఠాదిపతులూ, మౌనులూ, అధ్యాత్మవిదులూద ఎందరో ఉన్నారు. వారి జీవితాలు ఆదర్శప్రాయాలు. ఒక మహాత్ముని జీవితంలో కనబడే కష్టాలు ఇన్నీ అన్నీ కావు. బంగారాన్ని నిప్పులో వేస్తేనే దాని వన్నె తెలుస్తుంది. అలాగే మహనీయుల జీవితాలలో నిప్పులకుంపట్ల వంటి అనుభవాలుంటాయి. వాటిని అనుభవించి, సద్గుణాలతో వన్నెకెక్కిన సత్పురుషుల జీవితాలను పరిచయం చేస్తోంది ‘దర్శనమ్’.
ఆధ్యాత్మికత అనేది ఒకరు ఇస్తే వచ్చేదికాదు. ప్రతిమనిషీ సాధించి, హృదయంలో నింపుకోవలసిన అమృతం. ఈ అమృతం ‘దర్శనమ్’ పత్రికలో లభిస్తుంది. పదార్థం తీపిగా ఉందని ఇతరులు చెప్పినంతమాత్రాన ఎవరికీ నాలుకపై తీయదనం అనుభవంలోకి రాదు. తామే స్వయంగా ఆ తీయటి పదార్థాన్ని తిన్నప్పుడే దాని రుచి తెలుస్తుంది. ఆధ్యాత్మికత కూడా అంతే. వేషాలతోనూ, ఆడంబరాలతోనూ అసలే రాదు. ప్రచారాలు చేస్తే అవగతం కాదు. అనుభూతి అనేది డబ్బుతో కొనే పదార్థంకాదు. ఎవరికివారు తాము స్వయంగా పూనుకొని దైవాన్ని సేవించాలి. పూజించాలి. అధ్యయనం చేయాలి. ప్రవచనంతో తృప్తి చెందాలి. ఆచరణతో నిగ్గుతేలాలి. అప్పుడే మనిషి జీవితం చరితార్థమౌతుంది. మనిషి జీవితంలో ఆనందానుభూతి వెల్లివిరుస్తుంది. అందుకు మార్గాన్ని నిర్దేశిస్తోంది - ‘దర్శనమ్’.
ఆధ్యాత్మికజ్ఞానాన్ని అనేక కోణాలతో ప్రతిబింబిస్తున్న రుచిరమైన పత్రిక దర్శనమ్. ఇందులో సాధకులకోసం స్తోత్రాలూ, పాఠకులకోసం కథలూ, చరిత్ర జ్ఞానం కోసం గాథలూ, సామాన్యులకోసం చిత్రకథలూ, మేధావులకోసం పదకేళులూ, జ్యోతిష పరిజ్ఞానం కోసం రాశిఫలాలూ, నిత్యతిథి వార నక్షత్రయోగ కరణ పరిజ్ఞానం కోసం మాసపంచాంగం, ఇలా ఒక్కటేమిటి? ఎన్నో ఎన్నెన్నో కొత్త కొత్త ప్రయోగాలతో అలరించే ఆధ్యాత్మిక విజ్ఞానానికి ఇది ఒక పేటిక. సమాజంలో ప్రధానంగా జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలపైనా సమగ్ర సమీక్షణాలు దర్శనమ్ లో దర్శనమిస్తాయి. పదకొండేళ్లుగా ఏకాదశరుద్రులవలె అవతారం ఎత్తిన ఈ పత్రిక భద్రంగా ఎన్నో శ్రేయోదాయక విషయాలను ప్రోదిచేసింది. ఆధ్యాత్మికతకు ఒక విజ్ఞాన సర్వస్వంవలె తీర్చిదిద్దడానికి సంపాదకమండలి అహరహం కృషి సలుపుతున్నది. వారి తపన పత్రికలో అడుగడుగునా కనబడుతుంది.
మామూలుగా ఒక చిన్న పత్రికను నడపడమే కష్టసాధ్యం. అలాంటిది ఒక సమగ్రజ్ఞాన వాహిక వంటి ఆధ్యాత్మిక పత్రికను నిరాఘాటంగా 18ఏళ్లకుపైగా నడపడం అంటే గొప్ప సాహసమే. ఉత్సాహం ఉంటేనే విజయం లభిస్తుంది అని అంటాడు భాసమహాకవి. అటువంటి ఉత్సాహ సాహసాలు దర్శనమ్ సంపాదకులకు నిత్యక్రీడలే. దీని వెనుకగల సంకల్పశక్తి అభినంద్యం. ఎంత దృఢమైన సంకల్పశక్తి ఈ పత్రికా నిర్వాహకులకు ఉన్నదో తెలుసుకోవాలంటే ఈ పత్రిక ప్రారంభం నుండి నేటిదాకా సాగుతూ వస్తున్న నిర్వహణ ప్రస్థాన వైభవాన్ని గమనించాలి. అన్ని విధాలుగా పరిగణ్యమానమైన ఆధ్యాత్మికతరంగం - ‘దర్శనమ్’.
ఇంతటి విశిష్టతనూ, నేపథ్యాన్నీ తనదిగా చేసుకొని సాగుతున్న ‘దర్శనమ్’ చిరకాలం ఇలాగే పాఠకులను అలరిస్తూ, ఈ జగత్తును అధ్యాత్మమయం చేయాలని ప్రతీ పాఠకుడూ కోరుకుంటున్నాడు.
డా।। అయాచితం నటేశ్వరశర్మ