24/05/2020
ఆపన్నులకు అభయ హస్తం అందించడంలో క్రేన్ రెలిజియస్ ట్రస్ట్ ఛైర్మన్ గ్రంధి లక్ష్మీ వెంకట సత్య కాంతారావు అందరి కన్నా ముందే ఉంటారని వైసీపీ గుంటూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాళి గిరి అభినందించారు. దాతృత్వాన్ని ఆయన తండ్రి సుబ్బారావు నుంచి పుణికి పుచ్చుకున్నారని ప్రశంసించారు. తండ్రికి తగ్గ తనయుడిలా వేనోళ్ళా కొనియాడబడుతున్నారని తెలిపారు.
కరోనా కల్లోల కాలంలో ఆలయాలు మూతబడి అలో... లక్ష్మణా అంటున్న అర్చక బ్రాహ్మణులకు క్రేన్ రెలిజియస్ ట్రస్ట్ అండగా నిలిచింది. అటు ఆధ్యాత్మికంలోనూ... ఇటు ఆదుకునే విషయంలోనూ... ఎప్పుడూ ఒకడుగు ముందుండే ట్రస్ట్ ఛైర్మన్ గ్రంధి లక్ష్మీ వెంకట సత్య కాంతారావు వారికి ఉప్పు-పప్పు నుంచి సమస్త నిత్యావసర సరుకులు, అన్ని రకాల కూరగాయలు, పండ్లు తదితరాలను తాంబూలంలో పెట్టి మరీ సమర్పించారు.
ఈ సందర్భంగా అప్పిరెడ్డి, గిరి మాట్లాడుతూ, మానవసేవే- మాధవసేవ అనే సిద్దాంతాన్ని నమ్మి ఆచరిస్తున్న గ్రంధి కాంతారావు ధన్యజీవి అని ప్రశంసించారు. అందరూ తండ్రుల నుంచి ఆస్తులు-అంతస్తులు వారసత్వంగా తీసుకుంటారనీ... ఆయన మాత్రం ఆధ్యాత్మికం, ఆదుకోవడం, అండగా నిలవడం తదితరాలను వారసత్వంగా స్వీకరించారన్నారు. కరోనా కష్టకాలంలో క్రేన్ రెలిజియస్ ట్రస్ట్ పలు రకాల సేవలతో ప్రజోపయోగంగా మారిందని ప్రస్తుతించారు. అందులో భాగంగా నిత్యం భగవన్నామ సంకీర్తనతో బ్రతికే అర్చక బ్రాహ్మణులకు ఈ సమయంలో ఆపన్నహస్తం అందించడం నిజంగా అభినందించదగ్గ అంశమని వ్యాఖ్యానించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు విరివిగా నిర్వహించడం ద్వారా అందరికీ ఆదర్శంగా నిలవాలని అభిలషించారు.
గ్రంధి కాంతారావు మాట్లాడుతూ, కరోనా లాక్డౌన్ మొదలైన నాటి నుంచి తన వంతుగా వితరణ కొనసాగిస్తూనే ఉన్నానని తెలిపారు. కుల, మతాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా శక్తి వంచన లేకుండా సాయం అందిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా కేవలం పౌరోహిత్యం ద్వారానే పొట్ట పోసుకునే 175మంది పేద అర్చకులను గుర్తించి, వారికి అవసరమైన సరుకులు, కూరగాయలు, పండ్లు, ఆకు కూరలు అందించినట్లు వివరించారు. శాస్త్రోక్తంగా తాంబూలం కూడా సమర్పించి వారి ఆశీర్వాదం పొందినట్లు తెలిపారు. క్రేన్ రెలిజియస్ ట్రస్ట్ ద్వారా నిరంతర సేవలు కొనసాగిస్తున్నట్లు కాంతారావు చెప్పారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్గాంధీ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు, కొత్తూరి ప్రవీణ్, కాశీ, టి.ఎల్.వి.ఆంజనేయులు, కాంతారావు మిత్ర బృందం వాసు, పార్ధసారధి, గోకవరపు కుమార్, మణి తదితరులు పాల్గొన్నారు.